ISB: ఐఎస్‌బీ విద్యార్థులకు రూ.34.21 లక్షల సగటు వేతనం

ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ)లో 2023 బ్యాచ్‌ పీజీపీ (పీజీ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌) విద్యార్థులకు ప్రాంగణ ఎంపికల ద్వారా అత్యంత ఆకర్షణీయ ఉద్యోగాలు, వేతనాలు లభించాయి.

Updated : 22 Dec 2022 10:33 IST

2023 పీజీపీ బ్యాచ్‌కి 1578 ఉద్యోగ ఆఫర్లు
ప్రాంగణ ఎంపికలో పాల్గొన్న 222 కంపెనీలు 

ఈనాడు, హైదరాబాద్‌: ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ)లో 2023 బ్యాచ్‌ పీజీపీ (పీజీ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌) విద్యార్థులకు ప్రాంగణ ఎంపికల ద్వారా అత్యంత ఆకర్షణీయ ఉద్యోగాలు, వేతనాలు లభించాయి. సగటున ఒక్కో విద్యార్ధికి రూ.34.21 లక్షల వార్షిక వేతనం ఇచ్చేందుకు కంపెనీలు ముందుకొచ్చాయి. ఐఎస్‌బీ పీజీపీలో చేరకముందు వారికి లభించిన సగటు వార్షిక వేతనం రూ.13.39 లక్షలు. దీంతో పోల్చితే ప్రస్తుత సగటు వేతనం 2.5 రెట్లు ఎక్కువైందని ఐఎస్‌బీ పేర్కొంది.

ఈ రంగాల నుంచి గిరాకీ: ప్రాంగణ ఎంపికల్లో 222 కంపెనీలు పాల్గొని 1578 ఉద్యోగ ఆఫర్లు ఇచ్చాయి. కన్సల్టింగ్‌, ఐటీ/ఐటీఈఎస్‌, ఇంజినీరింగ్‌ టెక్నాలజీ, బీఎఫ్‌ఎస్‌ఐ, ఎఫ్‌ఎంసీజీ/ రిటైల్‌ రంగాల కంపెనీలు అధికంగా వచ్చాయి. ఈ సారి 30 కొత్త కంపెనీలు ప్లేస్‌మెంట్‌ ప్రక్రియలో పాల్గొన్నాయి. 36 అంతర్జాతీయ కంపెనీలు కూడా పాల్గొని, ఉద్యోగ ఆఫర్లు ఇచ్చాయి. లీడర్‌షిప్‌/ జనరల్‌ మేనేజ్‌మెంట్‌ ఉద్యోగాలను ఇవి ఆఫర్‌ చేశాయి.

* 2023 బ్యాచ్‌ పీజీపీలో 36% విద్యార్థినులు ఉండటం ప్రత్యేకత. మొత్తం ఉద్యోగ ఆఫర్లలో 40 శాతం వారికే లభించాయి.

అవసరాలకు అనుగుణమైన బోధన వల్లే: ఎంతో వేగంగా మారుతున్న వ్యాపార రంగ స్థితిగతులకు అనుగుణంగా పీజీపీ పాఠ్యప్రణాళికను మార్చడం, బోధనా పద్ధతుల్లో వినూత్న విధానాలు అనుసరించడం ద్వారా విద్యార్థులను సమర్థంగా తీర్చిదిద్దుతున్నట్లు ఐఎస్‌బీ డిప్యూటీ డీన్‌ ప్రొఫెసర్‌ రామభద్రన్‌ తిరుమలై అన్నారు. అందువల్లే తమ విద్యార్థులకు ఎక్కువ కంపెనీల నుంచి ఉద్యోగ ఆఫర్లు లభించాయని, అధిక జీతభత్యాలు పొందగలుగుతున్నారని తెలిపారు. ప్రస్తుత ప్లేస్‌మెంట్‌ ప్రక్రియే  దీనికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఐఎస్‌బీకి హైదరాబాద్‌, మొహాలీలో ప్రాంగణాలున్నాయి. గత మూడేళ్లుగా ఈ రెండు ప్రాంగణాల విద్యార్థులకు ఉమ్మడిగా ప్లేస్‌మెంట్‌ ప్రక్రియ నిర్వహిస్తున్నారు.


మిత్సుబిషి కోసం ఆజాద్‌ ఇంజినీరింగ్‌ ప్రత్యేక యూనిట్‌

రూ.165 కోట్లతో తునికిబొల్లారం వద్ద 

ఈనాడు, హైదరాబాద్‌: మిత్సుబిషి హెవీ ఇంజినీరింగ్‌కు గ్యాస్‌, స్టీమ్‌ టర్బైన్లలో వినియోగించే విడిభాగాలు ఉత్పత్తి చేసి అందించేందుకు ఆజాద్‌ ఇంజినీరింగ్‌ ప్రత్యేకంగా ఒక యూనిట్‌ ఏర్పాటు చేయనుంది. మేడ్చల్‌ సమీపంలోని తునికిబొల్లారం వద్ద 11,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ యూనిట్‌ నిర్మాణానికి 20 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.165 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ఆజాద్‌ ఇంజినీరింగ్‌ ఎండీ రాకేష్‌ ఛోప్దార్‌ తెలిపారు. ఏడాదిన్నరలో నిర్మాణం పూర్తిచేసి ఉత్పత్తి చేపడతామని, దీనివల్ల కొత్తగా 300 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. ్టదీర్ఘకాల అనుబంధం ఫలితంగా మిత్సుబిషీకి ఓఈఎం (ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ మానుఫ్యాక్చరర్‌) భాగస్వామిగా ఎదిగినట్లు వివరించారు. ఆజాద్‌ ఇంజినీరింగ్‌ నైపుణ్యం, సమర్థత వల్లే తమ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకుంటున్నట్లు మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్‌ సీఈఓ కె.తనక తెలిపారు. ఆజాద్‌ ఇంజినీరింగ్‌ ప్రస్తుతం జీఈ, సీమెన్స్‌, తొషిబా, మ్యాన్‌, దూసాన్‌ స్కోడా, జీఈ ఏవియేషన్‌, బోయింగ్‌, హనీవెల్‌, ఈటన్‌, రాఫెల్‌ తదితర అంతర్జాతీయ సంస్థలకు పలు రకాల విడిభాగాలు అందిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు