Consumer Rights: ₹5.50 గొడవ.. లక్కీ బిర్యాని హౌజ్‌కు రూ.55 వేల వడ్డన

ఐదు రూపాయల కోసం జరిగిన గొడవ.. చివరికి కోర్టు వరకు వెళ్లింది. హోటల్‌కు వెళ్లిన వ్యక్తికి తిన్నదానికంటే రూ.5.50 ఎక్కువగా బిల్లు వేసినందుకు వినియోగదారు హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు.

Published : 18 Jul 2022 12:48 IST

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఐదు రూపాయల కోసం జరిగిన గొడవ.. చివరికి కోర్టు వరకు వెళ్లింది. హోటల్‌కు వెళ్లిన వ్యక్తికి తిన్నదానికంటే రూ.5.50 ఎక్కువగా బిల్లు వేసినందుకు వినియోగదారు హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. కేసును విచారించిన జిల్లా వినియోగదారుల కమిషన్‌-2 బెంచ్‌ అధ్యక్షుడు వక్కంటి నర్సింహారావు తీర్పు వెలువరించారు. ఫిర్యాదీపై పరుష పదజాలం ఉపయోగించడంతో పాటు సేవల్లో లోపం కలిగించినట్లు గుర్తించి.. అదనంగా వసూలు చేసిన రూ.5.50కి 10శాతం వడ్డీతో చెల్లించడంతోపాటు ఫిర్యాదీకి రూ.5వేలు పరిహారం, జిల్లా వినియోగదారుల సంరక్షణ మండళ్ల సంక్షేమం కోసం రూ.50వేలు జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి చెల్లించాలని ఆదేశించారు. చిలుకూరి వంశీ ఉస్మానియా వర్సిటీలోని గౌతమి హాస్టల్‌లో ఉంటూ చదువుతున్నారు. తన నలుగురు స్నేహితులతో కలిసి తిలక్‌నగర్‌లో ఉన్న లక్కీ బిర్యానీహౌజ్‌కు వెళ్లారు. బిల్లు రూ.1,075 జీఎస్టీ కలుపుకొని మొత్తం రూ.1,127.50 అయ్యింది. మినరల్‌ వాటర్‌ బాటిల్‌కు అదనంగా రూ.5 వసూలు చేశారని గుర్తించారు. ప్రశ్నించగా బిర్యానీ హౌజ్‌ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. బలవంతగా తన నుంచి రూ.5.50 అదనంగా వసూలు చేశారని, స్నేహితుల ముందు తనను ప్రతివాద సిబ్బంది అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదీ అందించిన సాక్ష్యాధారాలు పరిశీలించిన బెంచ్‌..ప్రతివాద సంస్థ సేవల్లో లోపం ఉన్నట్లు గుర్తించింది. ఇకపై ఈ పొరపాటు చేయొద్దంటూ మందలిస్తూ 45 రోజుల్లో జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని