Padma Bhushan: భారత్‌కు అధిక ప్రాధాన్యం.. ఫాక్స్‌కాన్‌ సీఈఓకు పద్మభూషణ్‌ ఇందుకే

Padma Bhushan: తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్‌ తయారీ దిగ్గజం ఫాక్స్‌కాన్‌ (Foxconn) సీఈఓ యాంగ్‌ లీ (Young Liu)కు ‘పద్మ’ పురస్కారం వరించింది. కారణం ఇదే..

Published : 26 Jan 2024 15:10 IST

Padma Bhushan | ఇంటర్నెట్‌డెస్క్‌: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను (Padma Awards 2024) గురువారం ప్రకటించింది. అందులో వాణిజ్య-పరిశ్రమల రంగంలో నలుగురిని ‘పద్మ’ పురస్కారాలు వరించాయి. సీతారామ్‌ జిందాల్‌ (కర్ణాటక), యాంగ్‌ లీ (తైవాన్‌)లకు పద్మభూషణ్‌, కల్పనా మోర్పారియా (మహారాష్ట్ర), శశి సోనీ (కర్ణాటక)లకు పద్మశ్రీ దక్కాయి. వీరిలో తైవాన్‌కు చెందిన వ్యక్తికి భారత అత్యున్నత పురస్కారం ప్రకటించటంతో అందరి దృష్టి ఆయనపై పడింది. 

తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్‌ తయారీ దిగ్గజం ఫాక్స్‌కాన్‌ (Foxconn) సీఈఓ నే ఈ యాంగ్‌ లీ (Young Liu). ఐఫోన్‌ తయారీలో యాపిల్‌ సంస్థకు (70శాతం) అతిపెద్ద సరఫరాదారుగా ఉంది ఈ సంస్థ. యాపిల్‌ ఐఫోన్ల అసెంబ్లింగ్‌ చేస్తున్న ప్రధాన కంపెనీల్లో ఇది కూడా ఒకటి. కొవిడ్‌ విజృంభించడంతో ఎదురైన సమస్యలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల చైనా దేశం వెలుపల తయారీ కార్యకలాపాలను విస్తరించింది. అందులో భారత్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. దక్షిణ భారతదేశంలోని ఉత్పాదక సదుపాయాలపై భారీగా పెట్టుబడి పెట్టింది. 

పగలు సీఈఓ.. రాత్రి పూట క్యాబ్‌ డ్రైవర్‌!

ఎలక్ట్రానిక్స్‌ ఉపకరణాల తయారీ విభాగంలో యాంగ్‌ లీకు నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. ఈయన మూడు కంపెనీలు స్థాపించారు. 1988లో యాంగ్ మైక్రో సిస్టమ్స్ అనే మదర్‌బోర్డ్ కంపెనీ, 1995లో PC చిప్‌సెట్ కోసం IC డిజైన్ కంపెనీ,  1997లో ITeX ను ప్రారంభించారు. భారత్‌లోనూ కొన్ని రాష్ట్రాల్లో ప్లాంట్లను నెలకొల్పారు. సెమీ కండక్టర్ ప్రణాళికల కోసం సహకారం అందిస్తున్నారు. ‘భవిష్యత్తులో ఎలక్ట్రానిక్స్‌ తయారీకి భారత్‌ ముఖ్యమైన దేశం’ అని ఆయన పేర్కొన్నారు. ఇలా దేశంలో సేవలు విస్తరిస్తున్నందుకు గానూ యాంగ్‌ లీకు పద్మభూషణ్‌ పురస్కారం లభించడం విశేషం. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది మొత్తం 132 మందికి ‘పద్మ’ పురస్కారాలు ప్రకటించగా.. ఐదుగురికి పద్మ విభూషణ్‌, 17 మందికి పద్మభూషణ్‌, 110 మందిని పద్మశ్రీ అవార్డులు వరించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని