Aadhaar: ఆధార్‌ వివరాలు ఫ్రీ అప్‌డేట్‌.. గడువు మరోసారి పొడిగింపు

Aadhaar free update: ఆధార్‌ వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునేందుకు ఉడాయ్‌ ఇచ్చిన గడువు మరోసారి పొడిగించారు. ఇంకా వివరాలు అప్‌డేట్ చేసుకోకపోతే మార్చి 14లోపు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.

Published : 12 Dec 2023 20:33 IST

Aadhaar | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉచితంగా ఆన్‌లైన్‌లో ఆధార్‌ (Aadhaar) వివరాలు అప్‌డేట్‌ చేసుకునేందుకు ఇచ్చిన గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ (UIDAI) మరోసారి పొడిగించింది. తొలుత 2023 డిసెంబర్‌ 14 వరకు మాత్రమే ఉచితంగా ఆధార్‌ వివరాలను అప్‌డేట్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించగా.. తాజాగా మరో మూడు నెలలు గడువు ఇచ్చింది. అంటే 2024 మార్చి 14 వరకు ఉచితంగా వివరాలను అప్‌డేట్‌ చేసుకోవచ్చు. ప్రజల నుంచి పాజిటివ్‌ స్పందన వస్తుండటంతో గడువు పెంచాలని నిర్ణయించినట్లు ఉడాయ్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. గడువు తర్వాత ఆధార్‌ డాక్యుమెంట్లను అప్‌డేట్‌ చేసుకోవాలంటే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 

ఆధార్‌ కార్డు కోసం పేరు నమోదు చేసుకున్న నాటి నుంచి పదేళ్లు పూర్తయిన వారు తగిన పత్రాలు సమర్పించి అందులో పొందుపరిచిన వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాలని ఉడాయ్‌ గతంలో సూచించింది. ఇకపై ప్రతి ఒక్కరూ కనీసం పదేళ్లకోసారి గుర్తింపుకార్డు, చిరునామా ధ్రువీకరణ పత్రాలు సమర్పించి కేంద్ర గుర్తింపు సమాచార నిధి (సెంట్రల్‌ ఐడెంటిటీస్‌ డేటా రిపాజిటరీ-సీఐడీఆర్‌)లోని వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాలని పేర్కొంది. ఈ ప్రక్రియ వల్ల పౌరుల సమాచారం సీఐడీఆర్‌ వద్ద ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ ఉంటుందని, ఇది కచ్చిత సమాచారం నిక్షిప్తమవడానికి దోహదం చేస్తుందని తెలిపింది.

క్రెడిట్‌ స్కోరు పెంచుకుందామిలా

ఆధార్‌ తీసుకుని పదేళ్లు పూర్తయిన వారు తమ డెమోగ్రఫిక్‌ వివరాలు అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఉడాయ్‌ వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయ్యి లేటెస్ట్‌ గుర్తింపు కార్డు, అడ్రస్‌ వివరాలను సబ్మిట్‌ చేయాలి. రేషన్‌ కార్డు, ఓటర్‌ ఐడీ, కిసాన్‌ ఫొటో పాస్‌బుక్‌, పాస్‌పోర్ట్‌ వంటివి గుర్తింపు, చిరునామా రెండింటికీ ధ్రువీకరణ పత్రాలుగా వినియోగించుకోవచ్చు. టీసీ, మార్క్‌షీట్‌, పాన్‌/ఇ-ప్యాన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటివి గుర్తింపు ధ్రువీకరణ పత్రంగా ఉపయోగపడతాయని ఉడాయ్‌ తెలిపింది. విద్యుత్‌, నీటి, గ్యాస్‌, టెలిఫోన్‌ బిల్లులను (మూడు నెలలకు మించని) చిరునామా ధ్రువీకరణ పత్రంగా వినియోగించ్చుకోవచ్చని ఉడాయ్‌ పేర్కొంది. ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన స్కాన్డ్‌ కాపీలను ‘మై ఆధార్‌’ వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఎలా చేయాలో ఈ వీడియోలో చూడొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని