డిసెంబరులో రెపో రేటు 0.35% పెంపు!

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి కమిటీ డిసెంబరు 5-7 తేదీల్లో నిర్వహించే సమీక్షలో రెపో రేటును 35 బేసిస్‌ పాయింట్ల మేర పెంచొచ్చని ఎక్కువమంది ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.

Published : 27 Nov 2022 02:26 IST

ఆర్థిక వేత్తల అంచనా
దిల్లీ

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి కమిటీ డిసెంబరు 5-7 తేదీల్లో నిర్వహించే సమీక్షలో రెపో రేటును 35 బేసిస్‌ పాయింట్ల మేర పెంచొచ్చని ఎక్కువమంది ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. అక్టోబరులో రిటైల్‌ ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గినందున, రెపోరేట్ల పెంపులో ఆర్‌బీఐ నెమ్మదించే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తం 15 అంచనాల్లో.. అత్యధికులు 35 బేసిస్‌ పాయింట్ల పెంపును అంచనా వేయగా, ఇద్దరు మాత్రం 50 బేసిస్‌ పాయింట్ల పెంపు ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది మే నుంచి ఆర్‌బీఐ కీలక రెపో రేటును 190 బేసిస్‌ పాయింట్లు పెంచి 5.90 శాతం చేసింది.

* అక్టోబరులో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.77 శాతానికి చేరింది.  ఈ ఏడాది జనవరి నుంచి చూస్తే, వరుసగా 10వ నెలా ఆర్‌బీఐ లక్ష్యమైన 2-6 శాతం ఎగువనే ఇది కొనసాగింది. జనవరి-మార్చిలో రిటైల్‌ ద్రవ్యోల్బణ సగటు 6.3 శాతం కాగా.. ఏప్రిల్‌- జూన్‌లో 7.3 శాతం, జులై-సెప్టెంబరులో 7 శాతంగా నమోదైంది.  

* ‘దేశీయ ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గింది. అమెరికా ద్రవ్యోల్బణం సైతం గరిష్ఠాల నుంచి వెనక్కి వచ్చింది. దీంతో డిసెంబరులో ఆర్‌బీఐ రెపో రేటును 0.35 శాతం పెంచి 6.25 శాతం చేసే అవకాశం ఉంది. గత వడ్డీ రేట్ల పెంపుల ప్రభావం, నగదు లభ్యతను కఠినతరం చేయడం, అంతర్జాతీయ పరిస్థితులను ఈసారి పరిగణనలోకి తీసుకోవచ్చు’ అని కోటక్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ సీనియర్‌ ఆర్థికవేత్త సువోదీప్‌ రక్షిత్‌ అన్నారు. వచ్చే కొన్ని నెలల పాటు కూడా రిటైల్‌ ద్రవ్యోల్బణం 6 శాతం పైనే కొనసాగొచ్చని, 2023 ఫిబ్రవరికి 6 శాతానికి, మార్చికి 5 శాతానికి చేరొచ్చని అంచనా వేశారు.

* ఆహార వస్తువులపై ధరల ఒత్తిడి కొనసాగుతోందని, దేశీయ, అంతర్జాతీయ కారణాలు ప్రభావం చూపుతున్నట్లు క్వాంట్‌ఎకో రీసెర్చ్‌ పేర్కొంది. స్వల్పకాలంలో ద్రవ్యోల్బణం అధిక స్థాయుల్లోనే కొనసాగొచ్చని తెలిపింది.

* డిసెంబరులో 35 బేసిస్‌ పాయింట్లు, 2023 ఫిబ్రవరిలో 25 బేసిస్‌ పాయింట్ల మేర రెపోరేటు పెంపులు ఉండొచ్చని నొమురా అంచనా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని