సైబర్‌ నేరాలు.. కష్టార్జితాన్ని మోసపోవద్దు...

బ్యాంకుకు వెళ్లి.. ఆర్థిక లావాదేవీలు నిర్వహించే కాలం కాదిది. అరచేతిలోని స్మార్ట్‌ ఫోన్‌తోనే క్షణాల్లో అన్నీ చక్కబెట్టేస్తున్నాం.

Updated : 02 Sep 2022 09:31 IST

బ్యాంకుకు వెళ్లి.. ఆర్థిక లావాదేవీలు నిర్వహించే కాలం కాదిది. అరచేతిలోని స్మార్ట్‌ ఫోన్‌తోనే క్షణాల్లో అన్నీ చక్కబెట్టేస్తున్నాం. పొదుపు ఖాతా ప్రారంభం నుంచి, షేర్లలో మదుపు వరకూ అన్నీ యాప్‌లతోనే సాధ్యం అవుతోంది. ఇదే సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మన కష్టార్జితాన్ని కాజేసేందుకు సైబర్‌ మోసగాళ్లు ఎదురుచూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు తమ ఖాతాదారులను అనుక్షణం అప్రమత్తం చేస్తున్నాయి.

సైబర్‌ నేరాలు అనగానే చాలామంది ఏదో పెద్ద సాంకేతికతతో మోసాలకు పాల్పడతారనే అపోహలో ఉంటారు. కానీ, ఇవన్నీ చిన్న సందేశాలు, కొన్ని మాటలతోనే జరుగుతాయనేది మనం గుర్తించాలి. బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని చెబుతూ.. మీ కార్డు చివరి నెంబరు, పేరు చెప్పి.. మిగతా రహస్య సమాచారాన్ని అంతా మనతోనే చెప్పించుకుంటారు. మాటల్లో పెట్టి, కార్డు సంఖ్య, సీవీవీ, గడువు తేదీ, ఓటీపీ, పిన్‌లాంటివి అడుగుతూ ఉంటారు. బ్యాంకు అధికారులతో మాట్లాడుతున్నామనే ఆలోచనతో ఇవన్నీ చెప్పేస్తుంటాం. ఇదే సైబర్‌ నేరస్థులకు వరంగా మారుతోంది.

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఖాతాదారులు ఈ మోసాల బారిన పడకుండా చూసేందుకు ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకుంది. అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పత్రికల్లోనూ నిరంతరం సైబర్‌ నేరాలకు సంబంధించిన వార్తలు, అప్రమత్తతగా ఉండాల్సిన అవసరాన్ని సూచిస్తూ కథనాలు వస్తూనే ఉంటాయి. బ్యాంకులూ తమ ఖాతాదారులను అప్రమత్తం చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నా.. ఇటీవల కాలంలో ఇవి పూర్తిస్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నాయి.

అవగాహన పెంచుతూ.. 

ఇప్పటి వరకూ ఆర్‌బీఐ నుంచి మాత్రమే సైబర్‌ నేరాలపై అవగాహన కార్యక్రమాలు ఎక్కువగా కనిపించేవి. ఇప్పుడు బ్యాంకులూ ఈ దిశగా దృష్టి పెట్టాయి.
* యాక్సిస్‌ బ్యాంక్‌ తమ వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌లలో సైబర్‌ నేరాల గురించి ప్రముఖంగా కనిపించేలా ప్రచారం చేస్తోంది. ఏటీఎం స్క్రీన్లపైనా వీటి గురించి తెలియజేస్తోంది. అనుక్షణం డెబిట్‌, క్రెడిట్‌, యూపీఐ, ఇతర లావాదేవీలను గమనించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు బ్యాంకు చెబుతోంది.
* ఆర్‌బీఎల్‌ బ్యాంకు ‘రహోసైబర్‌సేఫ్‌’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మోసపోతామనే భయంతో చాలామంది డిజిటల్‌ బ్యాంకింగ్‌కు దూరంగా ఉంటున్నారని, ఇలాంటివారు తగిన జాగ్రత్తలతో లావాదేవీలు నిర్వహించేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా బ్యాంకు దీన్ని చేపట్టింది.
* ‘విజిల్‌ ఆంటీ’ పేరుతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఒక ప్రముఖ నటితో సామాజిక వేదికల్లో చర్చా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తోంది. ఖాతాదారులను సైబర్‌ మోసాల నుంచి రక్షించడానికి అవసరమైన జాగ్రత్తలను చెబుతోంది. ఎప్పటికప్పుడు సైబర్‌ మోసాల్లో వస్తున్న కొత్త విధానాలను తెలియజేస్తూ అప్రమత్తం చేస్తోంది.
వీటితోపాటు పలు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులూ తమ వెబ్‌సైట్లలో సైబర్‌ నేరాలపై అవగాహన పెంచుతూ సమాచారాన్ని అందిస్తున్నాయి.

సైబర్‌ బీమాతో.. 

మోసగాళ్ల చేతిలో పడి కష్టార్జితాన్ని కోల్పోయినప్పుడు సైబర్‌ బీమా పాలసీలు పరిహారాన్ని చెల్లిస్తాయి. ఇప్పటికే హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో, ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌, బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ సహా పలు సాధారణ బీమా సంస్థలు వ్యక్తిగత సైబర్‌ పాలసీలను అందిస్తున్నాయి. బ్యాంకులు తమ ఖాతాదారులు ఈ పాలసీలను తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు ప్రత్యేకంగా బీమా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి.
* బ్యాంకు ఖాతాలు, పేమెంట్‌ వ్యాలెట్లు తదితరాలను ఉపయోగించే ఖాతాదారులు తమ ప్రమేయం లేకుండా గుర్తింపు చౌర్యం ఇతర మార్గాల ద్వారా సైబర్‌ మోసానికి గురైతే బీమా సంస్థ పరిహారాన్ని చెల్లిస్తుంది. కంప్యూటర్లు, మొబైల్‌లలోకి చొరబడిన వైరస్‌ల మూలంగా నష్టం వాటిల్లినా ఇవి అండగా ఉంటాయి.
* ఈ పాలసీలకు ప్రీమియం తక్కువే ఉంటుంది. రూ.లక్ష వ్యక్తిగత సైబర్‌ ఇన్సూరెన్స్‌ పాలసీకి రూ.700 నుంచి రూ.2వేల వరకూ ప్రీమియాన్ని వసూలు చేస్తున్నాయి బీమా సంస్థలు. మోసం జరిగిందని గుర్తించిన 14 రోజుల్లోగా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా క్లెయిం చేసుకోవచ్చు.

రెండంచెల భద్రతతో.. 

ఇప్పుడు చాలా బ్యాంకులు రెండంచెల భద్రతను పాటిస్తున్నాయి. కేవలం ఓటీపీతోనే లావాదేవీ పూర్తయ్యేలా కాకుండా.. కొన్ని అదనపు వివరాలను అడుగుతున్నాయి. అనుమానం వచ్చిన లావాదేవీలపై వెంటనే ఖాతాదారుడిని ఫోన్‌లో లేదా ఇ-మెయిల్‌లో సంప్రదిస్తున్నాయి. ఖాతాదారుడు అధీకృతం చేస్తేనే ఆ లావాదేవీ పూర్తయ్యేలా ఏర్పాటు చేస్తున్నాయి. డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను ఎంత మేరకు వాడాలి.. ఆన్‌లైన్‌లో వినియోగించుకోవచ్చా? ‘ట్యాప్‌ అండ్‌ పే’ సౌకర్యానికి అనుమతిలాంటివి యాప్‌లో ముందుగానే ఇవ్వాలి.

ఇవి పాటించండి... 

* అన్నింటికీ ఒకే పాస్‌వర్డ్‌ అనేది ఎప్పుడూ సరికాదు. ఆన్‌లైన్‌ బ్యాంకు ఖాతా, మొబైల్‌ యాప్‌లకు కచ్చితంగా ప్రత్యేక పాస్‌వర్డ్‌ ఉండాల్సిందే.
* అనధీకృత యాప్‌లను ఎప్పుడూ డౌన్‌లోడ్‌ చేసుకోవద్దు. ఉచితాల మాయలో పడొద్దు.
* అధిక రాబడి వస్తుందనే  ప్రకటనలు నమ్మొద్దు. వాటిని పరిశీలించాకే మదుపు చేయాలి.
* మీకు నగదు రావడానికి ఎలాంటి క్యూఆర్‌ కోడ్‌లూ  స్కాన్‌ చేయాల్సిన అవసరం ఉండదు. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే డబ్బులు పంపిస్తామని చెబితే అది కచ్చితంగా మోసమే.
* బ్యాంకు నుంచి ఫోన్‌ చేస్తున్నామని అంటే సందేహించాల్సిందే. బ్యాంకు మిమ్మల్ని ఎప్పుడూ నేరుగా సంప్రదించదు. ఒకవేళ మీ ‘రిలేషన్‌షిప్‌ మేనేజర్‌’ ఫోన్‌ చేస్తే.. ఆ వ్యక్తి వివరాలు, ఫోన్‌ నెంబరు మీ ఆన్‌లైన్‌ ఖాతాలో కనిపిస్తాయి.
* పలు చోట్ల అందుబాటులో ఉండే ఉచిత వై-ఫై ఉపయోగిస్తూ ఎట్టిపరిస్థితుల్లోనూ బ్యాంకింగ్‌ లావాదేవీలు చేయొద్దు. చెల్లింపుల కోసం మీ మొబైల్‌ డేటాను ఉపయోగించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని