చలికాలంలో.. మధుమేహులకు ఇవి!

విపరీతమైన వేడి లేదా చలి వాతావరణం రక్తంలో చక్కెర స్థాయుల్ని ప్రభావితం చేస్తుంటుంది. శీతాకాలంలో నమోదయ్యే అత్యల్ప ఉష్ణోగ్రతల వల్ల మధుమేహ బాధితుల రక్తంలో చక్కెర స్థాయులు పెరిగే ప్రమాదం ఎక్కువ!

Updated : 30 Dec 2023 15:38 IST

విపరీతమైన వేడి లేదా చలి వాతావరణం రక్తంలో చక్కెర స్థాయుల్ని ప్రభావితం చేస్తుంటుంది. శీతాకాలంలో నమోదయ్యే అత్యల్ప ఉష్ణోగ్రతల వల్ల మధుమేహ బాధితుల రక్తంలో చక్కెర స్థాయులు పెరిగే ప్రమాదం ఎక్కువ! అలాగని ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే గుండె, మూత్రపిండాలు, నరాలు, కళ్లు.. వంటి ముఖ్యమైన అవయవాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సీజన్‌లో రక్తంలో చక్కెర స్థాయుల్ని ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవడంతో పాటు.. వాటిని బ్యాలన్స్‌ చేసుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఈ పోషకాహారం మేలు చేస్తుందంటున్నారు.

ఈ కూరగాయలతో మేలు!

శీతాకాలంలో ఫైబర్‌ అధికంగా ఉండే కూరగాయలు, పండ్లు విరివిగా లభ్యమవుతాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించడమే కాకుండా శరీర బరువును అదుపులో ఉంచుతాయి. క్యారట్‌, ముల్లంగి, బీట్‌రూట్‌, బచ్చలి కూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రకలీ, గ్రీన్‌బీన్స్‌, బఠానీలు, మొక్కజొన్న.. వంటి కూరగాయలను ఆహారంలో భాగం చేసుకుంటే మెరుగైన ఫలితాలుంటాయి. ప్రధానంగా క్యారట్‌, ముల్లంగి వంటి దుంపల్లో ఫైబర్‌తో పాటు ‘ఎ’, ‘బి6’, ‘సి’, ‘ఇ’, ‘కె’-విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అదేవిధంగా జింక్‌, క్యాల్షియం, ఫాస్ఫరస్, కాపర్‌, అయోడిన్‌.. వంటి పోషకాలు కూడా శరీరానికి అందుతాయి. ముఖ్యంగా వీటిలోని జింక్‌ ఇన్సులిన్‌ స్థాయిని పెంచి మధుమేహ బాధితులకు ఎంతో మేలు చేస్తుంది.

పోషకాల ‘పండ్లు’!

నిమ్మ జాతికి చెందిన పండ్లలో ఫైబర్‌, విటమిన్‌ ‘సి’ పుష్కలంగా ఉంటాయి. వీటిలోని సూక్ష్మ, స్థూల పోషకాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు శరీరంలోని కణజాలాల క్షీణతను నివారిస్తాయి. ఎంతో రుచికరమైన బెర్రీ పండ్లను మధుమేహుల సూపర్‌ఫుడ్‌గా ‘అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్’ గుర్తించింది. వీటిలో అధిక యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్‌తో పాటు గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉంటుంది. వీటిని స్మూతీస్‌, జ్యూస్‌ల రూపంలో తీసుకోవడం మంచిది.

ప్రొటీన్ కోసం...!

రక్తంలోని చక్కెర స్థాయులు పెరగడం వల్ల కణజాలాలకు తీవ్ర ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. దీనిని నివారించాలంటే ప్రొటీన్ ఎంతో అవసరం. ఇందుకోసం మాంసం, చేపలతో పాటు ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే కోడిగుడ్లను ఆహారంలో చేర్చుకోవాలి.

వీటి విషయంలో జాగ్రత్త!

బియ్యం, బంగాళాదుంపల్లో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి మధుమేహులు సాధ్యమైనంత వరకు వీటికి దూరంగా ఉండడం మంచిది. ఒకవేళ తీసుకోవాలనుకుంటే డాక్టర్‌ సలహా మేరకు మితంగా తినాలి.

ఆహారంలో తప్పనిసరిగా రైస్‌ తీసుకోవాలంటే ప్రాసెస్ చేయని బ్రౌన్‌ రైస్‌ మంచి ప్రత్యామ్నాయం. దీన్నుంచి ఫైబర్‌ లాంటి పోషకాలు పుష్కలంగా అందుతాయి. ఇవి రక్తంలోని చక్కెర స్థాయులను నియంత్రిస్తాయి.

బెల్లంలోనూ చక్కెర స్థాయులను పెంచే గుణాలుంటాయి. గ్లైసెమిక్‌ ఇండెక్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మధుమేహ బాధితులు బెల్లంతో తయారుచేసిన పదార్థాలకు దూరంగా ఉండాలి.

సాధారణంగా చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి వేడి వేడి టీ, కాఫీలు ఎక్కువగా తీసుకుంటారు. వీటి కారణంగా రక్తంలో చక్కెర స్థాయులు పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి పానీయాలకు దూరంగా ఉండాలి. ఒకవేళ తాగాలనుకుంటే చక్కెర లేకుండా తయారుచేసిన హెర్బల్‌ టీలు ఎంచుకోవాలి.

గొంతునొప్పి, సాధారణ జలుబు, ఇతర అనారోగ్యాల నుంచి రక్షణ పొందేందుకు తేనెను ఔషధంగా ఉపయోగిస్తారు. అయితే మధుమేహ రోగులు మాత్రం తేనెకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఇది న్యాచురల్ స్వీట్‌నరే అయినా ఇందులో కూడా చక్కెర అధికంగా ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్