నెలకు రూ.20వేలు మదుపు చేస్తే

నెలకు రూ.20 వేల వరకూ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయాలనే ఆలోచనతో ఉన్నాను.

Updated : 29 Sep 2023 01:05 IST

నెలకు రూ.20 వేల వరకూ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయాలనే ఆలోచనతో ఉన్నాను. కనీసం 15 ఏళ్లపాటు మదుపు చేస్తే ఎంత మొత్తం ఆశించవచ్చు? 14-15 శాతం వరకూ రాబడి అందుకోవచ్చా? 

నరేందర్‌

పెట్టుబడిని 15 ఏళ్లపాటు కొనసాగిస్తానంటున్నారు. కాబట్టి, మంచి మొత్తం జమ అవుతుంది. పెట్టుబడి వృద్ధికీ అవకాశం ఉంటుంది. గతంలో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లు 15 శాతం, అంతకన్నా ఎక్కువగా రాబడినిచ్చిన సందర్భాలున్నాయి. కానీ, భవిష్యత్తులో 14-15 శాతం వరకూ రాబడి అందే అవకాశాలు కాస్త తక్కువే అని చెప్పాలి. 12-13 శాతం వరకూ రాబడిని అంచనా వేసుకోవచ్చు. మీరు నెలకు రూ.20వేల చొప్పున 15 ఏళ్లపాటు క్రమం తప్పకుండా మదుపు చేస్తే.. 12 శాతం రాబడి అంచనాతో.. రూ.89,47,130 అయ్యేందుకు అవకాశం ఉంది. మంచి వైవిధ్యం ఉన్న పథకాలతో పోర్ట్‌ఫోలియోను నిర్మించుకోండి. క్రమం తప్పకుండా మీ పెట్టుబడులను సమీక్షించుకోండి. మీకు డబ్బు అవసరమైన మూడేళ్ల ముందు నుంచే క్రమంగా ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్ల నుంచి పెట్టుబడిని బయటకు తీసి, సురక్షిత పథకాలకు మళ్లించాలి.


మా దగ్గర రూ.5 లక్షలు ఉన్నాయి. 13 ఏళ్ల మా పాప భవిష్యత్‌ అవసరాల కోసం వీటిని ఏదైనా మంచి రాబడినిచ్చే పథకంలో మదుపు చేయాలని అనుకుంటున్నాం. దీనికోసం ఏం చేయాలి? 

రఘు

ముందుగా మీ పాప భవిష్యత్‌ అవసరాలను కాపాడేందుకు మీ పేరుపైన టర్మ్‌ పాలసీ ద్వారా తగినంత జీవిత బీమా పాలసీ తీసుకోండి. ఎక్కడ మదుపు చేసినా విద్యా ద్రవ్యోల్బణాన్ని మించి రాబడి వచ్చేలా చూసుకోవాలి. పెట్టుబడి కోసం హైబ్రిడ్‌ ఈక్విటీ ఫండ్లు, బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లలో మదుపు చేయొచ్చు. రూ.5లక్షలను పెట్టుబడి పెట్టి, 8 ఏళ్లపాటు కొనసాగిస్తే 10 శాతం రాబడి అంచనాతో రూ.10,71,795 అయ్యేందుకు అవకాశం ఉంది.


మా అబ్బాయికి 12 ఏళ్లు. తనకు ఉపయోగపడేలా నెలకు రూ.6,000 మదుపు చేయాలనే ఆలోచనతో ఉన్నాను. దీనితోపాటు ఏడాదికి మరో 10 శాతం చొప్పున పెట్టుబడి పెంచాలనేది ఆలోచన. ఎనిమిదేళ్లపాటు మదుపు చేయడానికి ఏ పథకాలను ఎంచుకోవాలి? 

సురేశ్‌

మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న రూ.6,000 డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయండి. పెట్టుబడిని ఏటా 10 శాతం పెంచడం మంచి ఆలోచనే. దీనివల్ల అధిక మొత్తం జమయ్యేందుకు వీలవుతుంది. ఇలా మీరు 8 ఏళ్లపాటు మదుపు చేస్తే.. 12 శాతం రాబడి అంచనాతో రూ.13,40,130 అయ్యేందుకు వీలుంది.


దీర్ఘకాలిక అవసరాలు, ఆదాయపు పన్ను మినహాయింపు కోసం నెలకు రూ.10 వేలు మదుపు చేయాలని ఆలోచిస్తున్నాను. ఈ నేపథ్యంలో నా ప్రణాళిక ఎలా ఉండాలి?

శ్రీనివాస్‌

దాయపు పన్ను మినహాయింపు పొందడం కోసం సెక్షన్‌ 80సీలో భాగంగా ఉన్న పలు పథకాల్లో రూ.1,50,000 వరకూ మదుపు చేయొచ్చు. ఇందులో దీర్ఘకాలంపాటు కొనసాగే పెట్టుబడి పథకాలూ ఉన్నాయి. కాబట్టి, తక్కువ లాకిన్‌ వ్యవధి ఉండే వాటిని చూసుకోవాలి. ఇందుకు మీరు ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్‌) పరిశీలించవచ్చు. ఇందులో మూడేళ్లపాటు మాత్రమే లాకిన్‌ వ్యవధి ఉంటుంది. ఇవి ఈక్విటీ పథకాలు కాబట్టి, స్వల్ప కాలంలో కాస్త నష్టభయం ఉండే అవకాశం ఉంది. దీర్ఘకాలం అంటున్నారు కాబట్టి, మీకు వీలైనంత వ్యవధి వరకూ పెట్టుబడి కొనసాగించడం ద్వారా మంచి లాభాలను అందుకునేందుకు   అవకాశం ఉంటుంది. 

తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని