బంగారు బియ్యాన్ని పారేస్తున్నాడు!
ఈ మధ్య షాంఘైలో తిరిగే జనం రోడ్డు మీద బంగారు బియ్యం గింజలు ఏమైనా దొరుకుతాయేమో అని వెతుకుతున్నారట. ఇదెక్కడి విడ్డూరం అనిపిస్తోంది కదూ... అసలు విషయం ఏంటంటే... ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే ఆహారంలో మూడింట ఒకవంతు వృథాగానే పోతోంది. ఆ విషయం గురించి ప్రజల్లో అవగాహన కలిగించాలనుకున్నాడు షాంఘైకి చెందిన కళాకారుడు ‘యాంగ్ ఎక్జిన్’. ఆ ప్రాజెక్టులో భాగంగా అరకిలో బంగారంతో వెయ్యి బియ్యం గింజలను తయారు చేయించాడు. తర్వాత ఆ బంగారు బియ్యాన్ని రోడ్ల మీదా గడ్డి, డ్రెయినేజీల్లోనూ నదిలోనూ విసిరేశాడు. ఈ మొత్తం తతంగాన్ని వీడియోతీసి సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేశాడు. అది కాస్తా వైరల్ అవ్వడంతో ‘ బంగారాన్ని ఇలా వృథా చేసే బదులు ఆ డబ్బుని ఏ వరద బాధిత రైతులకో ఇవ్వొచ్చుగా’ అంటూ అతడి మీద ఎంతోమంది విమర్శలు గుప్పించారు. యాంగ్ మాత్రం ‘మనం వృథా చేసే ఆహారం విలువ ఆ బంగారం కన్నా ఎన్నోరెట్లు ఎక్కువ... ముందు అది గమనించండి. మామూలుగా చెప్తే ఎవరూ పట్టించుకోరు కాబట్టే ఇలా చెశా’ అంటూ వాదిస్తున్నాడు.
బొమ్మల్లో పల్లెటూరు...
ఒకప్పుడు పల్లెటూరు అనగానే సంప్రదాయ గృహాలు, మోట బావులు, ఎడ్ల బండ్లు... ఇలాంటివే కనిపించేవి. కానీ ఇప్పటి గ్రామాలు చాలా మారిపోయాయి. అందుకే, ఈ కాలం వారికి ఆనాటి పల్లె వాతావరణాన్ని కళ్లకు కట్టాలనుకున్నారు హైదరాబాద్లోని బాగ్లింగంపల్లి వాసి విశ్రాంత ఉద్యోగి గోరుకంటి జగన్నాథరావు. ఆ ఆలోచనకు ప్రతిరూపమే ఇక్కడ కనిపించే కళాకృతులు. పాతరోజుల్లో ఉండే ఇళ్లు, గుడిసెలు, పశువుల కొట్టం, మంచాలు, పడక్కుర్చీలు, ఇంట్లో వాడే పనిముట్లతో పాటు... పశువులు నీళ్లు తాగుతున్నట్లూ, పాలు పితుకుతున్నట్లూ... ఇలా రకరకాల బుల్లి బుల్లి బొమ్మల్ని చెక్కతో చూడచక్కగా రూపొందించా రాయన. అంతేకాదు, ‘ప్రాచీన తెలంగాణ సంస్కృతి’ పేరుతో వీటి గురించి ఓ డాక్యుమెంటరీ కూడా తీసి సోషల్మీడియాలో ప్రచారం చేస్తున్నారు. 87ఏళ్ల వయసులో ఇవన్నీ చేయడం అంటే మెచ్చుకోవాల్సిందే కదూ...
- మల్లిక్ బస్వోజు, ఈటీవీ
గాల్లో ఫీట్లు వాళ్ల జీన్సులోనే ఉంది!
సర్కస్ చేసే వాళ్లు రెండు ఎత్తైన స్తంభాలకు సన్నటి తాడుని కట్టి, దానిమీద నడుస్తూ అబ్బురపరుస్తుంటారు. గాల్లో ఏ ఆధారం లేకుండా అలా నడవడం అంటే అది అందరికీ సాధ్యం కాని పని. కానీ రష్యాలోని ట్సొవ్క్రా-1 గ్రామంలో మాత్రం పిల్లా పెద్దా, ఆడా మగా అందరూ ఈ ఫీట్ని సునాయాసంగా చెయ్యగలరట. ఈ కళ ఆ ఊళ్లో వందేళ్ల కిందటి నుంచే ఉంది. ఈ ఊరి చుట్టూ కొండలూ నదీ ప్రవాహాలూ ఉండడం వల్ల అప్పట్లో అబ్బాయిలు పక్క ఊళ్లలో ఉండే తమ ప్రియురాళ్లను కలుసుకునేందుకు ఇలా తాళ్ల మీద నడవడం నేర్చుకున్నారని కొందరంటారు. మరికొందరేమో వరదల సమయంలో కొండలూ నదుల్ని దాటుకుని వెళ్లడానికే ఈ ఉపాయం కనిపెట్టారనీ తర్వాతి తరాలకూ అది అలవాటుగా వచ్చేసిందనీ అంటారు. ఏదేమైనా ఈ కళ ఎన్నో ఏళ్ల నుంచీ అక్కడి ప్రజలకు సర్కస్ల రూపంలో ఉపాధినీ కల్పిస్తోంది. ఈ గ్రామంలో రోప్ వాక్ని నేర్పించే పాఠశాల కూడా ఉంది.
ఏనుగులకీ ఓ గ్రామం!
ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఓ గ్రామం ఉండడం గురించి ఎప్పుడైనా విన్నారా... అదే రాజస్థాన్ లోని జయపురలో ఉన్న ‘హాథీగావ్’. దీన్ని ప్రత్యేకంగా ఏనుగుల కోసమే కట్టించారు. ఈ ఊళ్లో వందకు పైగా ఏనుగులూ వాటి బాగోగులు చూసుకునే మావటి వాళ్ల కుటుంబాలే ఉంటాయి. అలనాటి కోటలూ రాజభవనాలతో కళకళలాడే రాజస్థాన్ మన దేశంలో ప్రాచుర్యం పొందిన పర్యటక ప్రాంతం. అయితే, ఎడారి రాష్ట్రం కావడంతో అక్కడ ఏనుగులు ఉండవు. ఆ లోటుని తీర్చేందుకే స్థానిక ప్రభుత్వం ఈ ఏనుగుల గ్రామాన్ని నిర్మించింది. ఆరావళి పర్వతసానువుల్లో ఉన్న ఈ చోటులో ఏనుగులకు అనువైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు షెడ్లనూ నిర్మించారు. జయపురకి వెళ్లినవాళ్లు కోటల దగ్గరా ఈ ఏనుగుల అంబారీలు ఎక్కొచ్చు... లేదంటే గ్రామంలోకి సఫారీకి వెళ్లి గుంపులుగా ఉండే ఏనుగులతో పాటు, అక్కడి అందాలనూ చూడొచ్చు.
Advertisement
-
-
సినిమా
-
ప్రముఖులు
-
సెంటర్ స్ప్రెడ్
-
ఆధ్యాత్మికం
-
స్ఫూర్తి
-
కథ
-
జనరల్
-
సేవ
-
కొత్తగా
-
పరిశోధన
-
కదంబం
-
ఫ్యాషన్
-
రుచి
-
వెరైటీ
-
అవీ.. ఇవీ
-
టిట్ బిట్స్