ఆ ఉప్పెన అన్నపూర్ణగా మార్చింది!

దివిసీమ ఉప్పెన రోజులు.. ఎవరికైనా విషాద జ్ఞాపకమే! ఆమెకి మాత్రం ఆకలి బాధని ప్రత్యక్షంగా చూపించిన అనుభవ పాఠం. అందుకే 17 ఏళ్లుగా లక్షలమందికి అన్నం పెడుతూ అన్నపూర్ణగా మారారు విజయవాడకి చెందిన తెల్లగడ్డ జ్యోతికుమారి...

Updated : 04 Aug 2023 03:30 IST

దివిసీమ ఉప్పెన రోజులు.. ఎవరికైనా విషాద జ్ఞాపకమే! ఆమెకి మాత్రం ఆకలి బాధని ప్రత్యక్షంగా చూపించిన అనుభవ పాఠం. అందుకే 17 ఏళ్లుగా లక్షలమందికి అన్నం పెడుతూ అన్నపూర్ణగా మారారు విజయవాడకి చెందిన తెల్లగడ్డ జ్యోతికుమారి...

చుట్టూ వరద నీరు. ఆ నీరు తగ్గేవరకూ కొన్ని రోజుల పాటు ఆంజనేయ స్వామి గుడిలో తలదాచుకున్నారు చాలామంది. 1977లో దివిసీమ ఉప్పెన వచ్చిన సమయంలో.. చుట్టుపక్కల అనేక ప్రాంతాలని వరద ముంచెత్తినప్పటి సంఘటన ఇది. అలా తలదాచుకున్న వాళ్లలో జ్యోతికుమారి కుటుంబం కూడా ఉంది. ‘బాపట్ల దగ్గర యానాదుల మా సొంతూరు. తుపాను సమయంలో మా ప్రాంతమంతా నీటిలో మునిగిపోయింది. మేమంతా రోజుల తరబడి గుడిలో తలదాచుకున్నాం. ఆర్థికంగా మాకే ఇబ్బంది లేదుకానీ.. సర్వస్వం కోల్పోయి రోడ్డున పడిన వారి పరిస్థితి చూసి చాలా బాధనిపించింది. చుట్టూ శవాలు. ఎటుచూసినా ఆకలికేకలు.. ఆర్తనాదాలు. వీటిని ప్రత్యక్షంగా చూశా. చిన్నతనంలోని ఆ ఘటన నన్ను చాలా ప్రభావితం చేసింది. పేదల ఆకలి తీర్చడానికి ఏదైనా చేయాలని ఆరోజే అనుకున్నా. పెళ్లయ్యాక ఆ కల నిజమైంది. 2006లో అన్నపూర్ణ ట్రస్టుని ప్రారంభించి పేదల కడుపు నింపడం మొదలుపెట్టా’నంటారు జ్యోతికుమారి. బీకాం చదివిన ఆమె.. పెళ్లయ్యాక విజయవాడ శివార్లలోని ప్రసాదంపాడులో నివాసం ఉంటున్నారు. భర్త శ్రీనివాస్‌ ఆర్టీసీలో కంట్రోలర్‌గా పనిచేసేవారు.

రూపాయి ఆశించకుండా...

ఎన్నో ఆర్థిక ఇబ్బందులు.. అయినా ధైర్యంగా ముందుకెళ్లాననే జ్యోతి 17 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమాన్ని నిరాటంకంగా సాగిస్తున్నారు. ‘మావారి జీతంతోనే కుటుంబాన్ని చక్కబెట్టుకుంటూ, పిల్లల చదువులు చూసుకుంటూ.. పేదలకు స్వయంగా వండిపెట్టేదాన్ని. మొదట్లో ఎంత మందికి వీలైతే అంతమందికే.. మాకున్న దాంట్లోనే చేసేదాన్ని. చాలామంది మేం చేసే సేవ చూసి తక్కువకే బియ్యం, కాయగూరలు ఇచ్చేవారు. ఎవరైనా ఆర్థిక సాయం చేయాలని చూసినా డబ్బు రూపంలో తీసుకొనేవాళ్లం కాదు. అదేదో సరకులే కొనివ్వమని అనేదాన్ని. మధ్యలో ఆర్థిక ఇబ్బందులు వచ్చినా అన్నదానం మాత్రం ఆపలేదు. పదేళ్ల క్రితం మావారికి యాక్సిడెంట్‌ అయ్యింది. దాంతో ఇంటికే పరిమితం అయ్యారు. సరిగ్గా అదే సమయానికి పిల్లలు చేతికందొచ్చారు. వాళ్లు అమెరికాలో స్థిరపడ్డారు. అమ్మాయి, అల్లుడు అమెరికాలో డాక్టర్లు. బాబు ఇంజినీర్‌. వాళ్లు సాయం చేయడం మొదలుపెట్టాక ఇబ్బందులు కాస్త తగ్గాయి. ప్రస్తుతం రోజుకి 500 నుంచి 1200 మంది ఆకలి తీరుస్తున్నాం. రెండు, మూడేళ్లుగా విజయవాడ నగరంలోని కొన్ని హోటళ్లు కూడా సహకారం అందిస్తున్నాయి. రోజువారీ మిగిలే ఆహారాన్ని మా ట్రస్టుకు అందజేస్తున్నాయి. నగరంలో ఏ కార్యక్రమం జరిగినా ఆహారం మిగిలిపోతే.. మాకు అందిస్తున్నారు. దీంతో రోజూ వందల మంది ఆకలి తీరుస్తున్నాం. కొవిడ్‌ సమయంలోనూ ఎన్నడూ ఆపలేదు. పోలీసుల సహకారంతో ప్రజలూ, పారిశుధ్య కార్మికుల ఆకలి తీర్చాం. పుష్కరాలు, దసరా ఉత్సవాలప్పుడు లక్షల మంది దూరప్రాంతాల నుంచి తరలివస్తుంటారు. వారి ఆకలి తీర్చే బాధ్యతనూ మా అన్నపూర్ణ ట్రస్టు తీసుకుంది’ అంటారు జ్యోతి. 

దివ్యాంగుల కోసం ..

విజయవాడ సహా చుట్టుపక్కల ఉండే వసతి గృహాలు, ఆశ్రమాలకు వెళ్లి ఏటా 500మంది దివ్యాంగ పిల్లలకు అవసరమైన ఆహారం, వివిధ పరికరాలు అందిస్తున్నారీమె. నగరంలోని ఫుట్‌పాత్‌లపై నివసించే అనాథ వృద్ధులకు దుస్తులు, దుప్పట్లు అందిస్తున్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు టైలరింగ్‌ సహా పలు రకాల శిక్షణలు అందిస్తున్నారు. విజయవాడ చుట్టుపక్కల  ఉన్న 10 గోశాలలకు అవసరమైన ఆహారం, ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ సేవలకుగానూ అనేక పురస్కారాల్ని అందుకున్నారు. అవార్డుల కన్నా అన్నం పెట్టడంలోనే ఎక్కువ ఆనందం ఉందంటారు జ్యోతి.

- మొల్గరి సురేశ్‌ ఈనాడు పాత్రికేయ పాఠశాల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్