Anil Ambani: అయ్యో.. అనిల్‌ అంబానీ

అనిల్‌ అంబానీకి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. 2008లో ప్రపంచ కుబేరుల్లో ఆరో స్థానంలో ఉన్న అనిల్‌ ప్రస్తుతం ఆ జాబితాలోనే కనిపించకుండా పోయారు.

Updated : 11 Apr 2024 16:27 IST

రూ.8,000 కోట్లు వచ్చినట్లే వచ్చి.. వెనక్కి..

దిల్లీ: అనిల్‌ అంబానీకి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. 2008లో ప్రపంచ కుబేరుల్లో ఆరో స్థానంలో ఉన్న అనిల్‌ ప్రస్తుతం ఆ జాబితాలోనే కనిపించకుండా పోయారు. కొన్నేళ్లుగా ఆర్థికంగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉండటం ఇందుకు కారణం. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు రూపేణ మరో ప్రతికూల ప్రభావం పడింది. అనిల్‌ అంబానీ రిలయన్స్‌ గ్రూప్‌నకు చెందిన అనుబంధ సంస్థ దిల్లీ ఎయిర్‌పోర్ట్‌ మెట్రో ఎక్స్‌ప్రెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (డీఏఎమ్‌ఈపీఎల్‌)కు, ప్రభుత్వ రంగ సంస్థ అయిన దిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (డీఎమ్‌ఆర్‌సీ) రూ.8,000 కోట్లు చెల్లించాల్సిన అవసరం లేదంటూ తాజాగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో 2021లో తానే ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తాజాగా పక్కనపెట్టింది.

ఇదీ కేసు: 2008లో రిలయన్స్‌ ఇన్‌ఫ్రాకు అనుబంధ కంపెనీ అయిన డీఏఎమ్‌ఈపీఎల్‌, ప్రభుత్వ రంగ సంస్థ డీఎమ్‌ఆర్‌సీలు ఒక ‘కన్సెషన్‌ ఒప్పందా’న్ని కుదుర్చుకున్నాయి. దీనిపై వచ్చిన వివాదం విషయంలోనే డీఎమ్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా 2021లో సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. దానిపై డీఎమ్‌ఆర్‌సీ దాఖలు చేసిన క్యూరేటివ్‌ విజ్ఞప్తిని అంగీకరించిన ప్రత్యేక ధర్మాసనం, తాజాగా అనిల్‌ అంబానీకి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. దిల్లీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ సరైన నిర్ణయమే తీసుకుందని.. అందులో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టుకు ఎటువంటి కారణమూ కనిపించడం లేదని చెబుతూ అంతక్రితం ఇచ్చిన తీర్పును ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం పన్కనపెట్టింది.

ఇంత మొత్తం: 2017లో ఇచ్చిన మధ్యవర్తిత్వ తీర్పు ప్రకారం.. డీఏఎమ్‌ఈపీఎల్‌కు డీఎమ్‌ఆర్‌సీ రూ.2782.33 కోట్లు చెల్లించాలి. 2022 ఫిబ్రవరి 14 నాటికి ఒప్పంద నిబంధనల ప్రకారం ఇది రూ.8,009.38 కోట్లకు చేరింది. ఇందులో రూ.1678.42 కోట్లను డీఎమ్‌ఆర్‌సీ చెల్లించింది. మరో రూ.6,330.96 కోట్లు చెల్లించాల్సి ఉంది. తాజా తీర్పుతో అనిల్‌ కంపెనీ రూ.1678.42 కోట్లను డీఎమ్‌ఆర్‌సీకి వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. తనకే అందని రూ.6,330.96 కోట్లనూ వదులుకోవాల్సి ఉంటుంది.

20% పడిన రిలయన్స్‌ ఇన్‌ఫ్రా షేరు : అనుబంధ కంపెనీ డీఏఎమ్‌ఈపీఎల్‌కు వ్యతిరేకంగా తీర్పు రావడంతో రిలయన్స్‌ ఇన్‌ఫ్రా షేరు బుధవారం బీఎస్‌ఈలో 19.99% (లోయర్‌ సర్క్యూట్‌) నష్టపోయి రూ.227.40 వద్ద స్థిరపడింది. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.2,250.02 కోట్లు కోల్పోయి, రూ.9,008.02 కోట్లకు పరిమితమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని