ఈ అమ్మాయిలు... వెన్నంటి మనసున్నోళ్లు...

యువ రక్తం కుదురుగా కూర్చోనివ్వదు..పైగా కరోనా వేళ పీజీ పరీక్షలు వాయిదా పడి సెలవులు వస్తే ఏం చేస్తారు..? ఇంకాస్త వెసులుబాటు దొరికిందని కాలాన్ని వెళ్లదీస్తారు. కానీ ఈ ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన యువ వైద్యురాళ్లు మాత్రం అలా చేయలేదు. కరోనా పల్లెలు, పట్టణాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలో తమ తోడ్పాటును సేవారూపంలో అందించాలని భావించారు

Published : 15 May 2021 00:46 IST

యువ రక్తం కుదురుగా కూర్చోనివ్వదు..పైగా కరోనా వేళ పీజీ పరీక్షలు వాయిదా పడి సెలవులు వస్తే ఏం చేస్తారు..? ఇంకాస్త వెసులుబాటు దొరికిందని కాలాన్ని వెళ్లదీస్తారు. కానీ ఈ ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన యువ వైద్యురాళ్లు మాత్రం అలా చేయలేదు. కరోనా పల్లెలు, పట్టణాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలో తమ తోడ్పాటును సేవారూపంలో అందించాలని భావించారు. ‘ఉచిత టెలి- కన్సల్టేషన్‌’ పేరిట రోజులో 16 గంటల పాటు కరోనా బాధిత కుటుంబాలకు కౌన్సెలింగ్‌ చేస్తున్నారు. కరీంనగర్‌కు చెందిన ఎంబీబీఎస్‌ పూర్తిచేసుకున్న హుజ్మాషరీన్‌ తన బ్యాచ్‌మేట్లతో కలిసి అందిస్తున్న స్వచ్ఛసేవానిరతి తీరిలా...
కరీంనగర్‌ సమీపంలోని ప్రతిమ వైద్యకళాశాలలో 2014-2020 వరకు వైద్య విద్యనభస్యసించిన విద్యార్థులంతా గడిచిన పక్షం రోజులుగా ఉచిత వైద్యసలహాలు, సేవలతో అందరి మన్ననల్ని పొందుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో తమ వివరాలు, ఫోన్‌నంబర్లతో కూడిన సమయసారిణిని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఉదయం 8 గంటలనుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ప్రతి 2 గంటలకు ముగ్గురు చొప్పున వైద్యులు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ఫోన్‌లకు స్పందిస్తున్నారు. పాజిటివ్‌ వచ్చి అభద్రతతో ఉన్న వారికి భయాన్ని పోగొట్టేలా భరోసానిస్తున్నారు. అందుబాటులో ఉన్న మందులను ఎలా వాడాలి..? వారి ఆరోగ్యస్థితి వివరాలకు తగినట్లు అవసరమైన సలహాలు, సూచనల్ని కౌన్సెలింగ్‌ రూపంలో ఈ వైద్యబృందం అందిస్తోంది. మొత్తం 24 మంది వైద్యులున్న ఈ బృందాన్ని ఏర్పాటు చేసింది డాక్టర్‌ హుజ్మాషరీన్‌. ఈమె తల్లి సర్దార్‌ హున్సీసా కూడా వైద్యురాలు. ఆమె గతేడాది కరీంనగర్‌లో కరోనా ఉద్ధృతిగా ఉన్న సమయంలో ఫోన్లో బంధువులకు, తెలిసినవాళ్లకి రేయింబవళ్లు సలహాలు అందించారు. అదే స్ఫూర్తితో తనకు ఈ ఆలోచన వచ్చిందని హుజ్మాషరీన్‌ చెబుతున్నారు. వాస్తవానికి గతనెలలో కరోనా వల్ల వీళ్లు రాయాల్సిన పీజీ పరీక్షలు వాయిదా పడ్డాయి. దీంతో ఖాళీగా ఉండటం ఎందుకని తన ఆలోచనల్ని తోటి అమ్మాయిలతో పంచుకున్నారు. ఇలా మొదట్లో ఐదారుగురితో ప్రారంభమైన ఈ సేవలో ప్రస్తుతం 24మంది యువ వైద్యులున్నారు. ఇందులో హుజ్మాషరీన్‌, నవ్యశ్రీ, ప్రసన్న, స్నేహ, రవీనా, హమాని, శరణ్య, శివాని, సన, సుప్రియ, రవళిలు కీలక పాత్ర పోషిస్తున్నారు. రోజులో సగటున 250 నుంచి 300 మందికి ఫోన్‌లో వీరంతా సలహాల్నిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తుండటంతో ఇతర వైద్యులు కూడా ఈ బృందంలో సభ్యులవుతున్నారు. ఇప్పటి వరకు 3వేల మందికి ఫోన్లో సేవనందించారు. 

- తుమ్మల శ్రీనివాస్‌, కరీంనగర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్