Budget 2023: పన్నుపోటు నుంచి బీమాకు ఉపశమనంపై ఆశలు

భారత్‌లో బీమా రంగం ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. ఈ దశలో వివిధ బీమా ప్రీమియంలపై పన్ను విధింపు ఇబ్బందికరంగా మారింది. ఈ సారి బడ్జెట్‌లో వీటిల్లో మార్పులు చేసి బీమాను మరింత ఆకర్షణీయంగా మారుస్తారనే ఆశలు ఉన్నాయి.  

Published : 30 Jan 2023 14:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో బీమాపై అవగాహన చాలా తక్కువ. ఇప్పటికీ ఎల్‌ఐసీ వంటి కంపెనీలు కూడా దేశంలోని బీమా మార్కెట్‌ను పూర్తిగా అందిపుచ్చుకోలేదు. 2022 నుంచి మాత్రం బీమా కొనుగోళ్లలో కొంత పెరుగుదల కనిపించింది. కరోనా పరిస్థితుల కారణంగా ప్రజల్లో ఈ మాత్రం అవగాహన వచ్చింది. అదే సమయంలో బీమా రంగంలో పెట్టుబడులు కూడా పెరిగాయి. ముఖ్యంగా ఈ రంగంలో క్లౌడ్‌ కంప్యూటింగ్‌, డేటా, క్లెయిమ్‌ల ఆటోమేషన్‌ వంటివి పారదర్శకతను గణనీయంగా పెంచుతాయి. ఇది బీమా రంగ గతినే పూర్తిగా మార్చేస్తాయి. ఈ నేపథ్యంలో 2023 బడ్జెట్‌ నుంచి కొన్ని కీలక ప్రకటనలను బీమా రంగం ఆశిస్తోంది. ఆరోగ్య బీమాపై జీఎస్‌టీ రేటును తగ్గించాలని కోరుతోంది.

సెక్షన్‌ 80సి డిడక్షన్‌ పరిధి పెంచాలి..

వివిధ రకాల పెట్టుబడులపై సెక్షన్‌ 80సి కింద వ్యక్తులకు ఇచ్చే రాయితీ పరిధిని పెంచాల్సి ఉంది. ప్రస్తుతం రూ.1.5 లక్షల పెట్టుబడులపై దీనిని ఇస్తున్నారు. దీనిని చివరి సారిగా 2014-15 బడ్జెట్‌లో రూ. లక్ష నుంచి రూ.1.5 లక్షకు పెంచారు. ప్రస్తుతం దేశంలో బీమా రంగం ఇంకా పూర్తి స్థాయిలో ప్రజలను చేరుకోలేదు. దీనిని దృష్టిలో పెట్టుకొని బీమా పాలసీల్లో పెట్టుబడి పరిధిని పెంచాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజలకు ఆర్థిక రక్షణ కల్పించడంతోపాటు.. బీమా రంగ విస్తరణకు మార్గం సుగమం చేస్తుంది.

సెక్షన్‌ 80డి కింద మరింత పన్ను మినహాయింపు..

భారత్‌లో దాదాపు 30 శాతం మంది ప్రజలకు ఎటువంటి ఆరోగ్య బీమా రక్షణ లేదని 2021లో నీతి ఆయోగ్‌ నివేదిక పేర్కొంది. మరో వైపు కేవలం వైద్య ఖర్చుల కారణంగా ఏటా 7 శాతం మంది పేదరికంలోకి జారుకొంటున్నారు. వైద్య ఖర్చులు కుటుంబాలను చిన్నాభిన్నం చేయకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్య బీమా తీసుకొనేలా ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఇప్పటికే రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు ఆరోగ్య బీమా ప్రీమియం మొత్తంపై పన్ను రాయితీ కల్పిస్తోంది. ప్రస్తుతం కొవిడ్‌ తర్వాత ఆరోగ్య బీమా పథకాలు మరింత ఖరీదయ్యాయి. దీంతో పన్ను మినహాయింపు లభించే మొత్తాన్ని రూ.50 వేల నుంచి రూ.1లక్షకు పెంచాల్సిన అవసరం ఉంది.

పెన్షన్‌-యాన్యుటీ చెల్లింపులకు ప్రోత్సాహకాలు..

భారత్‌లో రిటైర్మెంట్‌ తర్వాత స్థిరంగా పింఛను ఇచ్చే ఉద్యోగాలు చాలా తక్కువ. ఉద్యోగం చేస్తుండగానే వివిధ రకాల పింఛను పథకాల్లో పెట్టుబడులు పెట్టి.. పదవీ విరమణ తర్వాత వాటి నుంచి వచ్చే ఆదాయంపై బతకాల్సి ఉంటుంది. ప్రస్తుతం పెన్షన్‌-యాన్యుటీ చెల్లింపులు పన్ను పరిధిలోకి వస్తున్నాయి. ప్రస్తుతం జీవిత బీమా సంస్థలు విక్రయించే పింఛను పథకాలపై 80సి కింద మినహాయంపు పొందవచ్చు. కానీ, ఈ పథకాలకు ప్రత్యేకమైన రాయితీ లేదు. నేషనల్‌ పెన్షన్‌ స్కీం కింద చెల్లించే రూ.50 వేల వరకు సెక్షన్‌ 80సీసీడీ(1బీ) కింద ప్రత్యేకంగా మినహాయింపు పొందవచ్చు. ఇటువంటి మినహాయింపును జీవిత బీమా రంగ సంస్థలు ప్రారంభించే పింఛను పథకాలకూ వర్తింపజేయాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది.

ప్రయాణ బీమా..

కొవిడ్‌ తర్వాత ప్రయాణ బీమాపై అవగాహన పెరిగింది. ఈ సారి బడ్జెట్‌లో ఈ బీమా ప్రీమియంను కూడా ఎల్‌టీఏ మినహాయింపు పరిధిలోకి తీసుకురావాల్సి ఉంది. ఇది మరింత మంది ప్రయాణ బీమాను తీసుకొనేలా ప్రోత్సహించే అవకాశం ఉంది. 

థర్డ్‌పార్టీ మోటార్‌ ఇన్స్యూరెన్స్‌కు మినహాయింపులు..

ప్రస్తుతం వాహనాలకు థర్డ్‌ పార్టీ మోటార్‌ బీమా తప్పనిసరి. కానీ, దేశంలో సగానికి పైగా వాహనాలకు బీమాను పునరుద్ధరించడం లేదు. పెరిగిన బీమా ఖర్చులు, నిర్లక్ష్యం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వాహనాలకు థర్డ్‌పార్టీ బీమా ప్రీమియంపై పన్ను రాయితీ ఇచ్చి.. యజమానులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు వాహన బీమాపై రాయితీలు అందిస్తే ఆటోమొబైల్‌ రంగానికి ప్రోత్సాహకంగా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని