తల్లి ఆశయం.. తనయ సంకల్పం

అమ్మకి గిరిజనులంటే మమకారం. వారికి చదువు, స్వావలంబన అందించాలనుకుంది.ఆ కోరిక నెరవేరకుండానే క్యాన్సర్‌ ఆమెను కబళించింది. ఆమె లక్ష్యం నెరవేర్చాలనే సంకల్పంతో కూతురు ఆ బాధ్యతను అందుకుంది.

Updated : 05 Oct 2021 05:54 IST

అమ్మకి గిరిజనులంటే మమకారం. వారికి చదువు, స్వావలంబన అందించాలనుకుంది.ఆ కోరిక నెరవేరకుండానే క్యాన్సర్‌ ఆమెను కబళించింది. ఆమె లక్ష్యం నెరవేర్చాలనే సంకల్పంతో కూతురు ఆ బాధ్యతను అందుకుంది. అమ్మ పేరిటే సంస్థను స్థాపించి, ఆధునిక వ్యవసాయంలో శిక్షణనిస్తోంది. వారి ఉత్పత్తులను అంతర్జాతీయంగా మార్కెట్‌ చేస్తోంది. ఆమే.. విశాఖ జిల్లాకు చెందిన చంద్రశేఖరన్‌ అలివేణి. ఆ ప్రయాణం.. తన మాటల్లోనే..

మ్మ.. మణిది భద్రాచలంలోని చింతూరు. నాన్న చంద్రశేఖరన్‌ ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి గూడెం కొత్తవీధి మండలంలో గిరిజనులకు సాయం చేసే వారు. అప్పుడే అమ్మ వాళ్లలో అక్షరజ్ఞానం లేకపోవడం, కష్టపడ్డ సొమ్మును సారాకు వెచ్చించడం చూసింది. నాన్న పనిచేస్తున్న ఎన్‌జీఓతో కలిసి 1982లో ‘చైతన్య స్రవంతి’ సంస్థను ప్రారంభించింది. రాత్రి బడులు పెట్టి చుట్టుపక్కల ఊళ్ల వారికి చదువు నేర్పింది. ఆడవాళ్లతో కలసి ఉద్యమాన్ని చేపట్టి 140 గ్రామాల్లో సారా తయారీ, విక్రయాలను ఆపేయించింది. మహిళలకు అడ్డాకులు, అల్లికలు, బొమ్మల తయారీ వంటి శిక్షణలనిచ్చి ఉపాధి కల్పించింది. వర్షాధారం సాగుతో నష్టాలు వస్తున్నాయని ప్రతీ గ్రామంలో చెక్‌డ్యామ్‌లు, విత్తన బ్యాంకులు ఏర్పాటు చేసింది. 1990ల్లో బాక్సైట్‌ తవ్వకాల వల్ల జరిగే పర్యావరణ హానిపై ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల్లో పాదయాత్రనూ చేసింది. 150కిపైగా గ్రామాల్లో మహిళా పొదుపు కమిటీలతోపాటు వారి కోసం భవిష్యనిధినీ ఏర్పాటు చేసింది. అలా పదమూడేళ్లు నిర్విరామంగా సేవలందించిన అమ్మ క్యాన్సర్‌తో 1994లో చనిపోయింది. తన ఫొటో ఇప్పటికీ చాలా మంది గిరిజనుల ఇళ్లలో ఉంటుంది. తర్వాత కొన్నాళ్లు నాన్నే సంస్థను నడిపారు. ఆయనా చనిపోవడంతో సంస్థ మూతపడే పరిస్థితికి వచ్చింది.

అమ్మ పోయేటప్పటికి చిన్నపిల్లనే కానీ తన శ్రమను కళ్లారా చూశా. అమ్మ పోయాక వైజాగ్‌ వెళ్లిపోయా. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీ చేశా. ఉద్యోగమూ చేశా. అది తృప్తినివ్వలేదు. అమ్మ ఆశయాన్ని కొనసాగించేందుకే తన పేరుతో అదే మండలంలో ఆసుపత్రి ఏర్పాటుచేశా. స్నేహితులు, వాలంటీర్లు చేతులు కలిపారు. డా.సుధీర్‌ సహకారంతో వందల గ్రామాల్లో వైద్య శిబిరాలనూ ఏర్పాటు చేశాం. అమ్మ పనిచేసిన ఎన్‌జీఓ చేయూతనిస్తానంది. దీంతో తన పేరిట ‘మణి అమ్మ చైతన్య స్రవంతి’ సంస్థను ఏర్పాటు చేశా. నిధుల కొరతతో సంస్థ ఆగిపోవద్దనే ఉద్దేశంతో ‘గిరి చైతన్య సహకార సొసైటీ’ను ఏర్పరిచాం. దీంట్లో 3000కుపైగా రైతులున్నారు. కాఫీ, పసుపు పంటలపై సేంద్రియ పద్ధతిలో పని చేయడంతోపాటు ప్రాసెసింగ్‌నీ ప్రారంభించాం. నాణ్యత పెంచడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఐసీఏఆర్‌, తదితర సంస్థలతో రైతులకు శిక్షణనీ ఇప్పిస్తున్నాం. ప్రాసెసింగ్‌కీ ప్రాధాన్యమిస్తుండటంతో కల్తీ అవకాశముండదు. రైతులు, కమిటీ సాయంతో ధరను నిర్ణయిస్తున్నాం. 2018 నుంచి ‘ఈస్ట్రన్‌ ఘాట్స్‌ ఇండిజీనస్‌ ఫుడ్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌’ పేరుతో ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో అమ్ముతున్నాం. దీంతో రైతులకూ లాభం చేకూరుతోంది. మా ప్రయత్నాల్ని అభినందించి అప్పటి సీఎం చంద్రబాబు విదేశీ ఎగ్జిబిషన్లలో మా ఉత్పత్తులకు ప్రచారం జరిగే చర్యలు తీసుకున్నారు. గత ఏడాది భారత వ్యవసాయ పరిశోధన మండలి పురస్కారాన్నీ అందుకున్నా. నిజానికి అమ్మ ఉన్నప్పటంత అభివృద్ధి ఇంకా సాధించలేదు. తను భవనాన్నీ ఏర్పాటు చేసింది. దాన్ని ఇంకా అభివృద్ధి చేసి మహిళలు, యువతకు ఉపాధితోపాటు విద్య, ఆరోగ్యాన్ని అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నా. అలా అమ్మ కల నెరవేర్చాలనుకుంటున్నా.

- సూరకత్తి లక్ష్మణ్‌ బాబు, గూడెంకొత్తవీధి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్