Whatsapp: యూకే కొత్త బిల్లు.. గుడ్‌బై చెప్తామంటున్న వాట్సాప్‌!

Whatsapp-UK: యూకే ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త బిల్లుపై వాట్సాప్‌ అభ్యంతరం వ్యక్తంచేస్తోంది. అవసరమైతే యూకేను వీడుతామని స్పష్టంచేసింది.

Updated : 10 Mar 2023 18:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ మెసేజింగ్‌ సంస్థ వాట్సాప్‌ (Whatsapp) యూకే తీసుకొస్తున్న కొత్త బిల్లుపై గుర్రుగా ఉంది. ఒకవేళ అదే జరిగితే తాము యూకేను (UK) వీడి వెళ్లడానికి వెనకాడబోమని స్పష్టంచేసింది. ఎండ్‌-టు- ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ విషయంలో రాజీ పడే బదులు యూకేను వీడడమే మంచిదని పేర్కొంది. మరో మెసేజింగ్‌ యాప్‌ సిగ్నల్‌ సైతం ఇదే తరహా సంకేతాలు ఇచ్చింది. ఇంతకీ యూకే తీసుకొస్తున్న కొత్త బిల్లేంటి? దానిపై వాట్సాప్‌ అభ్యంతరం ఏమిటి?

ఆన్‌లైన్‌ సేఫ్టీ బిల్లును యూకే ప్రభుత్వం తీసుకొస్తోంది. బోరిస్‌ జాన్సన్‌ సర్కారు దీన్ని తొలుత ప్రతిపాదించగా.. త్వరలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు ప్రకారం.. ప్రభుత్వం గానీ, రెగ్యులేటరీ సంస్థ అయిన ఆఫ్కామ్‌ గానీ ఆయా యాప్స్‌ను సందేశాలను స్కాన్‌ చేయాలని కోరొచ్చు. ఉగ్రవాద కార్యకలాపాలు, చిన్నారులపై లైంగిక వేధింపుల నిరోధానికి ఈ బిల్లు తెస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంటోంది.

ఈ బిల్లు పట్ల వాట్సాప్‌ అభ్యంతరం వ్యక్తంచేస్తోంది. కేవలం పంపించే వారు చదివే వారు మాత్రమే చూసే విధంగా ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ విధానాన్ని వాట్సాప్‌ ప్రస్తుతం అనుసరిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇదే విధానాన్ని అవలంబిస్తోంది. ఈ బిల్లు ఆమోదం పొందితే ఎన్‌క్రిప్షన్‌ విషయంలో రాజీ పడాల్సి వస్తుందని వాట్సాప్‌ చెబుతోంది. కాబట్టి ఎన్‌క్రిప్షన్‌ విధానంలో తాము ఎలాంటి మార్పు చేయబోమని వాట్సాప్‌ హెడ్‌ విల్‌ క్యాత్‌కార్ట్‌ స్పష్టంచేశారు. అవసరమైతే యూకే నుంచి వైదొలగడానికైనా సిద్ధమని పేర్కొన్నారు. సందేశాలను స్కాన్‌ చేయాలని యూకే ప్రభుత్వం నుంచి డిమాండ్లు వస్తే.. తామూ వైదొలగుతామని సిగ్నల్‌ సైతం స్పష్టంచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని