Stock Market: ఆర్‌బీఐ అరశాతం పెంపుతో నిద్రలేచిన బుల్‌.. దూసుకెళ్లిన సూచీలు

ఆర్‌బీఐ రెపోరేటును అంచనాలకు అనుగుణంగా 0.50 శాతం మాత్రమే పెంచడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీగా లాభపడ్డాయి. దీంతో గత ఏడు రోజుల వరుస నష్టాలకు బ్రేక్‌ పడింది.

Updated : 30 Sep 2022 15:55 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల్లో ఎట్టకేలకు ఏడు రోజుల వరుస నష్టాలకు బ్రేక్‌ పడింది. ఆర్‌బీఐ రెపోరేటు పెంపు అంచనాలకు అనుగుణంగానే ఉండడంతో బుల్‌ రంగంలోకి దిగింది. రెపోరేటును 0.50 శాతం మాత్రమే పెంచుతున్నట్లు గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ప్రకటించిన వెంటనే మార్కెట్లు లాభాల్లోకి దూసుకెళ్లాయి. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ 100, నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 100 సూచీలు 1 శాతానికి పైగా ఎగబాకాయి. రేట్ల పెంపు ప్రభావం నేరుగా ఉండే బ్యాంకింగ్‌ రంగ షేర్లకు లాభాల పంట పండింది. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌, నిఫ్టీ బ్యాంక్‌ సూచీలు 2 శాతానికి పైగా రాణించాయి. నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ వాహన సూచీలు కూడా 1 శాతానికి పైగా లాభపడడం మార్కెట్ల ర్యాలీకి దోహదం చేసింది.

సెన్సెక్స్‌ ఉదయం 56,240.15 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 57,722.63 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 1016.96 పాయింట్ల లాభంతో 57,426.92 వద్ద ముగిసింది. నిఫ్టీ 276.25 పాయింట్లు రాణించి 17,094.35 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 16,798.05- 16,747.70 పాయింట్ల మధ్య కదలాడింది.

సెన్సెక్స్‌ 30 షేర్లలో 25 షేర్లు లాభపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టైటన్‌, హెచ్‌డీఎఫ్‌సీ  బ్యాంక్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, బజాజ్ ఫిన్‌సర్వ్‌, టాటా స్టీల్‌, మారుతీ, యాక్సిస్‌ బ్యాంక్‌, రిలయన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్ అత్యధికంగా లాభపడిన షేర్లలో ఉన్నాయి. ఏషియన్‌ పెయింట్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఐటీసీ, టెక్‌ మహీంద్రా, హెచ్‌యూఎల్‌ షేర్లు నష్టపోయాయి.

మార్కెట్‌లోని ఇతర సంగతులు..

భారతీ ఎయిర్‌టెల్‌ అక్టోబరు 1న 5జీ సేవలు ప్రారంభించనున్న నేపథ్యంలో ఇంట్రాడేలో కంపెనీ షేరు 6 శాతానికి పైగా ఎగబాకి రూ.808.85 వద్ద రికార్డు గరిష్ఠానికి చేరింది.

అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ ప్రమోటర్‌ కంపెనీల్లో ఒకటైన స్పిట్జ్ ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్ ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల్లో 0.25 శాతం వాటాలకు సమానమైన 40 లక్షల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. దీంతో కంపెనీ షేరు ఇంట్రాడేలో 20 శాతం మేర లాభపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని