అదానీ ఇంతటితో ఆగుతారా..

5జీ స్పెక్ట్రమ్‌ వేలంలో పాల్గొంటున్నట్లు గౌతమ్‌ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్‌ స్పష్టం చేయడం టెలికాం రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కేంద్రప్రభుత్వం నిర్ణయించిన నూతన విధానానికి అనుగుణంగా, సొంత అవసరాల నిమిత్తమే స్పెక్ట్రమ్‌ కొనుగోలు చేస్తామని, టెలికాం వినియోగదారు

Updated : 14 Jul 2022 13:02 IST

సొంత అవసరాలకే స్పెక్ట్రమ్‌ వినియోగిస్తామన్న అదానీ గ్రూప్‌

టెలికాం సేవల్లోకీ ప్రవేశిస్తారనే ఊహాగానాలు

5% పడిన ఎయిర్‌టెల్‌ షేరు

5జీ స్పెక్ట్రమ్‌ వేలంలో పాల్గొంటున్నట్లు గౌతమ్‌ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్‌ స్పష్టం చేయడం టెలికాం రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కేంద్రప్రభుత్వం నిర్ణయించిన నూతన విధానానికి అనుగుణంగా, సొంత అవసరాల నిమిత్తమే స్పెక్ట్రమ్‌ కొనుగోలు చేస్తామని, టెలికాం వినియోగదారు సేవల్లోకి ప్రవేశించడం లేదుని అదానీ గ్రూప్‌ ప్రకటించింది. ఇప్పటికే నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, గనులు, డేటా సెంటర్‌ వంటి మౌలిక వసతుల విభాగాల్లో వ్యాపార సామ్రాజ్యాన్ని అదానీ విస్తరించారు. స్వచ్ఛ ఇంధన వ్యాపారంలో ప్రపంచంలోనే అగ్రస్థానం లక్ష్యంగా పావులు కదుపుతున్న అదానీ గ్రూప్‌.. సిమెంటు తయారీలో ఒక్కసారిగా దేశంలోనే రెండోస్థానానికి చేరేలా అగ్రగామి సంస్థలను స్వాధీనం చేసుకోవడాన్ని విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. భవిష్యత్తు వ్యాపార అవకాశాలు అపారంగా ఉన్న టెలికాం సేవల్లోకీ అదానీ ప్రవేశిస్తారనే అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త సంస్థను నెలకొల్పుతారా లేక ప్రస్తుతం అందుబాటులో ఉన్న కంపెనీల్లో దేనినైనా స్వాధీనం చేసుకుంటారా అనే విశ్లేషణలూ సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్‌ షేర్లన్నీ సోమవారం లాభాల్లో ముగిశాయి. అదానీ గ్రీన్‌ ఎనర్జీ 15.04%, అదానీ టోటల్‌ గ్యాస్‌ 6.80%, అదానీ ట్రాన్స్‌మిషన్‌ 5.94%, అదానీ పవర్‌ 4.99%, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 3.42%, అదానీ పోర్ట్స్‌ 1.82% చొప్పున లాభాలు నమోదుచేశాయి.

టెలికాం షేర్లు ఇలా

అగ్రగామి టెలికాం సంస్థ  భారతీ ఎయిర్‌టెల్‌ షేరు సోమవారం అమ్మకాల ఒత్తిడికి గురికాగా, వొడాఫోన్‌ ఐడియా షేరు రాణించింది. ఎయిర్‌టెల్‌ షేరు ఇంట్రాడేలో రూ.659.05 వద్ద కనిష్ఠాన్ని తాకి, చివరకు 5.03 శాతం నష్టంతో రూ.660.30 వద్ద ముగిసింది. సోమవారం నిఫ్టీ-50 షేర్లలో ఎక్కువ నష్టపోయిన షేరుగా మిగిలింది. వొడాఫోన్‌ ఐడియా షేరు 3.44 శాతం పెరిగి రూ.8.72 దగ్గర స్థిరపడింది. జియో మాతృసంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 1.33 శాతం పెరిగి రూ.2423.20 వద్ద ముగిసింది. ఎంటీఎన్‌ఎల్‌ షేరు 19.85 శాతం లాభపడి రూ.23.25కు చేరింది.  

రూ.2.5 లక్షల కోట్లు అవసరం: ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ సేవల కోసం మాత్రమే 5జీ స్పెక్ట్రమ్‌ వేలంలో పాల్గొంటున్నామని, తమ విమానాశ్రయాలు, పోర్టులు, విద్యుదుత్పత్తి, డేటా కేంద్రాల అవసరాల కోసమే స్పెక్ట్రమ్‌ను వినియోగించుకుంటామని అదానీ గ్రూప్‌ చెబుతోంది.  ‘గత రెండు దశాబ్దాల్లో టెలికాం రంగంలో తీవ్ర పోటీ నడిచింది. ఈ రంగంలోకి కొత్త సంస్థ ప్రవేశిస్తే, ప్రస్తుత కంపెనీల మార్కెట్‌ వాటాలపై ప్రతికూల ప్రభావం చూపొచ్చని మదుపర్లు భావిస్తున్నారు’ అని దేశీయ బ్రోకరేజీ సంస్థ మోతీలాల్‌ ఓస్వాల్‌ అభిప్రాయపడింది. వొడాఫోన్‌ ఐడియాతో ఇంటర్‌కంపెనీ రోమింగ్‌ (ఐసీఆర్‌) ఒప్పందం కుదుర్చుకుంటే.. పూర్తి స్థాయిలో టెలికాం రంగంలోకీ అదానీలు అడుగుపెట్టే అవకాశం ఉంటుందని తెలిపింది. వొడాఫోన్‌ ఐడియాను స్వాధీనం చేసుకోవాలంటే రూ.2.5 లక్షల కోట్ల మూలధన పెట్టుబడులు అవసరమన్నది ఆ సంస్థ అంచనా.

 గోల్డ్‌మన్‌ శాక్స్‌దీ అదే మాట: స్పెక్ట్రమ్‌ వేలంలో పాల్గొననున్న అదానీ గ్రూప్‌, భవిష్యత్తులో వినియోగదారు సేవల్లోకి అడుగుపెట్టవచ్చని ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ అయిన గోల్డ్‌మన్‌ శాక్స్‌ అంచనా వేస్తోంది. అదానీ పోటీని తట్టుకునేందుకు ఎయిర్‌టెల్‌, జియోలకు బలమైన బ్యాలెన్స్‌ షీట్‌లు ఉన్నాయని, వొడాఫోన్‌ ఐడియాకు మాత్రం ఇబ్బందికరమేనని చెబుతోంది. ‘వేలంలో పాల్గొనకుండానే క్యాప్టివ్‌ నెట్‌వర్క్‌లకు స్పెక్ట్రమ్‌ పొందే సౌలభ్యం ఉంది. అదానీగ్రూప్‌ తమ సంస్థల అవసరాలకు కావాల్సిన స్పెక్ట్రమ్‌ కోసం, వేలంలో పాల్గొనడం, ఆర్థికంగా ఆ సంస్థకు లాభం చేకూర్చదని భావిస్తున్నాం. అందువల్ల వినియోగదారు నెట్‌వర్క్‌ల్లోకి వచ్చేందుకే అదానీ గ్రూప్‌ ముందడుగు వేస్తుందని విశ్వసిస్తున్నాం’ అని గోల్డ్‌మన్‌ శాక్స్‌ పేర్కొంది.

* ‘వడ్డీ బకాయిలను ఈక్విటీగా మార్చడం వల్ల వొడాఫోన్‌ ఐడియాలో ప్రభుత్వానికి 33 శాతం వాటా లభిస్తుంది. ఈ వాటాను సరైన సమయంలో విక్రయించడం ద్వారా, బకాయిలు వసూలు చేసుకుంటామ’ని ప్రభుత్వం ప్రకటించడాన్నీ గోల్డ్‌మన్‌ శాక్స్‌ ప్రస్తావిస్తోంది.

అదానీ ప్రవేశిస్తే, టెలికాం సేవల్లో మళ్లీ పోటీ తీవ్రమయ్యే అవకాశం ఉందని ఆర్థిక సేవల సంస్థ బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా అభిప్రాయపడింది. నేరుగా స్పెక్ట్రమ్‌ పొందకుండా అదానీలు వేలంలో ఎందుకు పాల్గొంటున్నారో తెలియడం లేదని సీఎల్‌ఎస్‌ఏ తెలిపింది.

ఎయిర్‌టెల్‌ షేరు సానుకూలమే: ఇవి ఎలా ఉన్నా, రూ.835 లక్షిత ధరతో భారతీ ఎయిర్‌టెల్‌ షేరు కొనుగోలు చేయొచ్చని దేశీయ బ్రోకరేజీ సంస్థ ఐఐఎఫ్‌ఎల్‌ పేర్కొంటోంది. టారిఫ్‌లు పెంచిన నేపథ్యంలో, జూన్‌ త్రైమాసిక ఫలితాలు ఆకర్షణీయంగా నమోదుకావొచ్చని అంచనా వేసింది. అదానీ టెలికాం సేవల రంగంలోకి అడుగుపెట్టడానికి చాలా సమయం పడుతుందని, ఇప్పటికే జియో పోటీని తట్టుకున్న ఎయిర్‌టెల్‌కు ఈ పరిణామం పెద్ద ఇబ్బంది కలిగించకపోవచ్చని విశ్లేషిస్తోంది.

స్పష్టత అప్పుడే: అదానీ గ్రూప్‌ దేశంలో ఎన్ని సర్కిళ్లలో, ఏఏ బ్యాండ్‌ల స్పెక్ట్రమ్‌ కోసం బిడ్లు దాఖలు చేయనుందనే అంశంపై స్పష్టత వచ్చే వరకు టెలికాం షేర్ల విషయంలో అప్రమత్తత పాటించమని విశ్లేషకులు సూచిస్తున్నారు.


రిలయన్స్‌ కూడా అప్పట్లో ఇంతే

2016లో టెలికాం వాణిజ్య సేవలను ప్రారంభించేందుకు, చాలా ముందుగా 2010లోనే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 2300 మెగాహెర్ట్జ్‌ స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసిందని పరిశోధనా సంస్థ జెఫ్రీస్‌ ప్రస్తావిస్తోంది. అప్పట్లో ఈ స్పెక్ట్రమ్‌ వాయిస్‌ సేవలకు పనికిరాదు. ఈ నిబంధనను 2013లో ప్రభుత్వం సవరించి, వాయిస్‌ సేవలకు ఈ స్పెక్ట్రమ్‌ను అనుమతించడం జియో ఆవిర్భావానికి కారణమైందని గుర్తు చేస్తోంది. తదుపరి యూనిఫైడ్‌ సేవల లైసెన్సు పొంది, టెలికాం సేవల్లోకి ప్రవేశించడం ద్వారా, అగ్రస్థానానికి జియో చేరిందని వివరించింది. అందువల్ల భవిష్యత్తులో అదానీ గ్రూప్‌ కూడా టెలికాం సేవల్లోకి ప్రవేశించవచ్చనే అంచనాను వ్యక్తం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని