Laptop prices: దిగుమతులపై ఆంక్షలు.. ల్యాప్‌టాప్‌ల ధరలకు రెక్కలు..?

Laptop prices may increase: ల్యాప్‌టాప్‌లు, పీసీల దిగుమతులపై ఆంక్షలు విధించడం వల్ల దేశీయంగా వాటి ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Published : 04 Aug 2023 02:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విదేశాల నుంచి ల్యాప్‌టాప్‌లు (laptop), ట్యాబ్లెట్లు (Tablet), పర్సనల్‌ కంప్యూటర్ల (PC) దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని వాణిజ్య పరిశ్రమల శాఖ తెలిపింది. దేశీయంగా తయారీని ప్రోత్సహించే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ నిబంధన కారణంగా దేశీయంగా ఆయా ఉత్పత్తుల ధరలు పెరిగే (Laptop price hike) అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

ఒకప్పుడు స్మార్ట్‌ఫోన్లను పెద్దఎత్తున భారత్‌ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (PLI) కారణంగా ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ల తయారీ దేశీయంగానే జరుగుతోంది. అనేక కంపెనీలు ఇప్పుడు దేశీయంగానే తయారీని చేపడుతున్నాయి. దీంతో మొబైల్‌ ఫోన్ల తయారీ/అసెంబ్లింగ్‌లో ప్రపంచంలో రెండో అతిపెద్ద ఉత్పత్తిదారుగా మన దేశం అవతరించింది. సరిగ్గా ఇప్పుడు ల్యాప్‌టాప్‌లు, పర్సనల్‌ కంప్యూటర్ల తయారీ విషయంలోనూ అదే వ్యూహాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది.

వేర్వేరు ఈపీఎఫ్‌ ఖాతాలు ఉన్నాయా? విలీనం చేయకపోతే ఏమవుతుంది?

ప్రస్తుతం దేశంలో యాపిల్, లెనోవో, హెచ్‌పీ, ఆసుస్‌, ఏసర్‌, శాంసంగ్‌ వంటి కంపెనీలు ల్యాప్‌టాప్‌లు, పర్సనల్‌ కంప్యూటర్లను విక్రయిస్తున్నాయి. అయితే చాలా వరకు కంపెనీలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయాలు చేపడుతున్నాయి. ముఖ్యంగా చైనాలో తయారీ/ అసెంబ్లింగ్‌ చేసిన ఉత్పత్తులను దిగుమతి చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంక్షల ఫలితంగా ఇకపై ఇలా విదేశాల నుంచి దిగుమతి చేయడం కుదరదు. ఒకవేళ ఏదైనా కంపెనీ ప్రత్యేక అనుమతి తీసుకుంటే తప్ప! అలాగే విదేశాల్లో ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు కొనుగోలు చేసి కస్టమ్స్‌ వద్ద సరైన ధ్రువపత్రాలు చూపిస్తే వాటిని అనుమతిస్తారు.

ధరలు ఎలా పెరుగుతాయ్‌

మార్కెట్‌లో ఏదైనా వస్తువు ధరను ఎప్పుడూ సప్లయ్‌, డిమాండ్‌ సూత్రం నిర్ణయిస్తుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశీయంగా డిమాండ్‌కు కారణమవుతుంది. ల్యాప్‌టాప్‌లు, పీసీలు తగినంతగా అందుబాటులో లేకపోవడం వల్ల కొరత ఏర్పడి తద్వారా డిమాండ్‌ పెరుగుతుంది. దీంతో యాపిల్‌, హెచ్‌పీ, లెనోవో వంటి కంపెనీలు ధరలు పెంచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ ఆయా కంపెనీలు ధరల పెంపు నిర్ణయం తీసుకోకపోయినా.. సాధారణంగా రిటైలర్లు ఇచ్చే ఆఫర్లు, డిస్కౌంట్లు లభించకపోవచ్చని తెలుస్తోంది. అయితే, ఒకసారి ఆయా కంపెనీలు దేశీయంగా తయారీని చేపడితే వాటి ధరలు దిగివచ్చే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

హెచ్‌డీఎఫ్‌సీ... గెలుపంటే ఇదీ!

ఎందుకీ నిర్ణయం?

దేశీయంగా స్మార్ట్‌ఫోన్ల తయారీ భారీగా పుంజుకుంది. టీవీలూ దేశీయంగానే తయారవుతున్నాయి. కానీ ల్యాప్‌టాప్‌, పీసీలు వంటి తయారీ మాత్రం మూడో వంతు మాత్రమే దేశీయంగా తయారవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ హార్డ్‌వేర్‌ను తయారీని ప్రోత్సహించే ఉద్దేశంతో పీఎల్‌ఐ 2.0 పథకానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌ పీసీలు, ఆల్‌ ఇన్‌ వన్‌ పీసీలు, సర్వర్లు, అల్ట్రా-స్మాల్‌ ఫామ్‌ ఫ్యాక్టర్‌ పరికరాలకు ఈ పథకం వర్తిస్తుంది. తద్వారా దేశీయ తయారీని పెంచడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని