పారిశుద్ధ్య కార్మికురాలు... డిప్యూటీ కలెక్టరయ్యింది

ఒంటరిగా, ఇద్దరు పిల్లలతో జీవితాన్ని ప్రారంభించింది. జీవిక కోసం కార్పొరేషన్‌లో చేరి, వీధులు ఊడ్చింది. అయినా ఉన్నతవిద్య ఆశయాన్ని వీడలేదు... ఎన్నో ప్రయాసలకోర్చి దాన్ని సాధించింది. తాజాగా రాజస్థాన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందింది. పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేసిన చోటే డిప్యూటీ కలెక్టరుగా బాధ్యతలు చేపట్టనుంది. ఆమే 40 ఏళ్ల ఆశా కుందారా.

Updated : 19 Jul 2021 13:09 IST

ఒంటరిగా, ఇద్దరు పిల్లలతో జీవితాన్ని ప్రారంభించింది. జీవిక కోసం కార్పొరేషన్‌లో చేరి, వీధులు ఊడ్చింది. అయినా ఉన్నతవిద్య ఆశయాన్ని వీడలేదు... ఎన్నో ప్రయాసలకోర్చి దాన్ని సాధించింది. తాజాగా రాజస్థాన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందింది. పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేసిన చోటే డిప్యూటీ కలెక్టరుగా బాధ్యతలు చేపట్టనుంది. ఆమే 40 ఏళ్ల ఆశా కుందారా.

రాజస్థాన్‌లోని జోథ్‌పుర్‌కు చెందిన పేద కుటుంబంలో పుట్టిన ఆశా కుందారాకు చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవాలని ఆసక్తి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. పైగా సంప్రదాయం మేరకు చిన్నవయసులోనే పెళ్లి. అత్తింట్లో అయినా తన చదువు ఆశయం తీరుతుందనుకుంటే, భర్త వైఖరితో నిరాశే ఎదురైంది. ఇద్దరు పిల్లలు పుట్టాక అత్తింట్లో వేధింపులెక్కువయ్యాయి. దాంతో పిల్లలతో 2013లో బయటికొచ్చింది. తన పరిస్థితి పిల్లలకు రాకూడదంటే బాగా చదివించాలని అనుకుంది. అందుకోసం జోథ్‌పుర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పారిశుద్ధ్య కార్మికురాలిగా చేరింది.

గర్వంగా... పారిశుద్ధ్య కార్మికురాలిగా ఉంటూనే చదువుకోవడం మొదలుపెట్టింది. ‘ఇంటి బాధ్యతలు, విధులు, చదువు వీటన్నింటిని సమన్వయం చేయడానికి చాలా కష్టపడ్డా. ఉదయం నాలుగు గంటలకు నిద్ర లేచి గంటలో పని పూర్తి చేసుకుని, అయిదు గంటలకల్లా విధుల్లోకి వెళ్లేదాన్ని. సాయంత్రం ఇంటికొచ్చాక చదువుకునే దాన్ని. దూరవిద్యలో చదవడంతో నా సందేహాలను డిగ్రీ చదువుతున్న పిల్లలను అడిగి తెలుసుకునే దాన్ని. ఆంగ్లం నేర్చుకోవడానికి చాలా సాధన చేశా. పిల్లలకు చదువు చెబుతూ, వారి దగ్గర నేర్చుకునేదాన్ని. మా కార్యాలయంలో కలెక్టరు, మేయర్‌ వంటి వారిని చూసినప్పుడల్లా వారిలాగే గౌరవాన్ని పొందాలనిపించేది. దాన్ని సాధించాలని సంకల్పం పెట్టుకున్నా. 2018లో ఆర్‌పీఎస్‌సీ పరీక్షలకు హాజరయ్యా. కొవిడ్‌ వల్ల ఫలితాలు ఆలస్యమయ్యాయి. ఇటీవల విడుదలవ్వడం, నేను 728వ ర్యాంకును సాధించడం పట్టలేని సంతోషాన్నిచ్చింది. ఈ విజయం వెనుక అమ్మానాన్న ప్రోత్సాహమెంతో ఉంది. ఈ నెల మొదటి వారంలోనే పారిశుద్ధ్య కార్మికురాలిగా శాశ్వత నియామక ఆర్డరు వచ్చింది. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందడంతో డిప్యూటీ కలెక్టరుగా బాధ్యతలను తీసుకోనున్నా. ప్రజా పాలనాధికారిగా అందరి సంక్షేమానికి పాటుపడతా. ఇక్కడే స్వీపర్‌గా పనిచేసిన నేను ఇదే చోట గౌరవాన్ని అందుకోవడం గర్వంగా ఉంది. ఇద్దరు పిల్లలతో ఎనిమిదేళ్ల క్రితం ఇంటినుంచి బయటికి వచ్చినప్పుడు మనసులో నా పిల్లలను ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని అనుకున్నా. వారిని బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దుతా’ అని అంటోంది ఆశా కుందారా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్