Budget 2023: భారత్‌ బ్రాండ్‌ పెరగాలంటే..!

ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అంటే ఆషామాషీగా రాదు. భారత్‌ ఇప్పుడున్న స్థాయిలోనే ఎగుమతులను కొనసాగితే ఏమాత్రం కుదరదు. దీనిని కొన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. 

Updated : 29 Jan 2023 18:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌ ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారేందుకు ముఖ్యం ఇంధన ఎగుమతులే. ప్రస్తుతం భారత్‌లో సుమారు 140 కోట్ల మంది జనాభా ఉండటంతో దేశీయ వినియోగంతోనే ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతోంది. కానీ, ఇది ఒక స్థాయిదాకానే దేశ ప్రగతిని తీసుకెళ్లగలదు. అక్కడి నుంచి ముందుకు పోవాలంటే ఎగుమతులను పెంచుకోవాల్సి ఉంటుంది. 2022లో భారత్‌లో 420 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులను ఎగుమతి చేసింది. ఇదే సమయంలో చైనా ఏకంగా 3.6 ట్రిలియన్‌ డాలర్లను చేయడం గమనార్హం. ఈ గణాంకాలు భారత ఎగుమతుల స్థాయిని చెబుతున్నాయి. ప్రపంచ జీడీపీలో భారత్‌ వాటా 3.1శాతం కాగా.. ఎగుమతుల్లో భారత బ్రాండ్‌ కేవలం 1.6శాతానికే పరిమితమైంది. ఈ నేపథ్యంలో భారత్‌ ఎగుమతులు 1 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకోవాలంటే ప్రభుత్వం బడ్జెట్‌ ప్రతిపాదనలకు పదును పెట్టాల్సిందే.

మరింత ఆకర్షణీయంగా ఆర్‌వోడీటీఈపీ(RoDTEP)..

ఎగుమతులను ప్రోత్సహించేందుకు 2021లో భారత్‌ ‘ది రెమిషన్‌ ఆఫ్‌ డ్యూటీస్‌ అండ్‌ ట్యాక్సెస్‌ ఆన్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రొడక్ట్స్‌’ పథకాన్ని ప్రవేశపెట్టింది. అప్పటికే ఉన్న ‘మర్చండైస్‌ ఎక్స్‌పోర్ట్‌ ఫ్రమ్‌ ఇండియా’ విధానాన్ని ఇది భర్తీ చేసింది. ఈ విధానంలో ఎగుమతిదారులు కేంద్ర, రాష్ట్ర పన్నులను రీఫండ్‌ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. ఆర్‌వోడీటీఈపీ బడ్జెట్‌ ప్రస్తుతం రూ. రూ.40,000 కోట్లు. ఈ మొత్తాన్ని పెంచాలని ఎగుమతిదారులు కోరుతున్నారు. 

కస్టమ్స్‌ డ్యూటీల్లో మార్పులు..

* పూర్తి తయారై వచ్చే ప్లాస్టిక్‌ దిగుమతులపై భారీగా కస్టమ్స్‌ డ్యూటీలను విధించాలని ఆ పరిశ్రమ కోరుతోంది. ఇది పాలీమర్‌ ముడిపదార్థాలపై విధించేదాని కంటే ఎక్కువగా ఉండాలని కోరుతోంది. 

* తోలు పరిశ్రమకు అవసరమయ్యే ముడి పదర్థాల దిగుమతులపై  కస్టమ్స్‌ డ్యూటీని తగ్గించడం లేదా తొలగించడం చేయాలని కౌన్సిల్‌ ఫర్‌ లెదర్‌ ఎక్స్‌పోర్ట్స్‌ కోరుతోంది. పూర్తిగా తయారైన ఉత్పత్తుల దిగుమతిపై మాత్రం కస్టమ్స్‌ను సుంకం విధించాలని అభ్యర్థిస్తోంది. 

* అంతర్జాతీయ నౌకా మార్గాలను భారత్‌ అభివృద్ధి చేయాల్సి ఉంది. అంతర్జాతీయ షిప్పింగ్‌ కంపెనీలపై ఆధారపడటం ఇబ్బందికరంగా మారినట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో భారత్‌లోని పరిశ్రమలనే వీటిని తయారు చేసేలా ప్రోత్సహించాలని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎక్స్‌పోర్ట్స్‌ ఆర్గనైజేషన్స్‌ కోరుకుంటోంది. 

మరిన్ని పీఎల్‌ఐ పథకాలు తేవాలి..

దేశీయంగా తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకాలను ప్రకటించాల్సి ఉంది. ఈ సారి ఆటోమొబైల్‌, ఆటోమొబైల్‌ విడిభాగాలు, ప్రత్యేకమైన స్టీల్‌, టెలికాం, నెట్‌వర్కింగ్‌ పరికరాల పరిశ్రమలను కూడా వీటిల్లో చేర్చాలి. ఈ సారి రూ.35 వేల కోట్ల వరకు పీఎల్‌ఐ పథకానికి కేటాయింపులు ఉండొచ్చని భావిస్తున్నారు. లెదర్‌, సైకిళ్ల తయారీ, టీకాల మెటీరియల్‌ వంటి వాటిని దీనిలో చేర్చే అవకాశాలున్నాయి.

ఆర్థిక మద్దతు అవసరం..

ఎగమతులు చేసే కంపెనీల నగదు అవసరాలు తీరేందుకు తక్కువ వడ్డీకి ఇచ్చేలా ప్రత్యేక ఫండ్‌ను ఏర్పాటు చేయాలని పారిశ్రామిక వర్గాలు కోరుతున్నాయి.  ఈ చర్యతో ఎగుమతులు పెరగడంతోపాటు.. దేశీయంగా ఉద్యోగాలు లభిస్తాయి. ఇక డాలర్‌ బలపడితే ఎగుమతులపై దాని ప్రభావం ఉంటుంది. ప్రభుత్వం ఈ దిశగా మద్దతు ఇవ్వాలని కోరతున్నాయి. 

ఇక ఆర్థిక మాంద్య పరిస్థితుల కారణంగా మార్కెటింగ్‌ ఖర్చులను కంపెనీలు గణనీయంగా తగ్గించుకొన్నాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లలో భారత వస్తువులు కనిపించే పరిస్థితి ఉండదు. ఇప్పటికే ప్రభుత్వం ఇస్తున్న మార్కెట్‌ డెవలప్‌మెంట్‌ అసిస్టెన్స్‌ను మరింత బలపర్చాలి. ఇప్పటికే దీనికి కేటాయించిన రూ.200 కోట్ల మొత్తాన్ని గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు