Aadhaar: సిమ్‌ తీసుకోవాలంటే ఆధార్‌ తప్పనిసరా? ఉడాయ్‌ ఏం చెబుతోంది?

FAQs on Aadhaar in Telugu: ఆధార్‌ విషయంలో ప్రజల్లో నెలకొన్న సందేహాలు, అనుమానాలను విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్‌) ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ వస్తోంది. తరచూ అడిగే అలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు చూద్దాం..

Published : 13 Sep 2022 16:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్యాంక్‌ ఖాతా తెరవాలన్నా.. కొత్త సిమ్‌ తీసుకోవాలన్నా.. ఇలా ప్రతి పనికీ ఆధార్‌ (Aadhaar) వినియోగిస్తున్నాం. దీంతో ఇది మన నిత్య జీవితంలో భాగమైపోయింది. మన పేరు, అడ్రస్‌, ఫోన్‌ నంబర్‌, బయోమెట్రిక్‌ వంటి వివరాలన్నీ ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో ఆధార్‌ విషయంలో ప్రజల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. వ్యక్తిగత డేటా గోప్యతపై అవగాహన పెరగడం ఒకటైతే.. సైబర్‌ నేరస్థుల ఆగడాలు పెరగడం దీనికి మరో కారణం. కారణాలేవైనా ఆధార్‌ విషయంలో ప్రజలు మునుపటితో పోలిస్తే అప్రమత్తంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆధార్‌ విషయంలో ప్రజల్లో నెలకొన్న సందేహాలు, అనుమానాలను విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్‌) ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ వస్తోంది. తరచూ అడిగే అలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు చూద్దాం..

బ్యాంక్‌ ఖాతాకు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరా?

బ్యాంక్‌ ఖాతాను ఆధార్‌తో అనుసంధానించడం తప్పనిసరేం కాదు. ఈ విషయంలో సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పు వెలువరించింది. అయితే ప్రభుత్వ పథకాలకు సంబంధించి రాయితీలు, ప్రయోజనాలు, సేవలు పొందాలంటే బ్యాంకు ఖాతాకు ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాలి. ఇతర బ్యాంకింగ్‌ సేవలకు ఆధార్‌ను కేవైసీ పత్రంగా ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ మీరు ఆధార్‌ను సమర్పించడానికి ఇష్టం లేకపోతే ఆర్‌బీఐ నిర్దేశించిన పత్రాలను ఇవ్వొచ్చని ఉడాయ్‌ పేర్కొంది.

ఆధార్‌ నంబర్‌ దొరికితే బ్యాంక్‌ ఖాతా హ్యాక్‌ చేయొచ్చా? 

ఆధార్‌ నంబర్‌ దొరికినంత మాత్రన బ్యాంక్‌ ఖాతాను ఎవరూ చేయలేరని చెబుతోంది ఉడాయ్‌. అలాంటి ప్రచారాన్ని తోసిపుచ్చింది. ఏటీఎం కార్డు నంబర్‌ తెలిసినంత మాత్రన ఏవిధంగానైతే ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేయలేరో.. ఆధార్‌ నంబర్‌ తెలిసినంత మాత్రన వారు బ్యాంక్‌ ఖాతాలోకి చొరబడలేరు. పిన్‌, ఓటీపీ వంటి వివరాలు పంచుకోనంత వరకు మీ ఖాతా సేఫ్‌.

వ్యక్తుల యాక్టివిటీని ఉడాయ్‌ ట్రాక్‌ చేస్తుందా?

ఆధార్‌ను బ్యాంక్‌ ఖాతా, పాన్‌తో అనుసంధానం చేయడంతో పాటు బయోమెట్రిక్‌ వివరాలను సైతం ఇస్తుంటాం. వాటి ద్వారా మనల్ని ఉడాయ్‌ ట్రాక్‌ చేస్తోందేమోనన్న అనుమానాలు కొందరిలో ఉన్నాయి. అలాంటి ప్రచారం ఉత్తిదేనని ఉడాయ్‌ పేర్కొంది. ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ సమయంలో ఇచ్చే పేరు, చిరునామా, పుట్టిన తేదీ, ఫింగర్‌ ప్రింట్స్‌, ఐరిస్‌ వివరాలు, ఫొటోగ్రాఫ్‌తో పాటు ఆప్షనల్‌గా సేకరించే మొబైల్‌ నంబర్‌, ఇ-మెయిల్‌ వంటి వివరాలను మాత్రమే ఉడాయ్‌ వద్ద పొందుపరిచి ఉంటాయి. అంతకుమించి వివరాలేవీ ఉడాయ్‌ దగ్గర ఉండవు. ఆధార్‌ చట్టం ప్రకారం.. ఉడాయ్‌కి అలాంటి డేటాను సేకరించే, నియంత్రించే అధికారం లేదు. అలాగే, బ్యాంకులు, మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీలు, టెలికాం కంపెనీలకు ఆధార్‌ వివరాలు సమర్పించినప్పుడు ఆ వివరాలు ఏవీ ఉడాయ్‌కి చేరవు. కేవైసీలో భాగంగా ఆ వివరాలు తమ డేటా బేస్‌తో  పోల్చినప్పుడు సరిపోలితే ‘యస్‌’ అని, లేకపోతే ‘నో’ అని మాత్రమే ఉడాయ్‌ వాటికి పేర్కొంటుంది.

సిమ్‌కార్డుకు ఆధార్‌ అవసరమా?

కొత్త సిమ్‌ కార్డు తీసుకునే సందర్భంలో కేవైసీ డాక్యుమెంట్‌గా ఆధార్‌ ఇవ్వడం అనేది ఐచ్ఛికం మాత్రమే. ఇది తప్పనిసరైతే కాదు. అయితే, వ్యక్తిగత భద్రత, దేశ భద్రత దృష్ట్యా మాత్రం ఫోన్‌ నంబర్‌, ఆధార్‌ నంబర్‌తో ధ్రువీకరించడం మంచిదని ఉడాయ్‌ సూచిస్తోంది. ఉగ్రవాదులు, నేరగాళ్లు వ్యక్తులకు తెలియకుండానే వారి పేరుతో సిమ్‌కార్డులు తీసుకుని మోసాలకు పాల్పడుతుంటారు. ఒకవేళ ఆధార్‌తో ఫోన్‌ నంబర్‌ లింక్‌ అయ్యి ఉండడం వల్ల వ్యక్తులను గుర్తించడం సులువు అవుతుందని, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం సులువు అవుతుందని ఉడాయ్‌ చెబుతోంది. అలాగే మొబైల్‌ కంపెనీలు గానీ ఏ ఇతర కంపెనీలు గానీ వెరికేషన్‌ సమయంలో ఇచ్చే బయోమెట్రిక్‌ వివరాలను స్టోర్‌ చేయడానికి వీల్లేదని స్పష్టంచేసింది.

ఎన్‌ఆర్‌ఐలు ఆధార్‌ పొందొచ్చా?

విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు సైతం ఆధార్‌ను పొందొచ్చని ఉడాయ్‌ చెబుతోంది. ఇండియన్‌ పాస్‌పోర్ట్‌ ఉంటే సమీపంలోలోని ఆధార్‌ కేంద్రానికి వెళ్లి ఆధార్‌ కోసం దరఖాస్తు చేయొచ్చని చెబుతోంది. ధ్రువీకరణ కోసం పాస్‌పోర్ట్‌ను సమర్పించడం మాత్రం తప్పనిసరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని