మ్యూచువల్‌ ఫండ్ల తనఖాతో రుణాలు

మ్యూచువల్‌ ఫండ్లు, షేర్లలో మదుపు చేసిన మదుపరులు, తమ యూనిట్లను హామీగా ఉంచి రుణం తీసుకునే వెసులుబాటును ఫండ్స్‌ ఇండియా అందుబాటులోకి తెచ్చింది.

Updated : 19 May 2023 09:06 IST

మ్యూచువల్‌ ఫండ్లు, షేర్లలో మదుపు చేసిన మదుపరులు, తమ యూనిట్లను హామీగా ఉంచి రుణం తీసుకునే వెసులుబాటును ఫండ్స్‌ ఇండియా అందుబాటులోకి తెచ్చింది. తమ ప్లాట్‌ఫాం ద్వారా మ్యూచువల్‌ ఫండ్లు, ఎంపిక చేసిన షేర్లలో పెట్టుబడులు పెట్టిన వారికి, మిరే అసెట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (ఇండియా) ద్వారా ఈ రుణాలను అందిస్తున్నట్లు తెలిపింది. మ్యూచువల్‌ ఫండ్లపై రుణాలను పొందేందుకు వివిధ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు అందిస్తున్న ఫండ్‌ యూనిట్లను క్యామ్స్‌, కెఫిన్‌టెక్‌ రిజిస్ట్రార్‌, ట్రాన్స్‌ఫర్‌ ఏజెంట్ల ద్వారా తాకట్టు పెట్టి రుణం పొందేందుకు వీలవుతుంది. సీడీఎస్‌ఎల్‌ డీమ్యాట్‌ ఖాతాలో ఆమోదించిన షేర్ల జాబితా నుంచి వాటిని హామీగా ఉంచి, అప్పు తీసుకోవచ్చు. తమ షేర్లు, మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్లను హామీగా ఉంచి, 9 శాతం వార్షిక వడ్డీతో ఈ రుణాన్ని తీసుకోవచ్చు. పెట్టుబడులను వెనక్కి తీసుకోకుండా, అవసరానికి డబ్బు కావాల్సిన వారు ఈ సదుపాయం వినియోగించుకోవచ్చు. స్వల్పకాలిక డబ్బు అవసరాలకు దీర్ఘకాలం కొనసాగించాల్సిన పెట్టుబడులను ఉపసంహరించుకోకుండా ఈ సౌకర్యం ఉపయోగపడుతుందని మిరే అసెట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ కృష్ణ కన్హయ్య అన్నారు. పూర్తి డిజిటల్‌ విధానంలో అందే ఈ రుణాల వల్ల మదుపరులు తమ ఆర్థిక లక్ష్యాల సాధనకు ఉపయోగించాల్సిన పెట్టుబడులను మధ్యలోనే వెనక్కి తీసుకోవాల్సిన అవసరాన్ని తప్పిస్తాయని ఫండ్స్‌ఇండియా సీఈఓ గిరిరాజన్‌ మురుగన్‌ తెలిపారు. వినియోగదారులకు కొత్త రుణ మార్గాన్ని అందించడానికి ఇది తోడ్పడుతుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని