వీరి వ్యాపారానికి.. సతీమణి సంపాదనే తొలి పెట్టుబడి..!

కష్టపడి పనిచేసి భర్త వ్యాపారానికి కావాల్సిన పెట్టుబడిన అందించిన మహిళలు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో కొంత మంది గురించి తెలుసుకుందాం..

Updated : 10 Jan 2023 14:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో ఇప్పటికీ పితృస్వామ్య వ్యవస్థే ఆచారంలో ఉంది. అంటే కుటుంబ పెద్దగా పురుషులే కొనసాగుతున్నారు. మగవారు సంపాదిస్తే ఆడవాళ్లు ఇంటిని చక్కబెట్టాలన్న సంప్రదాయం ఇప్పటికీ చాలా ఇళ్లల్లో అమల్లో ఉంది. అయితే, కాలం గడుస్తున్న కొద్దీ ఈ విషయంలో మార్పొస్తోంది. ముఖ్యంగా పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడుతున్న నేటి యువత ఇంట్లో ఇద్దరూ కష్టపడాలనే నియమాన్ని పాటిస్తున్నారు. పెరుగుతున్న జీవన వ్యయాలూ అందుకు ఓ కారణమని చెప్పాలి.

ఎన్ని ఆచారాలు, కట్టుబాట్లు ఉన్నా.. కుటుంబం కోసం, అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం భర్తవైపు గట్టిగా నిలబడి సపోర్ట్‌ చేస్తున్న మహిళలు అనేక మంది ఉన్నారు. పురుషులు తమ వ్యాపకాల్లో, లక్ష్య సాధనలో నిమగ్నమై ఉంటే.. కుటుంబ బాధ్యతల్ని భుజాన వెసుకున్నవారి గురించి మనం అప్పుడప్పుడూ వింటూనే ఉంటాం. అంతేనా.. కష్టపడి సంపాదించి భర్త కలల్ని సాకారం చేసిన త్యాగమూర్తులూ ఉన్నారు. వ్యాపారానికి కావాల్సిన తొలిపెట్టుబడిని అందించి భర్త విజయానికి శ్రీకారం చుట్టిన స్త్రీలూ ఉన్నారు. అలాంటి వారిలో కొంతమంది గురించి తాజాగా రిచా సింగ్‌ అనే ట్విటర్‌ యూజర్‌ గుర్తుచేశారు.

ఆమె సంపాదిస్తే.. నేను ఖర్చు చేస్తా..

‘నా భార్య సంపాదిస్తుంది, నేను ఖర్చు చేస్తాను’.. ఓ కార్యక్రమంలో ఫ్లాట్‌హెడ్స్‌ సహ- వ్యవస్థాపకుడు గణేశ్‌ బాలకృష్ణన్‌ చెప్పిన మాటలివి. అయితే, ఆయన దీన్ని కాస్త సిగ్గుపడుతూ చెప్పారు. ‘‘భార్య వేతనంతో జీవిస్తున్నానని చెప్పడాన్ని భారతీయ సమాజం ఎలా చూస్తుందో నేను అర్థం చేసుకోగలను’’ అని రిచాసింగ్‌ కామెంట్‌ చేయడం గమనార్హం. గణేశ్‌తో పాటు భార్య నుంచి ఆర్థిక సాయం పొందిన మరో ఇద్దరు ప్రముఖ వ్యాపారవేత్తలను కూడా రిచా సింగ్‌ ప్రస్తావించారు. 

సుధామూర్తి పెట్టుబడితోనే..

ఇన్ఫోసిస్‌ సహ- వ్యవస్థాపకుడు నారాయణమూర్తి తన సతీమణి సుధామూర్తి ఇచ్చిన తొలిపెట్టుబడితోనే కంపెనీని ప్రారంభించినట్లు రిచాసింగ్‌ గుర్తుచేశారు. అంతకుముందు నారాయణమూర్తి తాను సొంతంగా ప్రారంభించిన వ్యాపారంలో విఫలమైనట్లు తెలిపారు. అప్పట్లో రూ. 10,000 అప్పుగా ఇచ్చి సుధామూర్తి ఇన్ఫోసిస్‌లో తొలి ఇన్వెస్టర్‌గా మారారని పేర్కొన్నారు. 

ఓలా క్యాబ్స్ సీఈఓ భవీష్‌ అగర్వాల్‌ సైతం మొదట్లో తన భార్య రాజలాక్షి అగర్వాల్‌ నుంచి ఆర్థిక సాయం పొందారని రిచాసింగ్‌ తెలిపారు. ఓలా ప్రారంభించిన తొలినాళ్లలో ఆర్డర్లు అధికంగా ఉన్నప్పుడు ఆమె కారు తీసుకుని క్యాబ్‌గా వాడుకునేవారని పేర్కొన్నారు.

జీవిత భాగస్వామితోనే జీవిత గమనం..

ఇలా తమ జీవితభాగస్వాముల నుంచి సాయం తీసుకున్నవారిలో చాలా మంది అంకుర సంస్థల వ్యవస్థాపకులు కూడా ఉన్నారని రిచాసింగ్‌ తెలిపారు. ‘‘మన జీవిత గమనం.. మనం వివాహం చేసుకున్న వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది’’ అనే మాట నిజమేనని ఆమె అభిప్రాయపడ్డారు. రిచాసింగ్‌ చేసిన ఈ పోస్ట్‌కు సామాజిక మాధ్యమాల్లో మంచి స్పందన లభిస్తోంది. భారతీయ సమాజం అంతగా గుర్తించని ఓ ముఖ్యమైన అంశాన్ని లేవనెత్తారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

నౌకరీ.కామ్‌ను స్థాపించడానికి సంజీవ్‌ భిఖ్‌చందానీ సైతం తన భార్య మద్దతు తీసుకున్నారని మరో ట్విటర్‌ యూజర్‌ కామెంట్‌ చేశారు. అలాగే తనకూ తన జీవిత భాగస్వామి ఎంతో సహకారం అందిస్తోందని మరో యూజర్‌ స్పందించారు. మరో ఉద్యోగం వెతుక్కోకుండానే తాను ఇటీవల ఉన్న జాబ్‌కు రాజీనామా చేశానని తెలిపారు. అది తన భార్య ఇచ్చిన భరోసా వల్లే సాధ్యమైందని చెప్పారు.

వీళ్లే కాదు.. ఏమాత్రం గుర్తింపు ఆశించకుండా కుటుంబం కోసం కష్టపడి పనిచేసే ఎంతో మంది మహిళల్ని మనం మన నిత్యజీవితంలో చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్లందరికీ మనం కచ్చితంగా హాట్సాఫ్‌ చెప్పాల్సిందే..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని