వీళ్లకి లక్ష్యాలు వినిపిస్తాయి విజయాలు మాట్లాడతాయి

లక్ష్మి, పార్వతి... కవలలు. చదువుల్లోనూ జంట విజయాలు సాధిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా యూపీఎస్సీ నిర్వహించిన ఐఈఎస్‌(ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌)లో మంచి ర్యాంకులు సాధించారు. ప్లస్‌టూలోనూ ఇలానే అత్యధిక మార్కులు సాధించి వార్తల్లోకి వచ్చారు.

Published : 07 Apr 2022 01:34 IST

లక్ష్మి, పార్వతి... కవలలు. చదువుల్లోనూ జంట విజయాలు సాధిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా యూపీఎస్సీ నిర్వహించిన ఐఈఎస్‌(ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌)లో మంచి ర్యాంకులు సాధించారు. ప్లస్‌టూలోనూ ఇలానే అత్యధిక మార్కులు సాధించి వార్తల్లోకి వచ్చారు. ‘భలే ఉన్నారే!’ అని ఆనందపడుతున్నారా? కానీ వీళ్ల జీవితాల్లోని విషాదమే వీరిని ఇంతవరకూ నడిపించిందంటే నమ్ముతారా? ఎందుకంటే వీరిద్దరూ బధిరులు.

చూడముచ్చటగా ఉన్న ఈ పిల్లలని చూసి లక్ష్మి, పార్వతి అని పేరుపెట్టుకుని మురిసిపోయింది వీళ్ల అమ్మ సీత. కానీ వీళ్లకి వినికిడి లోపం ఉందని తెలిశాక ఆమె సంతోషమంతా ఆవిరైపోయింది. ఏ సమస్య అయితే తనని శాపంలా వెంటాడుతుందో అదే తన పిల్లలకీ వచ్చింది. వీళ్లకంటే ఏడేళ్లు ముందు పుట్టిన కొడుకు విష్ణుదీ ఇదే సమస్య. భర్త అజీకుమార్‌ ఈ కష్టాలు నేను పడలేనంటూ ఆడపిల్లలకు రెండేళ్ల వయసుండగా ఆత్మహత్య చేసుకుని ఆ కుటుంబానికి దూరమయ్యాడు. అప్పట్నుంచీ ఒంటరిగా పిల్లలని పెంచి పెద్దచేశారు సీత. వాళ్లకి ఏడాదిన్నర వయసుండగా తన సొంతూరు తిరువనంతపురం నుంచి దగ్గర్లోని తిరుమల తీసుకొచ్చి అక్కడి ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌’లో చేర్పించారు. అదే వాళ్లకు వరమయ్యింది. అక్కడే చిన్నతనం నుంచీ పెదాల కదలికని బట్టి ఎదుటివారి మాటల్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. నాలుగేళ్లు అక్కడ శిక్షణ తీసుకున్నాక సాధారణ పిల్లల బడిలో చేరారు. ‘మా ఇంట్లో మా అమ్మకూ, నాకూ ఈ సమస్య ఉంది. కానీ పిల్లలకు రావడమే తట్టుకోలేకపోయా. వాళ్లు ఎవరిపైనా ఆధారపడకూడదనే ఎన్‌ఐఎస్‌హెచ్‌లో చేర్పించా. బంధువుల సాయంతో వాళ్లని చదివిస్తూ, నేనూ చదువుకున్నా. ఆయన పోయిన ఐదేళ్లకి కేరళ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌లో నాకు ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాతే మా కష్టాలు కొంత తీరాయి. ప్రస్తుతం జూనియర్‌ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నా.’ అంటారు సీత. ఎన్‌ఐఎస్‌హెచ్‌లో శిక్షణ కారణంగా వినికిడి పరికరాలేమీ లేకుండానే టీచర్‌ చెప్పే పాఠాలని విని కాకుండా, చూసి నేర్చుకుని పదోతరగతి పూర్తిచేశారు లక్ష్మి, పార్వతి. ప్లస్‌టూలో... 1200గాను 1187, 1185 మార్కులు సాధించారు. అప్పుడే వీళ్ల ప్రతిభ గురించి అందరికీ తెలిసింది. జిల్లా కలెక్టర్‌ ఇంటికొచ్చిమరీ ప్రశంసించారు. ‘మా పిల్లలకు వినబడదంటే చాలామంది నమ్మరు. అదే వాళ్లకు వరం, శాపం కూడా. టీచర్‌ చెప్పేవన్నీ లిప్‌రీడింగ్‌ సాయంతో రాసుకుంటారు. టీచర్‌ కనిపించకపోతే... తోటివాళ్లని నోట్‌ పుస్తకాలు అడిగి రాసుకోవాల్సిందే’ అంటారు సీత. విష్ణు తిరువనంతపురం కాలేజీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో చదివి.. ప్రస్తుతం పీడబ్ల్యూడీలో అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అతని స్ఫూర్తితోనే ఈ అక్కాచెల్లెళ్లు ఇంజినీరింగ్‌ని కెరియర్‌గా ఎంచుకుని అదే కాలేజీలో చదువుపూర్తిచేశారు. పార్వతి ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తోంది. లక్ష్మి ఎంటెక్‌ పూర్తిచేసి, జూనియర్‌ ఇంజినీర్‌ ఉద్యోగాన్ని సాధించింది. ఇద్దరికీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలూ వచ్చాయి. కానీ వాళ్ల లక్ష్యం కోసం ఈ ఉద్యోగాలని కాదనుకున్నారు. ‘మా అమ్మ 23ఏళ్ల కష్టం తీరాలన్నా, మా అన్నయ్య కల నెరవేరాలన్నా మేం మా లక్ష్యాన్ని సాధించాలి. మేం సివిల్‌ సర్వీసెస్‌ కొట్టాలనేది అన్నయ్య కల. ఇందుకు యూపీఎస్సీ  నిర్వహించే ఐఈఎస్‌ పరీక్షలు 2019 నుంచి రాస్తున్నాం... ఉద్యోగం చేస్తూనే, వారాంతాల్లో ఈ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యాం. వాళ్లు చెప్పేది మాకు అర్థం కాదు కాబట్టి ఎక్కడా కోచింగ్‌ తీసుకోలేదు. సొంతంగానే సన్నద్ధం అయ్యాం. ఇంటర్వ్యూలో మేం చెప్పదలచుకున్నది అవతలివారికి అర్థమవుతుందో లేదో అని భయపడ్డాం. ఇంటర్‌ప్రెటేటర్‌ని నియమించాక కాస్త భయం తగ్గింది. సమాధానాలు టైప్‌ చేసి ఇచ్చాం. ఫలితాలు వచ్చేవరకూ భయపడ్డాం. కానీ మా కల ఈ మార్చిలోనే నెరవేరింది. నాకు 74, లక్ష్మికి 75వ ర్యాంకు(సివిల్‌ ఇంజినీరింగ్‌) వచ్చింది’ అంటోంది పార్వతి. ‘వీళ్ల చిన్నప్పుడు... నీలాంటిదానికి ఇద్దరు ఆడపిల్లలు.. అదీ ఇలాంటి పిల్లలు అవసరమా అని చాలామంది గేలి చేసేవారు. కానీ వాళ్లు సాధించిన విజయం కేరళలో మరెవరూ సాధించలేదు. నాకోడలు ఐశ్వర్య కూడా బధిరురాలే. ఆమె గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేస్తోంది. సాధించడానికి వైకల్యం అడ్డం కాదనడానికి నేనూ, నా కుటుంబమే పెద్ద ఉదాహరణ’ అంటున్నారు సీత.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్