Mutual Funds: మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేసే ముందు ఏం చూడాలి?

మ్యూచువల్ ఫండ్ పథకాల్లో మదుపు చేసే ముందు గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం.

Updated : 07 Jun 2023 10:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మీరెప్పుడైనా ‘కోటీశ్వరులు కావడం ఎలా?’ అని గూగుల్ల్లో వెతికారా? చాలా మంది ఏదో ఒక సమయంలో ఇలా వెతికే ఉంటారు. సంపద సృష్టి రహస్యాన్ని తెలుసుకోవడం అందరికీ ఇష్టమే. అందులో తప్పేమీ లేదు. మన దేశంలోని మధ్య తరగతి కుటుంబాల్లో ఉన్న గొప్ప లక్షణం పొదుపు. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ కూడా. కానీ, డబ్బు సంపాదించాలంటే పొదుపు ఒక్కటే సరిపోదు. పెరుగుతున్న ఖర్చులను తట్టుకోవాలంటే మదుపు కూడా చేయాల్సిందే. అందుకోసం దీర్ఘకాల సంపద సృష్టి కోసం మ్యూచువల్ ఫండ్లు ఎంచుకోవడం సరైనది.

మ్యూచువల్ ఫండ్లలో రిస్క్‌ను బట్టి రాబడి మారుతుంటుంది. అంతే కాదు అతి తక్కువ డబ్బుతో మొదలు పెట్టగల పథకాల్లో ఇదొకటి. ఉదాహరణకు స్థిరాస్తిలో పెట్టుబడి పెట్టాలంటే లక్షలు లేదా కోట్లు ఉండాలి. షేర్లలో పెట్టుబడి పెట్టాలంటే సమయం, నైపుణ్యంతో పాటు కనీసం వేలల్లో పెట్టుబడి పెట్టాల్సిందే. మ్యూచువల్ ఫండ్లలో రూ.500తో సిప్ మొదలు పెట్టొచ్చు. మ్యూచువల్ ఫండ్లలో డబ్బు ఎప్పుడంటే అప్పుడు తీసుకునే వీలు ఉంటుంది. ఈఎల్ఎస్ఎస్ ఫండ్లలో తప్ప ఇతర ఫండ్లలో లాక్ ఇన్ పిరియడ్‌ అంటూ ఏమీ ఉండదు. మీరు యూనిట్లు అమ్మిన 3 లేదా 4 రోజుల్లో డబ్బు మీ బ్యాంకు ఖాతాలోకి చేరుతుంది. కాబట్టి మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేసే ముందు ఈ విషయాలు గుర్తు పెట్టుకోండి.

ఒకే రకమైన ఫండ్ వద్దు

మ్యూచువల్ ఫండ్లు అనగానే ఒకే రకంగా ఉంటాయి అనుకోవడం భ్రమే అవుతుంది. ఇందులో ఈక్విటీ ఫండ్లు, డెట్ ఫండ్లు, హైబ్రిడ్ ఫండ్లు.. ఇలా చాలా ఉంటాయి. ఈక్విటీలో కూడా లార్జ్ కాప్, మిడ్ కాప్, స్మాల్ కాప్ ఇలా ఎన్నో అందుబాటులో ఉంటాయి. దీర్ఘకాలం.. అంటే కనీసం 10 ఏళ్ల కోసం ఈక్విటీ ఫండ్లు మంచివి. స్వల్ప కాలం (1-3 ఏళ్ల) కోసం డెట్ పథకాలు ఎంచుకోవచ్చు. అన్ని ఫండ్లూ అందరికీ సరిపోవు. కాబట్టి ఎవరి అవసరాన్ని బట్టి వారు ఫండ్లు ఎంచుకోవాలి. రాబడి మాత్రమే ఆశించి కొన్ని పథకాల్లో మదుపు చేయడం మంచిది కాదు. అలా చేయడం వల్ల పెట్టుబడిపై నష్టం కూడా రావచ్చు.

ఆర్థిక లక్ష్యాలు చూసుకోండి

ఎంత చెప్పినా ఈ విషయాన్ని అందరూ చులకనగా చూస్తారు. ఇది మొదటి మెట్టే కాదు.. అతి ముఖ్యమైనది కూడా. ముందుగా, మీ ఆర్థిక లక్ష్యాలను రాసుకోండి. దీనివల్ల దేనికోసం ఎంత మదుపు చేయాలో తెలుసుకోవచ్చు. లక్ష్యానికి ఎంత సమయం ఉంటే అంత తక్కువ మదుపు చేయాల్సిన అవసరం ఉంటుంది. అది చక్ర వడ్డీలో ఉన్న గొప్పతనం. 15 ఏళ్ల తర్వాత ఉన్న లక్ష్యాల విషయంలో కాస్త రిస్క్ తీసుకున్నా పరవాలేదు.

పెట్టుబడిపై నష్టం

పిల్లల చదువులు లాంటి లక్ష్యాల విషయంలో నష్టాలు రాకుండా చూసుకోవడమే మంచిది. ఇలాంటప్పుడు కాస్త తక్కువ రిస్క్ ఉన్న పథకాల్లో అంటే బ్యాలన్స్‌డ్‌ ఫండ్లు లాంటి వాటిల్లో మదుపు చేయవచ్చు. అలాగే లక్ష్యం 2-3 సంవత్సరాలు ఉండగానే ఈక్విటీ ఫండ్స్ నుంచి 70-80 శాతం వరకు మొత్తాన్ని వెనక్కి తీసుకోవాలి. ఈ మొత్తాన్ని లిక్విడ్ ఫండ్స్‌కు బదిలీ చేయొచ్చు లేదా బ్యాంకులో ఫిక్సిడ్ డిపాజిట్ చేసుకోవచ్చు.

అత్యవసర నిధి

మీ నెలవారీ ఖర్చుల్లో కనీసం 4 నుంచి 6 నెలలకు సరిపడా నిధిని ఒక లిక్విడ్ ఫండ్లలో మదుపు చేయండి. ఇది అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాడండి. ఈ ఫండ్లలో బ్యాంకు పొదుపు ఖాతా కంటే 2-3 శాతం ఎక్కువ రాబడి వస్తుంది.

ఇప్పుడే మొదలు పెట్టినట్టైతే..

మీరు ఇప్పుడిప్పుడే పెట్టుబడులు ప్రారంభించినట్లైతే ముందుగా ఒక ఇండెక్స్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టడం మంచిది. ఇందులో రిస్క్ కాస్త తక్కువగా ఉంటుంది. మంచి రాబడి పొందొచ్చు. మ్యూచువల్ ఫండ్ పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ పద్ధతులుంటాయి. బ్రోకింగ్ కంపెనీలు, పంపిణీదారుల ద్వారా ఆఫ్‌లైన్‌ పద్ధతి (లేదా వారి ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ ద్వారా అయినా)లో మ్యూచువల్ ఫండ్డ్ సలహాదారుని ద్వారా పెట్టుబడి చేయవచ్చు. దీన్ని రెగ్యులర్ ప్లాన్ అంటారు. ఇందులో పంపిణీదారులు కొంత కమీషన్ తీసుకుంటారు.

మదుపు..ఎలా?

మ్యూచువల్ ఫండ్ పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ పద్ధతులు ఉంటాయి. బ్రోకింగ్ కంపెనీలు, పంపిణీదారుల ద్వారా ఆఫ్‌లైన్‌ పద్ధతి (లేదా వారి ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ ద్వారా అయినా)లో మ్యూచువల్ ఫండ్‌ సలహాదారుని ద్వారా పెట్టుబడి చేయవచ్చు. దీన్ని రెగ్యులర్ ప్లాన్ అంటారు. ఇందులో పంపిణీదారులు కొంత కమీషన్ తీసుకుంటారు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్‌సైట్లు (www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్  ఆప్ లాంటివి) ద్వారా డైరెక్ట్ ప్లాన్లో మదుపు చేయొచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు. కాబట్టి వీటిలో రాబడి రెగ్యులర్‌ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.

చివరిగా: ఎవరి వీలును బట్టి వారు ఎంతో కొంత మదుపు చేయడం మంచిది. నెల నెలా ఆటోమేటిక్‌గా బ్యాంకు ఖాతా నుంచి ఏదో ఒక పథకంలోకి డబ్బు చేరేలా చూసుకోవాలి. దీనికి సిప్ అనువైన పద్ధతి. మధ్య తరగతి మదుపరులకు ఇది ఒక వరం లాంటిదని చెప్పాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని