కవితతో కంటతడి పెట్టించింది

అయిదేళ్ల చిన్నారి.. వేదికపై భ్రూణహత్యలకు వ్యతిరేకంగా ఓ కవితను వినిపించింది. అది అక్కడి వారందరినీ కంటతడి పెట్టించింది. పూవు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు చిరుప్రాయం నుంచే ఈ అంశంపై అందరిలో అవగాహన తేవడానికి కృషి చేస్తూ బాలపురస్కార్‌ వంటి ఎన్నో అవార్డులు అందుకున్న 23 ఏళ్ల సంజోలీ స్ఫూర్తి కథనమిది.

Updated : 03 Jun 2022 13:15 IST

అయిదేళ్ల చిన్నారి.. వేదికపై భ్రూణహత్యలకు వ్యతిరేకంగా ఓ కవితను వినిపించింది. అది అక్కడి వారందరినీ కంటతడి పెట్టించింది. పూవు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు చిరుప్రాయం నుంచే ఈ అంశంపై అందరిలో అవగాహన తేవడానికి కృషి చేస్తూ బాలపురస్కార్‌ వంటి ఎన్నో అవార్డులు అందుకున్న 23 ఏళ్ల సంజోలీ స్ఫూర్తి కథనమిది.

బాల్యంలోనే తన తల్లిపై జరిగిన గర్భస్రావ యత్నం ఆమెను ఎంత మానసిక క్షోభకు గురిచేసిందో దగ్గర నుంచి చూసింది మహారాష్ట్ర, కర్నాల్‌కు చెందిన సంజోలీ. ఈమెకు అయిదేళ్లప్పుడు రెండోసారి గర్భం దాల్చిన తల్లికి లింగనిర్ధారణ పరీక్షల్లో ఆడపిల్ల అని తెలియడంతో అత్తగారింట్లో గర్భస్రావం చేయించడానికి ప్రయత్నించారు.  సంజోలీ తల్లిదండ్రులు పెద్దవారికి ఎదురునిలవడంతో సంజోలీకి చెల్లి అనన్య పుట్టింది. తన మనసులోని వేదనను తల్లి సంజోలీకి చెప్పుకొనేది. ఆడపిల్ల అయితే మాత్రం ఎందుకలా చేయాలంటూ అమాయకంగా అమ్మను ప్రశ్నించేది. సంజోలీలోని ప్రశ్నించే లక్షణాన్ని గుర్తించిన ఆమె తల్లిదండ్రులు ఆమెతోనే సమాజాన్ని ప్రశ్నించేలా చేయాలనుకున్నారు. 2004లో అయిదేళ్ల వయసులోనే సంజోలీ గర్భస్రావానికి వ్యతిరేకంగా యమునానగర్‌లో జరిగిన ‘లోహ్రి’ కార్యక్రమంలో పాల్గొంది. బేటీ కా నామ్‌ పేరుతో కూతురిని కన్న తల్లిదండ్రులకు నగదు బహుమతిని అందించిన ఆ వేదికపై తన తండ్రి రాసిన ఓ పద్యాన్ని మైకులో ధైర్యంగా వినిపించింది. ‘నన్ను జాగ్రత్తగా నడిపించు.. జీవించడానికి నాకొక అవకాశాన్నివ్వు. ఈ ప్రపంచంలోకి వచ్చేటప్పుడు నన్ను ముక్కలవ్వకుండా వచ్చేలా చూడు’ అంటూ ఆ చిన్నారి చెప్పిన కవిత అక్కడ అందరినీ కంట తడి పెట్టించింది. తన ఏడో ఏటనే హరియాణ ముఖ్యమంత్రి చేతులమీదుగా ‘బాల పురస్కార్‌’ను అందుకుంది.

అవగాహన.. ఓవైపు చదువుకుంటూనే అవగాహనాకార్యక్రమాల్లో పాల్గొనేది. తన పదో ఏట దేశంలోని ఏడు రాష్ట్రాల్లో 4,800 కిలోమీటర్లు పర్యటించి, ‘సేవ్‌ డాటర్స్‌, సేవ్‌ ఎర్త్‌’ పేరుతో అవగాహన కలిగించింది. ‘ఎర్త్‌ ఇన్‌ ఫ్లేమ్స్‌’ పేరుతో తీసిన డాక్యుమెంటరీని పాఠశాలలు, కళాశాలల్లో ప్రదర్శించేది. చెల్లి అనన్యతో కలిసి స్థానిక ఎన్జీవో ‘సారథి’ సహకారంతో భ్రూణహత్య, ఆడపిల్ల-చదువు, మహిళల మానసికారోగ్యం వంటి పలురకాల అంశాలపై అవగాహన అందిస్తోంది.

ప్రధానికి లేఖ... సంజోలి తన 16వ ఏట భ్రూణహత్యలను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలంటూ చెల్లి అనన్యతో కలిసి  ప్రధాని మోదీకి ఉత్తరం రాసింది. ‘గర్భం దాల్చిన వెంటనే ఆ మహిళ గురించి వివరాలన్నింటినీ ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా రిజిస్టరు చేయించాలని ఆ లేఖలో కోరా. లింగనిర్ధారణ పరీక్షలను నిర్మూలించాలని అభ్యర్థించా. దీంతోపాటు మహిళల కోసం ప్రత్యేకంగా పోలీసు స్టేషన్ల ఏర్పాటు, వాటిలో మహిళా పోలీసు అధికారులను నియమిస్తే మహిళలు తమ సమస్యలను నేరుగా వారికి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందని ప్రస్తావించా. 2018లో హరియాణలోని దరార్‌ గ్రామాన్ని దత్తత తీసుకొని ‘సుశిక్షా’ పేరుతో మొబైల్‌ స్కూల్‌ ఏర్పాటు చేశాం. యుక్తవయసువారికి చదువులో శిక్షణనిచ్చి, వారి ద్వారా చిన్నపిల్లలకు విద్యనందించడం మా ఉద్దేశం. ఇందులో ప్రస్తుతం 80 మంది పిల్లలున్నారు. అనన్య సహకారం ఎంతో ఉంది’ అని చెబుతున్న సంజోలీ 2019లో ‘గర్ల్‌టేక్‌ఓవర్‌పార్లమెంట్‌ ఇన్‌ ఆస్ట్రేలియా’ ప్రచారంలో పార్లమెంటులో మహిళలపాత్రపై ప్రసంగించి ప్రముఖుల ప్రశంసలను అందుకుంది. సామాజికపరమైన అంశాలపై అందరిలో అవగాహన కలిగించే విభాగంలో గతేడాది ఈమెను ‘ది డయానా’ అవార్డు వరించడం విశేషం.    

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్