బ్రిటిష్‌ రాణిని మెప్పించారు

ద మోస్ట్‌ ఎక్సెలెంట్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ద బ్రిటిష్‌ ఎంపైర్‌ (ఎంబీఈ).. యూకే అందించే మూడో ప్రతిష్ఠాత్మక అవార్డు. ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌, ఛారిటబుల్‌, వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్స్‌, పబ్లిక్‌ సర్వీసెస్‌లలో సేవలందించిన వారికి దీన్ని బహూకరిస్తారు.

Published : 16 Jun 2021 00:56 IST

ద మోస్ట్‌ ఎక్సెలెంట్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ద బ్రిటిష్‌ ఎంపైర్‌ (ఎంబీఈ).. యూకే అందించే మూడో ప్రతిష్ఠాత్మక అవార్డు. ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌, ఛారిటబుల్‌, వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్స్‌, పబ్లిక్‌ సర్వీసెస్‌లలో సేవలందించిన వారికి దీన్ని బహూకరిస్తారు. ఈసారి అందుకున్న వారిలో మన అమ్మాయిలూ ఉన్నారు. వారిలో.. డాక్టర్‌ హిమాంగీ భరద్వాజ్‌, మోహినీ సింగ్‌ భారతీయులు కాగా అమికా జార్జ్‌ భారత సంతతి అమ్మాయి. వారి కృషి ఏంటో చూడండి...

వైద్య వారధి

డాక్టర్‌ హిమాంగీ భరద్వాజ్‌ 2012 నుంచి దిల్లీ బ్రిటిష్‌ హైకమిషన్‌ కార్యాలయంలో సీనియర్‌ హెల్త్‌ అండ్‌ పాలసీ అడ్వయిజర్‌. ఇరుదేశాల మధ్య ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. మనదేశంలో జరిగే పరిశోధనలు, మందుల పంపిణీ సహా ఇక్కడ తయారయ్యే మందులు లండన్‌లో వినియోగించేలా, అలాగే అక్కడి వైద్యవిభాగాల పనితీరును ఇక్కడివారికి తెలియజెప్పడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో గతేడాది ఆరోగ్యశాఖ సిబ్బంది సంక్షేమం, వారిని మాతృదేశానికి తరలించడం, వ్యాక్సినేషన్‌ అందేలా చేశారు.

18వేలమందిని స్వదేశానికి...

చండీగఢ్‌కు చెందిన మోహినీ సింగ్‌ అక్కడి బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషన్‌లో దౌత్య అధికారి. గతేడాది కొవిడ్‌ సమయంలో బ్రిటిష్‌ ప్రజలకు అందించిన సేవలకు ఈమెకు ఈ గౌరవం దక్కింది. లాక్‌డౌన్‌లో మన దేశంలో చిక్కుకున్న 18 వేల మందిని 66 ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి పంపేలా కృషి చేసింది. ఇందుకు చండీగఢ్‌ డిప్యూటీ హైకమిషన్‌ కార్యాలయాల్లో ప్రత్యేక సిబ్బందినీ నియమించింది. ఒక్క అమృతసర్‌ నుంచే 29 ప్రత్యేక విమానాల ద్వారా ఎనిమిదివేల మందిని బ్రిటన్‌కు తరలించిన ఈమెను ఆ దేశం ప్రశంసించింది.

ప్రభుత్వాన్నే కదిలించింది

అమికా జార్జ్‌.. భారతీయ సంతతి అమ్మాయి. తల్లిదండ్రులది కేరళ. ఇంగ్లండ్‌లో స్థిరపడ్డారు. నెలసరి కారణంగా ప్రతి నెలా బడి మానేస్తున్న అమ్మాయిల కోసం 2017లో ‘ఫ్రీ పిరియడ్స్‌’ పేరిట స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. ఒక న్యాయసేవా సంస్థతో కలిసి సమానత్వ హక్కు కింద ప్రభుత్వమే శానిటరీ ఉత్పత్తులను అందించాలని పోరాడింది. దీనికి యూకే వ్యాప్తంగా మద్దతు లభించడంతో 2019లో స్కూలు, కళాశాల విద్యార్థులకు ఈ ఉత్పత్తులను ఉచితంగా అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇది 2020 నుంచి అమల్లోకీ వచ్చింది. చదువుతూనే సంస్థ పనులూ చూసుకునేది. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో హిస్టరీలో డిగ్రీ చదువుతోంది. ఈ ఏడాది ఈ పురస్కారాన్ని అందుకుంటున్న వారిలో పిన్న వయస్కురాలు అమిక.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్