‘ అద్దెగర్భాలపై గళమెత్తింది!

చట్టవిరుద్ధంగా సరోగసీ పద్ధతిని వినియోగిస్తున్నారంటూ మనదేశ పార్లమెంటు కమిటీ ఎదుట గళమెత్తారు డాక్టర్‌ షీలా సూర్యనారాయణన్‌ శరవణన్‌. అద్దెగర్భాన్నిస్తున్న తల్లుల ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులపై దేశవ్యాప్తంగా పర్యటించి అధ్యయనాలు జరిపి పలు రచనలు చేశారు. సరోగసీ పద్ధతిని నిషేధించిన స్వీడన్‌ దేశ పార్లమెంటులోనూ ప్రసంగించిన డాక్టర్‌ షీలాను వసుంధర పలకరించింది..

Updated : 01 Aug 2021 05:21 IST

చట్టవిరుద్ధంగా సరోగసీ పద్ధతిని వినియోగిస్తున్నారంటూ మనదేశ పార్లమెంటు కమిటీ ఎదుట గళమెత్తారు డాక్టర్‌ షీలా సూర్యనారాయణన్‌ శరవణన్‌. అద్దెగర్భాన్నిస్తున్న తల్లుల ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులపై దేశవ్యాప్తంగా పర్యటించి అధ్యయనాలు జరిపి పలు రచనలు చేశారు. సరోగసీ పద్ధతిని నిషేధించిన స్వీడన్‌ దేశ పార్లమెంటులోనూ ప్రసంగించిన డాక్టర్‌ షీలాను వసుంధర పలకరించింది..

కేరళ నుంచి ఉద్యోగరీత్యా ముంబయి చేరుకున్న కుటుంబంలో పుట్టారు షీలా. తొమ్మిదేళ్లప్పుడే అమ్మానాన్నలను కోల్పోయారీమె. తోబుట్టువు వద్ద ఉంటూ చదువుకున్నారు. ముంబయి విశ్వవిద్యాలయంలో జాగ్రఫీలో ఎంఏ, పుణెలో డెవలప్‌మెంట్‌ స్టడీస్‌లో మాస్టర్స్‌ చేశారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మహిళారోగ్యంపై అధ్యయనం చేపట్టారు. ఆ తర్వాత ఎమ్మెస్‌ స్వామినాథన్‌ రీసెర్చి ఫౌండేషన్‌లో చేరి అనంతపురం జిల్లా గుత్తి అనే మారుమూల ప్రాంతానికి రీసెర్చి నిమిత్తం వెళ్లారు. అటవీప్రాంతాల వనరులను గిరిజనులు ఎలా వినియోగించుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారనే అంశంపై అధ్యయనం చేసేటప్పుడు అక్కడి మహిళల ఆరోగ్యంపై దృష్టి సారించారు. ఇది ఆమెను రీప్రొడక్టివ్‌ హెల్త్‌పై అధ్యయనం చేసేందుకు ప్రేరణ కలిగించింది. అలా ఆస్ట్రేలియాలోని స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌లో పీహెచ్‌డీలో చేరి, ‘ట్రెడిషనల్‌ బర్తింగ్‌ ప్రాక్టీసెస్‌’లో సరోగసీపై మహారాష్ట్రలో ఏడాదిపాటు అధ్యయనం చేశారు.

‘అహ్మదాబాద్‌లోని ఆనంద్‌లో సరోగసీకి పేద మహిళలే సిద్ధంగా ఉండేవారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, లండన్‌, శ్రీలంక, దుబాయి వంటి దేశాల నుంచి సరోగసీ ద్వారా పిల్లల్ని కనేందుకు 2009లో మన దేశానికి చాలా మంది వచ్చేవారు. రీసెర్చి కోసం అక్కడ 6 నెలలు ఉన్నా. సరోగసీ తల్లులను కలిసి వారి అనుభవాలను తెలుసుకుని, ‘అనానిమస్‌ మదర్‌’ అనే 10 నిమిషాల నిడివి డాక్యుమెంటరీ చేశా. ‘ట్రాన్స్‌ నేషనల్‌ ఫెమినిస్ట్‌ వ్యూ ఆఫ్‌ సరోగసీ బయో మార్కెట్‌ ఇన్‌ ఇండియా’ పుస్తకం రాశా. వీటిలో సరోగసీ తల్లుల ఆర్థిక, ఆరోగ్య, సామాజిక పరిస్థితులన్నీ పొందుపరిచా. ఆర్థిక అవసరాల కోసం సరోగసీకి సిద్ధమయ్యే మహిళలు నాలుగైదు ప్రసవాల తర్వాత తీవ్ర అనారోగ్యాల బారిన పడేవారు. ఆ పదినెలలూ కుటుంబానికి దూరంగా ఉండటం, ఆసుపత్రి పర్యవేక్షలోనే గడపడం.. వారిని కుంగదీసేవి. ఆడపిల్ల ఉంటే అబార్షన్‌ చేసేవారు. ఇవన్నీ సరోగసీ తల్లుల ఆరోగ్యాన్ని దెబ్బతీసేవి. కమర్షియల్‌ సరోగసీకి అప్పట్లో మన దేశంలో అనుమతి ఉండేది. అయితే ప్రస్తుతం మన ప్రభుత్వం తెచ్చిన చట్టంతో పరిస్థితి కొంచెం మెరుగుపడింది. ఇంకా చాలా మార్పులు చేయాలి’ అని అంటారు షీలా. షీలా భర్త శరవణన్‌ జర్మనీలో ప్రొఫెసర్‌. వీరికిద్దరు మగ పిల్లలు. ప్రస్తుతం ఈమె హైదరాబాద్‌ విశ్వవిద్యాలయంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌.

షీలా రాసిన పుస్తకాలపై చర్చించేందుకు గతేడాది జనవరిలో పార్లమెంటు కమిటీ ఆమెను ప్రత్యేకంగా ఆహ్వానించింది. సరోగసీ బిల్లు ఆమోదం కోసం షీలా నుంచి  సూచనలను తీసుకొంది. ఇటలీ, ప్యారిస్‌, వియన్నా పార్లమెంటుల్లో సరోగసీపై ప్రసంగించారీమె. తాజాగా స్వీడన్‌ ప్రభుత్వానికి సరోగసీ చట్టంలో చేయాల్సిన మార్పుల గురించీ సూచనలు అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్