Women Priests: ఆ అభిప్రాయం మార్చేస్తున్నారు!

గుడికెళ్తే అర్చన చేసే పూజారి పురుషుడే..పెళ్లిలో వేదమంత్రాల సాక్షిగా దంపతుల్ని కలిపేదీ పురుష పురోహితుడే..ఆఖరికి పిండం పెట్టాలన్నా పురుష పూజారికే పిలుపు అందుతుంది..కానీ రాన్రానూ ఈ ట్రెండ్‌ మారుతోంది. మహిళలు వేదమంత్రాలు పఠించడానికి అనర్హులు అన్న మూసధోరణిని....

Updated : 02 Mar 2022 21:18 IST

గుడికెళ్తే అర్చన చేసే పూజారి పురుషుడే..

పెళ్లిలో వేదమంత్రాల సాక్షిగా దంపతుల్ని కలిపేదీ పురుష పురోహితుడే..

ఆఖరికి పిండం పెట్టాలన్నా పురుష పూజారికే పిలుపు అందుతుంది..

కానీ రాన్రానూ ఈ ట్రెండ్‌ మారుతోంది. మహిళలు వేదమంత్రాలు పఠించడానికి అనర్హులు అన్న మూసధోరణిని బద్దలుకొడుతూ ఎంతోమంది స్త్రీలు పురోహితులుగా, ఖాజీలు (ముస్లిం పురోహితులు)గా సరికొత్త అవతారం ఎత్తుతున్నారు. ఇదిలా ఉంటే.. మరోవైపు కొత్త జంటలు కూడా తమ పెళ్లి కోసం మహిళా పురోహితుల్ని ఆహ్వానించడానికే మొగ్గుచూపుతున్నాయట! ఇంకోవైపు.. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సైతం దేవాలయాల్లో స్వయంగా మహిళా అర్చకుల్ని నియమిస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో పురుష పురోహితులతో సమానంగా మహిళా పూజారులు కూడా అవకాశాలు సొంతం చేసుకుంటారనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో- పురోహితులుగా రాణిస్తున్న కొంతమంది మహిళల గురించి ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా తెలుసుకుందాం.

‘ఆడవారు వేద మంత్రాలు వల్లె వేయకూడదు’ అని కొంతమంది అంటే.. ‘వేదాలకు ఆడ, మగ అన్న తేడా లేదు.. అలాంటప్పుడు మహిళలు పురోహితులుగా ఎందుకు మారకూడదు?’ అని తిరిగి ప్రశ్నిస్తున్నారు కొంతమంది అతివలు. అంతేకాదు.. పురుషులే పురోహితులుగా ఉండాలంటూ ఈ పితృస్వామ్య వ్యవస్థలో వేళ్లూనుకుపోయిన మూసధోరణుల్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు.


సుహంజన గోపీనాథ్

సీఎం స్టాలిన్‌ ఆదేశాలతో గతేడాది ఆగస్టులో చెన్నై మాడంబాక్కమ్‌లోని ధేనుపురేశ్వరర్‌ గుళ్లో మహిళా అర్చకురాలిగా బాధ్యతలందుకున్నారు సుహంజన గోపీనాథ్‌. దీంతో ఆ రాష్ట్ర రెండో మహిళా పురోహితురాలిగా నిలిచారు. తను ఈ వృత్తిని ఎంచుకుంటానన్నప్పుడు తన పుట్టింటి వారు, భర్త, అత్తింటి వారు తనను ఎంతో ప్రోత్సహించారని చెబుతున్నారామె.

‘నాకు చిన్నప్పట్నుంచే భక్తి పాటలు పాడడమంటే చాలా ఇష్టముండేది. గుళ్లకు వెళ్లినప్పుడల్లా ఆ దేవుడి సన్నిధానంలో పాటలు పాడేదాన్ని. అయితే ఇప్పుడు ఓ అర్చకురాలిగా ఆ భగవంతుడికి సేవ చేసే అరుదైన అవకాశం నాకొచ్చింది. ఇలా దేవుడికి సేవ చేస్తూ పాటలు పాడడం, మంత్రాలు చదవడం ఓ కొత్త అనుభూతి. నా భక్తికి మెచ్చి ఆ దేవుడే నాకు ఈ వరం ప్రసాదించాడేమో అనిపిస్తోంది. నేను ఈ వృత్తి చేపట్టడం వెనుక నా భర్త, పుట్టింటి వారు-అత్తింటి వారి ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. వాళ్లంతా నా నిర్ణయాన్ని గౌరవించారు.. చాలా సంతోషంగా ఉంది..’ అంటున్నారు సుహంజన.

అయితే ఈమె కంటే ముందు పిన్నియక్కాళ్‌ తొలి మహిళా పూజారిగా బాధ్యతలందుకున్నా.. తొమ్మిదేళ్ల క్రితం రాజీనామా చేయడంతో ప్రస్తుతం తమిళనాడులో ఏకైక మహిళా పూజారిగా కొనసాగుతున్నారు సుహంజన.


షీలా అత్తా!

ప్రతి సందర్భంలో మహిళా సాధికారతను చాటే బాలీవుడ్‌ అందాల తార దియా మీర్జా తన పెళ్లితోనూ పితృస్వామ్య వ్యవస్థకు చెక్‌ పెట్టింది. తన పెళ్లి మహిళా పురోహితురాలే చేయాలని పట్టుబట్టి మరీ షీలా అత్తా పౌరోహిత్యం సాక్షిగా ఏడడుగులు నడిచింది. అంతేకాదు.. ఆపై షీలా అత్తాకు కృతజ్ఞతలు తెలుపుతూ.. మనందరం కలిస్తేనే లింగ సమానత్వం సాధ్యపడుతుందంటూ చెప్పుకొచ్చిందీ చిన్నది. దియా స్నేహితురాలి ఆంటీ అయిన షీలా చేతుల మీదుగా ప్రస్తుతం వందలాది జంటలు ఏకమవుతున్నాయి.


భ్రమరాంబ మహేశ్వరి

వేదమంత్రాలు మగవారే పఠించాలని చెబుతుంటారు పెద్దలు. కానీ వేదాలకు ఆడ, మగ అన్న తేడా లేనప్పుడు మహిళలు పురోహితులు కావడంలో తప్పేముంది అంటారు మైసూరుకు చెందిన భ్రమరాంబ మహేశ్వరి. మైసూరుకు చెందిన ఆమె 1995 నుంచి పౌరోహిత్యం చేస్తున్నారు. ‘నేను పౌరోహిత్యం స్వీకరించినప్పట్నుంచి ఇప్పటివరకు సుమారు 2 వేలకు పైగా పెళ్లిళ్లు చేశాను. 1988లో వేదాలు చదవడం మొదలుపెట్టినప్పట్నుంచి ‘నేనెందుకు మహిళా పురోహితురాలిని కాకూడదు?’ అని నాకు నేనే ప్రశ్నించుకునేదాన్ని. వేదాలకు మహిళలు, పురుషులు అన్న భేదం లేదు. అలాంటప్పుడు మనలోనే ఈ తేడాలెందుకు అనిపిస్తుంది. ఈ రోజుల్లో చాలామంది తమ పెళ్లిళ్లు మహిళా పురోహితుల చేతుల మీదుగా జరగాలని కోరుకుంటున్నారు. అది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ మార్పు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా..’ అంటారు భ్రమరాంబ. కేవలం పెళ్లిళ్లే కాదు.. పూజలు, గృహప్రవేశాలు.. ఇలా తన చేతుల మీదుగా జరిగే శుభకార్యాలకు సంబంధించిన విశేషాల్ని, ఫొటోల్ని ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పంచుకుంటూ ఔత్సాహిక మహిళా పురోహితుల్ని ప్రోత్సహిస్తుంటారామె.


నందినీ భౌమిక్

పెళ్లిలో వధువు తల్లిదండ్రులు తమ కూతురిని వరుడి చేతిలో పెట్టి కన్యాదానం చేయడం మనకు తెలిసిందే! అయితే ఈ ప్రక్రియ సరికాదని, అలా చేయడానికి ఆడపిల్లలేమైనా వస్తువులా అంటూ ప్రశ్నిస్తున్నారు పశ్చిమ బంగకు చెందిన మహిళా పురోహితురాలు నందినీ భౌమిక్‌. పశ్చిమ బంగలో తొలి మహిళా పురోహితురాలిగా కీర్తి గడించిన ఆమె.. తాను జరిపించే పెళ్లిళ్లలో అసలు కన్యాదానానికి చోటివ్వరంటే అది అతిశయోక్తి కాదు.

‘నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో మా సంస్కృతం టీచర్‌ స్ఫూర్తితో పౌరోహిత్యం వైపు అడుగులేశాను. ఇప్పటివరకు నా చేతుల మీదుగా ఎన్నో వివాహాలు జరిగాయి. అయితే పెళ్లిలో కన్యాదానం అనే తంతుకు నేను దూరం. ఎందుకంటే ఆడపిల్లల్ని అలా దానమివ్వడానికి వారేమీ వస్తువులు కాదు కదా.. అందుకే అలా చేయడం నాకు నచ్చదు. కేవలం హిందూ వివాహాలే కాదు.. కులాంతర, మతాంతర వివాహాలు సైతం చేస్తుంటాను. అంతేకాదు.. నేను చేసే వివాహాలు చాలా సింపుల్‌గా ముగించే విధంగా ప్లాన్‌ చేసుకుంటా..’ అంటూ తన పౌరోహిత్యం గురించి పంచుకుంటారామె. పెళ్లిలో ప్రతి మంత్రాన్నీ వధూవరులతో ఉచ్ఛరింపజేస్తూ, వాటి అర్థాల్ని వివరిస్తూ వివాహం జరిపించడం ఆమె ప్రత్యేకత.


మైల పడ్డా మహిళలు గుడికి రావచ్చు!

సాధారణంగా నెలసరి సమయంలో మహిళలు గుడికి వెళ్లడానికి ఇష్టపడరు. అయితే ఇది సహజసిద్ధంగా జరిగే ప్రక్రియ అని, మైల పడ్డా మహిళలు గుళ్లోకి రావచ్చని చెబుతున్నారు మరో మహిళా పూజారి కలైరసి నటరాజన్‌. చెన్నైలో మహిళల కోసమే ప్రత్యేకంగా ఓ గుడిని ఏర్పాటుచేసి నిర్వహిస్తున్నారామె. నిజానికి ఇప్పటిదాకా ఈ గుడి గురించి తెలిసింది చాలా తక్కువమందికే!

‘13 ఏళ్లకు పుష్పవతి అయిన తర్వాత ఇంట్లో నుంచి బయటికి వెళ్లడమే మానేశాను. ఎందుకంటే రజస్వల అయిన అమ్మాయిలు గడప దాటకూడదన్న నియమం మా ఊళ్లో ఉండేది. ఇంట్లోనే తోబుట్టువులతో ఆడుకుంటూ, పుస్తకాలు చదువుతూ గడిపేదాన్ని. 16 ఏళ్లు నిండక ముందే పెళ్లైంది. దాంతో ఆ తర్వాత ఆటలకు కూడా ఫుల్‌స్టాప్ పెట్టి ఇంటి పనులు, పుస్తకాలు చదవడంతోనే రోజులు గడిచిపోయేవి. కొన్నాళ్లకు మా వారి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకీ వచ్చా. శైవ సిద్ధాంతాన్ని ఔపోసన పట్టా. మహిళలు అర్చక వృత్తి చేపట్టడానికి అనర్హులు అంటుంటారు.. కానీ ఆ విషయం గురించి శైవ సిద్ధాంతంలో ఎక్కడా చెప్పలేదు’ అంటారీ మహిళా పూజారి.


తెలుగు రాష్ట్రాల్లోనూ!

* ఇతర రాష్ట్రాల్లోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనూ కొంతమంది మహిళా పూజారులు ఆలయాల్లో అర్చకత్వం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన పుచ్చకాయల విజయలక్ష్మి తోమవారపాడు గ్రామంలోని గుంటిగంగమ్మ ఆలయంలో మహిళా పూజారిగా కొనసాగుతున్నారు. పుచ్చకాయల కుటుంబంలోని మహిళలు వంశపారంపర్యంగా ఈ వృత్తిని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే విజయలక్ష్మి అత్తయ్య దగ్గర్నుంచి పూజారిగా బాధ్యతలు స్వీకరించారామె.

* హైదరాబాద్‌లోని సైదాబాద్‌ నాగులమ్మ దేవాలయంలో అర్చకురాలిగా కొనసాగుతున్నారు గోవర్ధన శ్రీదేవి. చిన్నతనం నుంచి తండ్రి, తాతలను చూసి స్ఫూర్తి పొందిన ఆమె వేద విద్య అభ్యసించింది. యజ్ఞయాగాలు, సత్యనారాయణ వ్రతం.. వంటి పూజలన్నీ నిర్వహించడంలో ఆమె దిట్ట. పౌరోహిత్యంపై ఉన్న మక్కువతో పెళ్లి కూడా చేసుకోలేదామె.


వారే మొదటి మహిళా ఖాజీలు!

కేవలం హిందూ వివాహాల్లోనే కాదు.. ముస్లిం వివాహాల్లోనూ మహిళలు ఖాజీలు (ముస్లిం పురోహితులు)గా అవతారమెత్తి జంటల పెళ్లిళ్లు జరిపించడం కూడా ఈ రోజుల్లో మనం చూడచ్చు. అయితే ముస్లిం చట్టం ప్రకారం ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డ్‌కు చెందిన దారుల్‌ ఖాజా కమిటీ ఇందుకు 2010లోనే గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. అంతేకాదు.. హేనా జహీర్‌, మరియా ఫాజల్‌ అనే ఇద్దరు ముస్లిం మహిళల్ని ఖాజీలుగా నియమించింది కూడా! ఉత్తరప్రదేశ్‌కు చెందిన వీరిద్దరూ దేశంలోనే మొదటి మహిళా ఖాజీలుగా ఘనత సాధించారు. వీరిలో హేనా జహీర్‌ లక్నోలోని ఓ కళాశాలలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ ఎన్జీవో నడుపుతున్నారు. కాగా, మరియా ఫాజల్‌ డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నారు. ఇలా వీరిద్దరి చేతుల మీదుగా ఎన్నో ముస్లిం జంటలు ఏకమయ్యాయి. ఇలా పెళ్లిళ్లు చేయడమే కాదు.. దంపతుల మధ్య తగాదాలు, మహిళలపై హింస.. వంటి అంశాల పైనా దృష్టి సారిస్తూ వీరిద్దరూ బాధిత మహిళలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. వీళ్లతో పాటు కేరళకు చెందిన జమీదా బీవీ అక్కడి మలప్పురం జిల్లా వండూర్‌ గ్రామంలో ప్రతి శుక్రవారం నిర్వహించే ముస్లిం మత ప్రార్థనలకు నాయకత్వం వహిస్తున్నారు. తద్వారా ఈ ఘనత వహించిన తొలి ముస్లిం మహిళగా నిలిచారామె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్