కేవలం 500 రూపాయలతో పెళ్లైపోయింది!

పెళ్లంటే జీవితంలో జరిగే అతి పెద్ద వేడుక. ఉన్నంతలో అట్టహాసంగా, ఆడంబరంగా జరుపుకోవాలని అందరూ కోరుకుంటారు. ఇందులో భాగంగా ఖరీదైన దుస్తులు, విందులు, వినోదాలు, హల్దీలు, రిసెప్షన్ల రూపంలో లక్షలాది రూపాయలను మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేస్తుంటారు. ఇది వరుడి కుటుంబ సభ్యులకు పెద్దగా భారం కాకపోవచ్చేమో కానీ కట్నకానుకలిచ్చే వధువు, ఆమె తల్లిదండ్రులకు మాత్రం తలకు మించిన భారమే. అందుకే కరోనా నిబంధనల నడుమ కేవలం 500 రూపాయలతో పెళ్లి తంతుని పూర్తి చేసి ఆదర్శంగా నిలిచింది ఓ జంట.

Updated : 15 Jul 2021 19:49 IST

పెళ్లంటే జీవితంలో జరిగే అతి పెద్ద వేడుక. ఉన్నంతలో అట్టహాసంగా, ఆడంబరంగా జరుపుకోవాలని అందరూ కోరుకుంటారు. ఇందులో భాగంగా ఖరీదైన దుస్తులు, విందులు, వినోదాలు, హల్దీలు, రిసెప్షన్ల రూపంలో లక్షలాది రూపాయలను మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేస్తుంటారు. ఇది వరుడి కుటుంబ సభ్యులకు పెద్దగా భారం కాకపోవచ్చేమో కానీ కట్నకానుకలిచ్చే వధువు, ఆమె తల్లిదండ్రులకు మాత్రం తలకు మించిన భారమే. అందుకే కరోనా నిబంధనల నడుమ కేవలం 500 రూపాయలతో పెళ్లి తంతుని పూర్తి చేసి ఆదర్శంగా నిలిచింది ఓ జంట.

ఆడంబరాలకు దూరంగా!

మధ్యప్రదేశ్‌లోని ధార్‌ సిటీ మెజిస్ట్రేట్‌ శివాంగి జోషి... ఇండియన్‌ ఆర్మీలో మేజర్‌గా పని చేస్తున్న అనికేత్‌ చతుర్వేదికి రెండేళ్ల క్రితమే వివాహం నిశ్చయమైంది. కానీ కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రారంభం కావడంతో వీరి వివాహం వాయిదాపడుతూ వస్తోంది. కొవిడ్‌ కట్టడి విధుల్లో శివాంగి పూర్తిగా నిమగ్నం కాగా... అనికేత్ లడఖ్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే కరోనా రెండో దశ ఉద్ధృతి కాస్త తగ్గడంతో పెళ్లిపీటలెక్కాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు.

రూ.500 డిపాజిట్‌ చేసి!

జిల్లా మెజిస్ట్రేట్‌ వివాహమంటే ఎంతో సందడిగా ఉంటుంది. కుటుంబ సభ్యులు, ఉన్నతాధికారులు, అతిథులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. ఏర్పాట్లు కూడా ఘనంగానే ఉంటాయి. అయితే ఇలాంటి ఆడంబరాలకు తాను వ్యతిరేకమంటూ సింపుల్‌గా కోర్టులో వివాహం చేసుకుంది శివాంగి. ఇందుకోసం ముందుగానే తన తల్లిదండ్రులతో పాటు వరుడి కుటుంబ సభ్యులను కూడా ఒప్పించింది. ఆ తర్వాత కోర్టులో 500 రూపాయలు డిపాజిట్‌ చేసి సింపుల్‌గా రిజిస్టర్ మ్యారేజ్‌ చేసుకున్నారు శివాంగి, అనికేత్. కనీసం 10 మంది కూడా ఈ పెళ్లిలో కనిపించలేదు. ఇక పూల దండలు మార్చుకున్న అనంతరం వచ్చిన అతికొద్దిమంది అతిథులకు మిఠాయిలు పంచి వారి ఆశీర్వాదం తీసుకున్నారు నూతన వధూవరులు. అక్కడి నుంచి నేరుగా పురాతన ధారేశ్వర్‌ ఆలయానికి చేరుకుని దేవుడి దీవెనలు అందుకున్నారు.

ఆడంబరాలకు నేను దూరం!

‘వివాహం పేరుతో అనవసరంగా డబ్బు ఖర్చు చేయడానికి నేను వ్యతిరేకం. అందుకే ఇలా నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నాను. ఆడంబర వివాహాలతో వధువు, వారి తల్లిదండ్రులపై ఆర్థికంగా అదనపు భారం పడుతోంది. పైగా సంపాదించిన డబ్బును వృథాగా ఖర్చు పెట్టడం నాకే మాత్రం నచ్చదు’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చిందీ నూతన వధువు.

‘డెస్టినేషన్‌ వెడ్డింగ్‌’ అంటూ సముద్రాలు, ఆకాశ హర్మ్యాల్లో భారీ ఖర్చులతో పెళ్ల్లిళ్లు చేసుకుంటున్న నేటి కాలంలో ఈ ఇద్దరు ఉన్నత ఉద్యోగులు నిరాడంబరంగా పెళ్లి చేసుకోవడం నిజంగా అభినందనీయమే. అందుకే వీరి వివాహం ప్రస్తుతం ట్రెండింగ్‌లో నిలిచింది. శివాంగి, అనికేత్‌ల పెళ్లి ఫొటోలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా నెటిజన్లు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వారి వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో కొనసాగాలని కోరుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్