బంగారం ఇప్పుడు కొనొచ్చా?

బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు వినియోగదార్లను గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఇటీవలి సుంకం పెంపుతో ఒక్కసారిగా 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.54,000కు చేరింది. తదుపరి మాంద్యం ఆందోళనలతో అంతర్జాతీయంగా కమొడిటీ ధరలు తగ్గడంతో,

Updated : 10 Jul 2022 06:56 IST

దిగుమతి సుంకం పెంపుతో రూ.54000కు బంగారం
ప్రస్తుతం రూ.52,600 వద్దకు
అంతర్జాతీయంగా ధరల తగ్గుదలతో ఉపశమనం
పండగల వరకు ఇలానే ఉండొచ్చు: నిపుణులు
ఈనాడు వాణిజ్య విభాగం

బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు వినియోగదార్లను గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఇటీవలి సుంకం పెంపుతో ఒక్కసారిగా 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.54,000కు చేరింది. తదుపరి మాంద్యం ఆందోళనలతో అంతర్జాతీయంగా కమొడిటీ ధరలు తగ్గడంతో, దేశీయంగానూ మేలిమి బంగారం ధర రెండు రోజుల్లోనే 10 గ్రాములకు రూ.2,000 తగ్గినా, మళ్లీ శుక్రవారం కాస్త పెరిగి రూ.52,400కు చేరింది. వెండి ధర అయితే కిలో రూ.58,400గా ఉంది. ఈ ధరల్లో బంగారం కొనుగోలు చేసుకోవచ్చా అనే ప్రశ్న ఉదయిస్తోంది. పండగల సీజన్‌ వరకు కూడా పసిడి, వెండి ధరలు ఈ స్థాయుల్లోనే ఉండే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి అంతర్జాతీయ విపణిలో పసిడి ధర తక్కువగానే ఉన్నా, దిగుమతి సుంకాలకు తోడు డాలర్‌ మారకపు విలువ భారం వల్ల దేశీయంగా పసిడి ధర అంతగా దిగి రాలేదు.  

అంతర్జాతీయంగానూ పెరిగి.. తగ్గి..

అదే అంతర్జాతీయ విపణులను తీసుకుంటే, అనిశ్చితి పరిస్థితుల్లో ఆదుకునే పెట్టుబడి సాధనంగానే పసిడిని పరిగణిస్తారు. ఈ ఏడాది ఆరంభంలో ఔన్సు (31.10 గ్రాములు) బంగారం ధర అంతర్జాతీయ విపణుల్లో 1790 డాలర్ల వరకు ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించినప్పటి నుంచి ధర పెరగడం ప్రారంభించి, యుద్ధం తీవ్రస్థాయిలో ఉన్న మార్చిలో గరిష్ఠంగా 2052.60 డాలర్లకు చేరింది. తదుపరి అమెరికా ఫెడ్‌ సహా కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లు పెంచడం, వ్యవస్థల్లో నగదు లభ్యత తగ్గడం, అమెరికా బాండ్‌ రాబడుల ప్రతిఫలాలకు అనుగుణంగా డాలర్‌కు గిరాకీ పెరగడంతో బంగారం వైపునకు పెట్టుబడులు తరలిరావడం తగ్గింది. ఫలితంగా మళ్లీ ధర తగ్గుతూ వస్తోంది. ఇక మాంద్యం భయాలు చుట్టుముడుతున్నందున, ఇతర కమొడిటీలతో పాటు బంగారానికి గిరాకీ మరింత క్షీణించడంతో, ఈనెల 6న 9 నెలల కనిష్ఠమైన 1723 డాలర్ల స్థాయికి దిగి వచ్చింది. శనివారం రాత్రి 1740 డాలర్ల స్థాయిలో ట్రేడ్‌ అవుతోంది.

దేశీయంగా చూస్తే 2021-21లో 34.62 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.2.73 లక్షల కోట్ల), 2021-22లో 46.14 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.3.64 లక్షల కోట్ల) విలువైన బంగారం అధికారికంగా దేశంలోకి దిగుమతి అయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయంగా ధరలు తగ్గినందున, వచ్చే పండగల సీజన్‌ విక్రయాల కోసం బంగారాన్ని ఏప్రిల్‌-జూన్‌లో మన వ్యాపారులు అధికంగా దిగుమతి చేసుకున్నారు.

విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకునేందుకు

బంగారం కోసం విదేశీ మారక ద్రవ్యాన్ని అధికంగా వెచ్చించాల్సి వస్తోంది. ముఖ్యంగా డాలర్లు తరిగిపోతున్నందున, వాటికి గిరాకీ పెరిగి, రూపాయి విలువ పతనమవుతోంది. దేశ కరెంటు ఖాతా లోటూ అధికమవుతోంది. ఇది మరింత పెరగకుండా చూసేందుకే పసిడి దిగుమతులను నిరుత్సాహ పరిచేందుకు పసిడిపై దిగుమతి సుంకాలను 10.75 శాతం నుంచి 15 శాతానికి పెంచుతూ, జూన్‌ 30న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో డాలర్‌ విలువ కూడా రూ.79కి చేరడంతో, ఈ రెండూ కలిసి బంగారం ధరను పెంచేశాయి. ఫలితంగా 10 గ్రాముల  మేలిమి బంగారం (999 స్వచ్ఛత) ధర రూ.54,000కు చేరింది. తదుపరి అంతర్జాతీయంగా ఔన్సు ధర 1815 డాలర్ల నుంచి 1740 డాలర్లకు తగ్గడంతో, దేశీయంగా కూడా 10 గ్రాములకు రూ.2000 మేర తగ్గి, రూ.52,000కు దిగి వచ్చింది.. శనివారం రాత్రి రూ.52,400 వద్ద ట్రేడవుతోంది. వెండిపై దిగుమతి సుంకాన్ని ఏమీ మార్చలేదు. అయితే వెండికి గిరాకీ తగ్గడంతో, ప్రస్తుతం కిలో రూ.58,400 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

బులియన్‌ ట్రేడర్లు ఏమంటున్నారంటే..

ప్రస్తుతం దేశీయంగా ఆషాఢమాసం రావడానికి తోడు ద్రవ్యోల్బణ పరిస్థితుల వల్ల పండగల సీజన్‌ వరకు గిరాకీ లభించద’నే అంచనా వేస్తున్నట్లు ముంబయి బులియన్‌ ట్రేడర్లు తెలిపారు. 10 గ్రాముల మేలిమి బంగారం రూ.51,000-54,000 శ్రేణిలో; కిలో వెండి రూ.57,000-65,000 శ్రేణిలో కదలాడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటే మినహా, దేశీయంగా ధరలు ఇలానే ఉండొచ్చని వివరించారు. బంగారం ధర పెరిగినా, తాకట్టుపై అధికమొత్తం అప్పు తీసుకునేందుకు వీలవుతుందే కానీ, విక్రయించి సొమ్ము చేసుకుందామంటే బాగా తక్కువకు అడుగుతున్నారని వినియోగదార్లూ చెబుతున్నారు. అందువల్ల అవసరం మేరకు మాత్రమే బంగారంపై పెట్టుబడులు మేలని సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని