Shruti Taneja: వారసత్వ వంటకాలతో పుస్తకం
తన తల్లి దూరమయ్యాక ఒంటరి అనే భావన కలిగింది. అమ్మ చేతి రుచిని మర్చిపోలేకపోయింది. కానీ ఆ వంటకాల్లో ఒక్కటి కూడా తనకు చేయటం రాదు.
తన తల్లి దూరమయ్యాక ఒంటరి అనే భావన కలిగింది. అమ్మ చేతి రుచిని మర్చిపోలేకపోయింది. కానీ ఆ వంటకాల్లో ఒక్కటి కూడా తనకు చేయటం రాదు. అప్పుడు అనుకుంది. అంతరించిపోతోన్న సంప్రదాయ వంటకాలను నేటి తరం వారికి తెలియజేయాలని.. అది మొదలు దాన్నే వృత్తిగా మలచుకొంది. తాత ముత్తాతల కాలం నాటి వంటకాలను.. కొత్త తరాల వారికి నచ్చినట్టు పుస్తకాలు రూపొందిస్తోంది. ఆవిడే దిల్లీకి చెందిన శ్రుతి తనేజా.. ఆమె కథ తన మాటల్లోనే..
అమ్మ నా చిన్నప్పుడు పచ్చిమామిడి కాయలతో ‘ఆమ్ పన్నా’ చేసేది. దాని రుచి నేను ఇప్పటికీ మర్చిపోలేను. అమ్మ చేతి వంటకాల రుచి నాకింకా గుర్తుంది. కానీ నాకవి ఎలా చేయాలో కూడా తెలియదు. ఎందుకంటే చిన్నతనంలో నేనెప్పుడూ వంటగదిలోకి వెళ్లలేదు. అమ్మ, అమ్మలతో కిచెన్లో గడపలేదు. వంట చెయ్యటం నేర్చుకోలేదు. నాలాగా మరెవరూ బాధపడకూడదనుకున్నా. ప్రతి ఒక్కరి ఇంట్లో కొన్ని వారసత్వంగా వచ్చే వంటకాలు ఉండనే ఉంటాయి. కానీ బామ్మల తరం తర్వాత అవి కనుమరుగైపోతాయి. అలా నాకు తట్టిన ఆలోచనే ఈ ‘నివాలా’. 2021లో ప్రారంభించాను. దీన్ని అమ్మకు అంకిత మిచ్చాను. మన దేశంలో ప్రాచుర్యం పొందిన ప్రముఖ వంటకాలను దీని కోసం ఎంపిక చేస్తాము. నివాలాకి 30 మంది చెఫ్లు పనిచేస్తున్నారు. వారితో ఆ రెసిపీలు వండే విధానం గురించి చర్చించి పుస్తకాల్లో ముద్రిస్తాం. రాజ్మాసుందల్, నివాలా ది జాక్ఫ్రూట్, మష్రూమ్ ప్రాజెక్ట్, ఎ కిచెన్ ఆఫ్ వన్స్ ఓన్లు ప్రత్యేకంగా రూపొందించిన నివాలా రెసిపీ పుస్తకాలు.
రిలిష్తో వారసత్వం
నివాలాలోని ఒక భాగమే రిలిష్. దీంట్లో కుటుంబంలో వారసత్వంగా వచ్చే వంటకాలు ఉంటాయి. కుటుంబ సభ్యులు ఎంపిక చేసిన డిష్లు, వాటి చిత్రాలతో పుస్తకం రూపొందిస్తాము. ఉమ్మడికుటుంబ ఫొటోలు, వంటకాల వెనుక చరిత్ర, కథలన్నీ ఇందులో ప్రచురిస్తాం. దాదాపు 40 రెసిపీలను వాటి ఫొటోలు, తయారీ విధానం, కావల్సిన పదార్థాలతో ముద్రిస్తారు. వీటిని ముందు రెండు ప్రింట్లు తీస్తాం. కుటుంబ సభ్యులకు అంతా బానే ఉందనిపిస్తే మిగిలిన ప్రింట్లు మూడు కాపీలు ఇస్తాం. ఏమైనా మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే వాటిని మారుస్తాం. ఒక ప్రాజెక్టుకు రూ 40 వేలు తీసుకుంటాం. ఇప్పుడు నాచేతిలో 500 కాపీల ఆర్డర్లు ఉన్నాయి. మా రెసిపీ పుస్తకాలను కొనుగోలు చేసిన ఒకమ్మాయి నాకింకా గుర్తుంది. ఆమె మూడు పుస్తకాలు తీసుకుంది. దాంట్లో ఒకటి అత్తగారికి, రెండు అమ్మగారికి, ఇంకోటి వాళ్ల బంధువుల కోసం. తనకి ఈ జర్నల్ రెసిపీ పుస్తకాలు బాగా నచ్చాయి. ఉత్తర్ప్రదేశ్కు చెందిన మాధుర్ కుటుంబసభ్యులు వాళ్లమ్మగారి పుట్టినరోజు సందర్భంగా ఒక పుస్తకం తయారుచేయమని అడిగారు. దాన్ని ప్రత్యేక వంటకాలతో తీర్చిదిద్దాం. భరద్వాన్ తిండా, శల్గం చనా లాంటి వారి కుటుంబ వారసత్వ వంటకాలు ఇందులో పొందుపరిచాం. ఇలా వాళ్ల కుటుంబం కోసం చేయించుకున్న రెసిపీ జర్నల్ను అందుకు న్నప్పుడు వాళ్ల ముఖంలో సంతోషం చూస్తే నాకు చాలా తృప్తిగా ఉంటుంది. ఇంకో కొత్త ప్రాజెక్టును ప్రారంభించబోతున్నాను. అదే ‘కిచెన్ లెగసీ’. దీంట్లో వినియోగదారులు అడిగిన వంటకాల కోసం ఆర్గానిక్ ఉత్పత్తులు ఎంచుకొంటా. చెఫ్లతో వండించి వాటిని సంప్రదాయబద్ధంగా మట్టి కుండల్లో ప్యాక్ చేసి హోమ్ డెలివరీ చేస్తాం. నేటి తరాల వారికి పూర్వీకుల సంప్రదాయాలను పరిచయం చేసేందుకే నేను ఈ ప్రాజెక్టు రూపొందించాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.