ఆ ఒక్క నిర్ణయం వ్యాపారవేత్తను చేసింది
కొన్ని నిర్ణయాలు జీవితాన్ని మార్చేస్తాయి. మాధవీ శంకర్ తీసుకున్న నిర్ణయమైతే వేల మంది విద్యార్థుల క్యాంపస్ జీవితాన్ని సులభం చేసింది. అదే ‘‘స్పేస్ బేసిక్స్’’ స్టార్టప్కీ కారణమైంది.
కొన్ని నిర్ణయాలు జీవితాన్ని మార్చేస్తాయి. మాధవీ శంకర్ తీసుకున్న నిర్ణయమైతే వేల మంది విద్యార్థుల క్యాంపస్ జీవితాన్ని సులభం చేసింది. అదే ‘‘స్పేస్ బేసిక్స్’’ స్టార్టప్కీ కారణమైంది. ఆ సంస్థ అందిస్తున్న సేవలేంటి? అసలీ ఆలోచన ఎలా వచ్చిందో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం...
అర్హతా, అవసరం లేని ఎన్నో రంగాల్లో సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఒక టెక్ విద్యార్థిగా నేను టెక్నాలజీని ఉపయోగించి విద్యారంగలో మార్పులు ఎందుకు తీసుకురాకూడదు అనిపించింది. ఆ నిర్ణయమే నన్ను ఇప్పుడు వ్యవస్థాపకురాల్ని చేసింది. మహిళా సాధికారత మీద విదేశీ వేదికపై ప్రసంగాలు ఇవ్వడానికి కారణమైంది. మాది బెంగళూరు. అమ్మానాన్నలిద్దరూ వైద్యులు. వాళ్లు నేను డాక్టర్ కావాలనుకున్నారు. ర్యాంక్ రాలేదు. విశ్వేశరయ్య విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్లో చేరా. మాస్టర్స్ చేయడానికి సిడ్నీ వెళ్లాను. ఇక్కడున్న క్యాంపస్ జీవనానికి అక్కడ దానికీ చాలా తేడా గమనించా. ఇక్కడ ఒక చోట నుంచి ఇంకో చోటికి వెళ్లాలంటే ఏవరో ఒకరి సాయం తీసుకోవాల్సిందే. మనం సాయం అడిగిన వారు మంచివాళ్లైతే పర్లేదు అదే సీనియర్లు అయితే ర్యాగింగ్ చేస్తారు. ఆ భయంతోనే చాలా మంది ఆడపిల్లలు ఉన్నత చదువులకు దూరమయ్యేవారు. ఇదంతా 2012కి ముందు పరిస్థితి. కానీ విదేశాల్లో అలా కాదు. విద్యార్థి చదువుకునే ప్రాంతం, క్లాస్రూమ్, హాస్టల్, డైన్ ఏరియా, గ్రంథాలయం మొత్తం ఒక గైడ్ ఇచ్చేసేవారు. దాంతో ఎవరి సాయం తీసుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు. ఈ సదుపాయాలకే సాంకేతికతను జోడించి మనదేశంలోనూ తీసుకురావాలనుకున్నా.
ఆమె పరిచయంతో
మాస్టర్స్ పూర్తయింది. అక్కడే ఒక టెక్ స్టార్టప్లో చేరాను. మార్కెటింగ్ నుంచి డెవలప్మెంట్ వరకూ ప్రతిదీ చూసుకునేదాన్ని. దానిలో భాగంగానే 2016లో సిలికాన్వ్యాలీకి వెళ్లినప్పుడు పారిశ్రామికవేత్త ఇందూ నావర్తో మాట్లాడే అవకాశం లభించింది. ‘స్పేస్ బేసిక్స్’ స్థాపనకు పునాది పడింది అక్కడే. నా ఆలోచనను ఆమెతో పంచుకున్నా. ‘రాబోయేదంతా టెక్ యుగం విద్యారంగంలోనూ దీని ప్రవేశం అనివార్యం. నీతోనే మొదలవుతుందంటే అంతకన్నా సంతోషం ఏముంటుంది. ఆడపిల్లలు దీనిలో రాణించలేరు. అంకుర స్థాపన వీళ్ల వల్ల కాదు అనే వారికి నీ సంస్థ మంచి సమాధానం చెబుతుంది’ అన్నారు. ఆర్థికంగా ఫండ్స్ను ఇవ్వడానికీ ముందుకొచ్చారు.
మొదటి అంకుర సంస్థ
బెంగళూరు వచ్చేశాను. దాదాపు 50 పాఠశాలలు, కళాశాలలు సందర్శించా. వాళ్లతో నా ఆలోచనను పంచుకున్నా. స్మార్ట్ఫోన్ల వినియోగం పెరుగుతున్న రోజులవి. మంచి ఆలోచన అని మెచ్చుకున్న వారు ఉన్నారు. ఇదొక్కటే తక్కువ అంటూ నొచ్చుకున్నారు కూడా. 2017లో నా ఆలోచనలు కార్యరూపం దాల్చాయి. వెబ్, మొబైల్లోని వివిధ కళాశాలలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించాం. విద్యారంగంలో అంకుర సంస్థను స్థాపించిన మొదటి మహిళగా అవకాశాన్ని దక్కించుకున్నా. సక్సీడ్, టర్బోస్టర్ లాంటి సంస్థలు భాగస్వాములుగా చేరాయి. రెండు నెలల్లోనే 6000 మంది వినియోగదారుల్ని సంపాదించుకున్నాం. అనతి కాలంలోనే రెండు లక్షలకు చేరిందీ సంఖ్య. ఏటా సంస్థకు వస్తోన్న ఆదాయంలో కొంతమేర మహిళా విద్యను ప్రోత్సహించడానికి ఉపయోగిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.