Valuable Companies: టాప్‌-500 కంపెనీల్లో భారత్‌ నుంచి 20.. రిలయన్స్‌దే అగ్రస్థానం

Valuable Companies: ప్రపంచంలో అత్యంత విలువైన 500 కంపెనీల జాబితాను హురున్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ విడుదల చేసింది. దీంట్లో భారత్‌ నుంచి 20 కంపెనీలు స్థానం దక్కించుకున్నాయి. రిలయన్స్‌ అగ్రస్థానంలో నిలిచింది.

Published : 09 Dec 2022 18:08 IST

ముంబయి: ప్రపంచంలో అత్యంత విలువైన 500 కంపెనీల (Most Valuable Companies) జాబితాలో ఈసారి భారత్‌ నుంచి 20 కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. వీటి విలువ 202 బిలియన్‌ డాలర్లు. ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (Reliance Industries) భారత్‌లో అత్యంత విలువైన సంస్థగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 34వ స్థానంలో ఉంది. ఈ జాబితాలో 2.4 ట్రిలియన్‌ డాలర్లతో యాపిల్‌ (Apple) అగ్రస్థానాన్ని దక్కించుకుంది. తర్వాత మైక్రోసాఫ్ట్‌ 1.8 ట్రిలియన్‌ డాలర్లతో రెండోస్థానంలో ఉంది. ఈ మేరకు హురున్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ‘2022 హురున్‌ గ్లోబల్‌ 500 (2022 Hurun Global 500)’ నివేదికను శుక్రవారం విడుదల చేసింది.

గతేడాది వ్యవధిలో టాప్‌-500 కంపెనీలు 11.1 ట్రిలియన్‌ డాలర్ల సంపదను కోల్పోయాయి. దీంతో అంతక్రితం ఏడాది పెరిగిన సంపద మొత్తం ఆవిరైంది. అయితే, రెండేళ్ల క్రితంతో పోలిస్తే మాత్రం కంపెనీల మొత్తం విలువ 7 బిలియన్‌ డాలర్లు అధికంగా ఉంది. భారత్‌లో రిలయన్స్‌ తర్వాత ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS)’ రెండో స్థానంలో ఉంది. దీని మార్కెట్‌ విలువ 139 బిలియన్‌ డాలర్లు. అదానీ గ్రూప్‌ (Adani Group)నకు చెందిన నాలుగు కంపెనీలు టాప్‌-500 జాబితాలో స్థానం దక్కించుకున్నాయి. వీటిలో అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ గ్రీన్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ టోటల్‌ గ్యాస్‌ ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌ తర్వాత ఆల్ఫాబెట్‌, అమెజాన్‌, టెస్లా, బెర్క్‌షైర్‌ హాత్‌వే, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, ఎక్సాన్‌ మొబిల్‌ టాప్‌-10 జాబితాలో ఉన్నాయి. 500 కంపెనీల్లో అత్యధికంగా 104 సంస్థలు ఆర్థిక సేవల రంగానికి చెందినవి. యునైటెడ్‌ హెల్త్‌ గ్రూప్‌, వీసా ఈ రంగంలో అత్యధిక విలువ గల కంపెనీలుగా నిలిచాయి. గత ఏడాది కాలంలో మీడియా అండ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ రంగం అత్యధిక సంపదను కోల్పోయింది. ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా ప్లాట్‌ఫామ్స్‌ గత ఏడాది అత్యధికంగా 618 బిలియన్‌ డాలర్లు నష్టపోయింది. దీని విలువ ప్రస్తుతం 349 బిలియన్‌ డాలర్లు. జూమ్‌, స్నాప్‌, అడిడాస్‌ ఈసారి టాప్‌-500 జాబితాలో స్థానాన్ని కోల్పోయాయి.

సౌదీ ఆరామ్‌కో అత్యంత విలువైన ప్రభుత్వరంగ కంపెనీగా నిలిచింది. దీని విలువ 2.03 ట్రిలియన్‌ డాలర్లు. భారత్‌లో ఎస్‌బీఐ 62 బిలియన్‌ డాలర్లు, ఎల్‌ఐసీ 45 బిలియన్‌ డాలర్లతో అత్యధిక విలువ కలిగిన కంపెనీలుగా నిలిచాయి. అయితే, ఇవి మాత్రం హురున్‌ 500 జాబితాలో లేవు. ఈ నివేదిక కేవలం ప్రైవేటు రంగంలోని కంపెనీలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని