ఆన్‌లైన్‌లో.. అప్రమత్తంగా..

ఇంటి నుంచే కావాల్సిన వస్తువులు తెప్పించుకునే వెసులుబాటు ఉండటంతో ఎంతోమంది ఆన్‌లైన్‌లో కొనేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

Updated : 23 Dec 2022 04:27 IST

ఇంటి నుంచే కావాల్సిన వస్తువులు తెప్పించుకునే వెసులుబాటు ఉండటంతో ఎంతోమంది ఆన్‌లైన్‌లో కొనేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకొని, మోసగాళ్లు వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజల కష్టార్జితాన్ని దోచుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. వీటికి భయపడి డిజిటల్‌ లావాదేవీలు, ఆన్‌లైన్‌ కొనుగోళ్లు మానేయలేం. అందుకే, అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ, సురక్షితంగా లావాదేవీలను పూర్తి చేసుకోవాలి.

వినియోగదారులు తమ చెల్లింపులను సురక్షితంగా నిర్వహించేందుకు బ్యాంకులు అన్ని చర్యలూ తీసుకుంటాయి. అయినప్పటికీ కొన్నిసార్లు మనం చేసే చిన్న పొరపాటు ఖరీదుగా మారుతుంది. అనుకోకుండా ఓటీపీ చెప్పేయడం, మోసపూరిత వెబ్‌సైట్లలో మన బ్యాంకింగ్‌ రహస్య సమాచారాన్ని నమోదు చేయడంలాంటివి ఇందులో కొన్ని. వీటివల్ల మన ఖాతా ఒక్కసారిగా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటివి ఎదురవ్వకుండా చూసుకోవాలంటే..

వేలిముద్రతో..

అన్ని పాస్‌వర్డ్‌లనూ గుర్తుంచుకోవడం కొంచెం కష్టమే. మోసగాళ్లు వీటిని సులభంగా పసిగట్టగలరు. ఎప్పటికప్పుడు పాస్‌వర్డ్‌లను మార్చడం మంచి అలవాటు. దీనికి బదులుగా బయోమెట్రిక్‌ (వేలిముద్ర), ఇ-సిగ్నేచర్‌లాంటివి ఉపయోగించుకోవచ్చు. బ్యాంకులు తమ ఖాతాదారుల రక్షణ కోసం యాప్‌లకు పాస్‌వర్డ్‌తోపాటు, వేలిముద్ర ద్వారా లాగిన్‌ అయ్యే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. దీనివల్ల లావాదేవీలకు భద్రత పెరుగుతంది. మోసం జరిగే అవకాశాలు చాలా వరకూ తగ్గుతాయి.  

ఒకటికి మించి..

వినియోగదారులను మోసం చేసేందుకు సైబర్‌ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త విధానాలు, సాంకేతికతను వాడుతున్నారు. కాబట్టి, ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్నిసార్లు వారి వలలో పడే ప్రమాదం లేకపోలేదు. దీన్ని ఎదుర్కొనేందుకు బ్యాంకులు ఒకేసారి ఆథరైజ్‌ చేయడంతోనే సరిపెట్టకుండా.. రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు ఆ లావాదేవీని ఆథరైజ్‌ చేయాల్సిందిగా కోరుతున్నాయి. ఒకే పాస్‌వర్డ్‌ను సులభంగా కనిపెట్టేందుకు అవకాశం ఉంటుంది. కానీ, రెండుమూడు దశల్లో ఉన్నప్పుడు కష్టం. మనకూ అలోచించుకునేందుకు కొంత వ్యవధి దొరుకుతుంది. పాస్‌వర్డ్‌, వేలిముద్ర,ఓటీపీలాంటివి ఇందులో ఉంటాయి. మీకు అనుమానం ఉంటే బ్యాంకు సేవా కేంద్రాన్ని సంప్రదించి, వివరాలు తెలుసుకోండి.

ఇతరులను వాడనీయొద్దు..

మీరు వ్యక్తిగతంగా వినియోగించే ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌ కంప్యూటర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులు వినియోగించుకోకుండా చూసుకోవాలి. బ్యాంకింగ్‌ సంబంధించిన సమాచారం ఉంటే సులభంగా వారు తస్కరించే అవకాశం ఉంటుంది. మీ కంప్యూటర్‌లను ఎవరికీ రిమోట్‌ యాక్సెస్‌కు ఇవ్వకూడదు. మీ వ్యక్తిగత ఆర్థిక సమాచారాన్ని అడిగినప్పుడు, ఎంత నమ్మకమైన వారికైనా ఇవ్వకూడదు. ఒకవేళ సందర్భాన్ని బట్టి, ఇచ్చినా వెంటనే పాస్‌వర్డ్‌లు మార్చుకోవాలి. నమ్మకమైన వెబ్‌సైట్ల నుంచే మీకు అవసరమైన అంశాలను  డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

ఆ అంకెలు చెప్పొద్దు..

ఆన్‌లైన్‌లో నగదు బదిలీ, కొనుగోళ్లు పూర్తి చేయాలంటే.. ఓటీపీ (వన్‌ టైం పాస్‌వర్డ్‌) ఎంతో కీలకం. మోసగాళ్లు మీ వివరాలను తెలుసుకొని, ఆన్‌లైన్‌ కొనుగోళ్లు పూర్తి చేసే క్రమంలో ఓటీపీ వచ్చేలా చూస్తారు. దాన్ని మనతో తెలివిగా చెప్పించుకుంటారు. లేదా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నట్లు ప్రారంభించి, వారికి కావాల్సిన సమాచారాన్ని రాబడతారు. మీరు ఏమరుపాటుగా ఉండి, వారు అడిగిన వివరాలు చెప్పారా? ఖాతా ఖాళీ అయినట్లే. గుర్తుంచుకోండి.. బ్యాంకు నుంచి మీకు ఎప్పుడూ ఫోన్‌ రాదు. వచ్చినా మీ వ్యక్తిగత, బ్యాంకింగ్‌ సమాచారం గురించి అడగదు. కేవైసీ అప్‌డేట్‌ చేయాలని కోరినా బ్యాంకు శాఖను సంప్రదించి, ఆ పత్రాలు ఇస్తామని ఇస్తామని చెప్పాలి.


* ఇప్పుడు చాలా ప్రాంతాల్లో ఉచిత వై-ఫై అందుబాటులో ఉంటోంది. బ్యాంకింగ్‌, ఆన్‌లైన్‌ కొనుగోలు లావాదేవీలకు ఈ వై-ఫైని ఉపయోగించకపోవడమే మంచిది. ఈ ఓపెన్‌ నెట్‌వర్క్‌లు సైబర్‌ దాడులకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

* మీకు సంబంధం లేకుండా పాస్‌వర్డ్‌లు మార్చినట్లు ఎస్‌ఎంఎస్‌, ఇ-మెయిల్‌ వచ్చినప్పుడు వెంటనే స్పందించండి. బ్యాంకుకు ఆ విషయాన్ని తెలియజేయండి. బ్యాంకు ఖాతాలోకి లాగిన్‌ అయి, మరో పటిష్ఠమైన పాస్‌వర్డ్‌ను ఏర్పాటు చేసుకోండి.  ఆన్‌లైన్‌ లావాదేవీలు మన నిత్య జీవితంలో భాగమయ్యాయి. అందుకే, జరుగుతున్న మోసాల గురించి అవగాహన పెంచుకోవడం, అలాంటి అనుభవాలు ఎదురైనప్పుడు ఏం చేయాలి అనేది తెలుసుకుంటూ సైబర్‌ మోసాల నుంచి మనల్ని కాపాడుకోవాలి.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని