విద్యుత్‌ వాహనాల పరుగు

ఇంజిన్‌ మోతే లేకుండా విద్యుత్‌ వాహనాలు(ఈవీ) రహదారులపై దూసుకెళ్తున్నాయి. ఈ విభాగంలో ద్విచక్ర వాహనాలు, కార్లే కాదు.. ఆటోలు, బస్సులు కూడా ఉన్నాయి. పెట్రోలు, డీజిల్‌తో నడిచే వాహనాలతో పోలిస్తే బ్యాటరీ కలిగి ఉండే విద్యుత్‌ వాహనాలు కొంచెం ఖరీదైనా, నగరాల్లోని వాహనదారులు వీటికి మొగ్గుచూపుతున్నట్లు సమాచారం

Updated : 27 Oct 2022 12:17 IST

 మూడు నెలల్లో 21,000 విక్రయాలు
జీవితకాల పన్ను రూపేణా రూ.120 కోట్ల మాఫీ
ఈనాడు - హైదరాబాద్‌

ఇంజిన్‌ మోతే లేకుండా విద్యుత్‌ వాహనాలు(ఈవీ) రహదారులపై దూసుకెళ్తున్నాయి. ఈ విభాగంలో ద్విచక్ర వాహనాలు, కార్లే కాదు.. ఆటోలు, బస్సులు కూడా ఉన్నాయి. పెట్రోలు, డీజిల్‌తో నడిచే వాహనాలతో పోలిస్తే బ్యాటరీ కలిగి ఉండే విద్యుత్‌ వాహనాలు కొంచెం ఖరీదైనా, నగరాల్లోని వాహనదారులు వీటికి మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యుత్‌ వాహనాలకు జీవితకాల పన్ను మినహాయిస్తుండడం కలిసొస్తోంది. కేవలం ఈ వాహనాలకు రిజిస్ట్రేషన్‌ వ్యయం మాత్రమే ఉంటోంది. హైదరాబాద్‌లో చూస్తే గత మూడు నెలల్లోనే 21,000 విద్యుత్తు వాహనాలు రహదారులపైకి అదనంగా వచ్చాయి. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబరు నాలుగో వారం వరకు మొత్తం 38,600 విద్యుత్‌ వాహనాలు ఇక్కడ రిజిస్ట్రేషన్‌ అయ్యాయని, ఇందులో 33,000 ద్విచక్ర వాహనాలేనని రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబరు 25వరకు విద్యుత్‌ వాహన యజమానులకు మాఫీ చేసిన జీవితకాల పన్ను మొత్తం రూ.120 కోట్లుగా ఉంది.

చలో ఈవీ...  
హీరో, హోండా, బజాజ్‌లతో పాటు మరో పది కంపెనీలు విద్యుత్తు ద్విచక్ర వాహనాలను విక్రయిస్తున్నాయి. వీటికి ప్రచారం చేసేందుకు సెలబ్రిటీలను వినియోగిస్తున్నాయి. విద్యుత్‌ బైక్‌లు తయారుచేస్తున్న ఓ కంపెనీ సినీ కథానాయకుడు వెంకటేష్‌ను ప్రచారకర్తగా నియమించుకుంది. పర్యావరణ హితంగా ఉన్నందునే విద్యుత్తు కార్లు కొంటున్నట్లు ప్రైవేటు సంస్థల అధిపతులు, బ్యాంకర్లు, వ్యాపారులు, సంపన్న యువత చెబుతున్నారు. కొద్దిరోజుల కిందట తెలంగాణ రాష్ట్రమంత్రి ఒకరు తన వ్యక్తిగత సిబ్బందికి విద్యుత్‌ బైకులు ఇప్పించారు. ఈ కార్లలో చూస్తే టాటా వాహనాలు ముందుండగా, తర్వాతి స్థానాల్లో కియా, మారుతీ సుజుకీ ఉన్నాయి. మారుతీ సుజుకీ కొద్దినెలల కిందట గ్రాండ్‌ విటారా పేరుతో విద్యుత్‌/పెట్రోలుతో నడిచే హైబ్రిడ్‌ కారును విడుదల చేసింది. ఈ కారు బ్యాటరీతో నడుస్తుంది. ఒకవేళ అవసరమైతే పెట్రోలుతో కూడా ప్రయాణించే వీలుంది. ద్విచక్ర వాహనదారులు బ్యాటరీలను ఇళ్ల ఆవరణల్లోనే ఛార్జింగ్‌ చేసుకుంటుండగా.. కార్ల యజమానులు మాత్రం ఛార్జింగ్‌ స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు.  

డ్రైవింగ్‌ లైసెన్స్‌ తప్పనిసరి
విద్యుత్‌ వాహనాలు నడిపే వారికీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాల్సిందే. గరిష్ఠంగా 25 కిలోమీటర్ల లోపు వేగంతో ప్రయాణించే విద్యుత్తు వాహనాలకే లైసెన్స్‌ అవసరం ఉండదు. అంతకుమించిన వేగంతో వెళ్లే సామర్థ్యం కలిగిన విద్యుత్‌ ద్విచక్ర వాహనాలు నడిపేవారికి తప్పనిసరిగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి. కొన్ని కంపెనీలు అమ్మకాలు పెంచుకునేందుకు ‘మా విద్యుత్‌ బైక్‌/స్కూటర్‌ కొంటే.. బండి నంబర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే చాలు.. నడిపే వారికి డ్రైవింగ్‌ లైసెన్స్‌ అవసరం లేద’ని ప్రచారం చేసుకుంటున్నాయి. ఇది సరికాదని.. వాహన సామర్థ్యాన్ని అనుసరించే డ్రైవింగ్‌ లైసెన్స్‌ అవసరమని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని  తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని