Bill Gates : అప్పట్లో నిద్ర ‘అనవసరం’ అనుకున్నా..: బిల్‌ గేట్స్‌

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్‌ గేట్స్‌ (Bill Gates) నిద్ర గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తాను లెక్కలు వేసుకొని మరీ నిద్రపోతానని చెప్పారు.

Updated : 08 Aug 2023 19:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : మైక్రోసాఫ్ట్‌ (Microsoft) సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ (Bill Gates) నిద్ర గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను మైక్రోసాఫ్ట్‌ను నెలకొల్పిన తొలినాళ్లలో నిద్రపోవడం సోమరితనంగా, అనవసరమైనదిగా భావించానని చెప్పారు. సేథ్‌ రోజన్‌, లారెన్‌ మిల్లర్‌తో కలిసి పాల్గొన్న ఓ పాడ్‌కాస్ట్‌లో బిల్‌గేట్స్‌ మాట్లాడుతూ.. ‘నేను 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసులో ఉన్నప్పుడు నిద్ర గురించి వివిధ రకాల సంభాషణలు వచ్చేవి. నేను ఆరుగంటలు నిద్రపోయానని ఒకరు చెబితే.. లేదు నేను ఐదు గంటలే పడుకున్నానని, కొన్నిసార్లు అసలు నిద్రపోనని మరొకరు అనేవారు. వారి మాటలు విన్న తర్వాత ఎంత గొప్ప పని చేస్తున్నారనిపించింది. నిద్ర బద్ధకం, అనవసరమని భావించి నేను కూడా నిద్రపోకుండా ఉండటానికి ప్రయత్నించానని’ బిల్‌ గేట్స్‌ వెల్లడించారు.

మృతదేహాలను అద్దెకు తెచ్చుకున్నారట : ఆందోళనకారులపై పోలీసుల ఆరోపణ

2020లో నిద్రపై తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని బిల్‌గేట్స్‌ పేర్కొన్నారు. తన తండ్రి అల్జీమర్స్‌తో చనిపోవడమే అందుకు కారణమన్నారు. అప్పటి నుంచి నిద్రకు ప్రాధాన్యత ఇస్తున్నానని చెప్పారు. రోజూ ఎన్నిగంటలు నిద్రపోతున్నానో, ఎంత సుఖంగా నిద్రపోతున్నానో లెక్కలు వేసుకుంటున్నట్లు వివరించారు. బయటకు కనిపించే ఆరోగ్యం మాత్రమే ప్రధానం కాదని, మెదడు ఆరోగ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. యుక్త వయసు నుంచే ఎక్కువ సేపు నిద్రపోవడం అలవర్చుకోవడం మంచిదని అభిప్రాయపడ్డారు. న్యూరో సైంటిస్ట్‌ మ్యాథ్యూ వాకర్‌ రాసిన ‘వై వుయ్‌ స్లీప్‌’ పుస్తకం ద్వారా నిద్ర గురించి తనకు ఎన్నో విషయాలు తెలిశాయని గేట్స్‌ వివరించారు. ప్రస్తుతం రాత్రిపూట ఏడు నుంచి ఎనిమిది గంటలు క్రమం తప్పకుండా నిద్రపోతున్నట్లు ఆయన అలవాటు గురించి చెప్పుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని