ఈ సమరయోధులు... గూఢచారులు!

శత్రువులు పసిగడితే అదే వాళ్లకు ఆఖరి క్షణం అవుతుందని తెలుసు... అయినా ప్రాణాలకు తెగించారు. దేశం కోసం గూఢచర్యం చేశారు... తోటి భారతీయుల స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం పరితపించారు... చివరి రక్తపుబొట్టునీ ఈ నేల కోసమే ధారపోశారు...

Published : 15 Aug 2021 01:18 IST

శత్రువులు పసిగడితే అదే వాళ్లకు ఆఖరి క్షణం అవుతుందని తెలుసు...
అయినా ప్రాణాలకు తెగించారు. దేశం కోసం గూఢచర్యం చేశారు...
తోటి భారతీయుల స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం పరితపించారు...
చివరి రక్తపుబొట్టునీ ఈ నేల కోసమే ధారపోశారు...


పెళ్లి చేసుకుని మరీ...

తండ్రి కోరిక మేరకు పాకిస్థానీ యువకుణ్ణి పెళ్లి చేసుకుని, ఆ దేశంలో అడుగుపెట్టింది. అక్కడ అందరి నమ్మకాన్నీ సంపాదించి, వాళ్ల రహస్యాలను మన నిఘావర్గాలకు చేరవేసేది. ఆ సమాచారంతో పాక్‌ కుట్రలను భారత్‌ సులభంగా తిప్పికొట్టగలిగింది. తమ వైఫల్యాలకు ఈమే కారణమని అక్కడివాళ్లకి తెలిసి మట్టు పెట్టాలనుకున్నారు. తెలివిగా తప్పించుకుని, దేశానికి తిరిగొచ్చింది సెహమత్‌ ఖాన్‌.

సెహమత్‌ తల్లి పంజాబీ హిందూ. తండ్రి కశ్మీరీ ముస్లిం, స్వాతంత్య్ర సమరయోధుడు. అది 1971వ సంవత్సరం. భారత్‌ పాకిస్థాన్‌ మధ్య యుద్ధం జరుగుతోంది. సెహమత్‌ తండ్రికి క్యాన్సర్‌ అని తేలింది. ఆయన కోరిక మేరకు సెహమత్‌ గూఢచారిగా మారింది. భారత ఇంటలిజెన్స్‌ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణనీ తీసుకుంది. పాకిస్థాన్‌ మిలిటరీ కుటుంబంలోకి కోడలిగా వెళ్లింది. భర్త అక్కడి సైన్యంలో ఉన్నతాధికారే. అక్కడి వాళ్ల నమ్మకాన్ని సంపాదించి వాళ్ల రహస్యాలనీ, భారత్‌పై చేస్తున్న కుట్రల సమాచారాన్నీ చేరవేయగలిగింది. మన నేవీకి చెందిన సబ్‌మెరైన్‌ ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను ధ్వంసం చేయాలన్న కుట్రను ఈమె సమాచారం కారణంగానే నిఘావర్గాలు ఆఖరి నిమిషంలో తిప్పికొట్టగలిగాయి. కానీ.. సెహమత్‌ గూఢచారన్న విషయం దీంతోనే బయటపడింది. దాంతో పాక్‌ వర్గాల కళ్లు గప్పి తప్పించుకుని మన దేశానికొచ్చేసింది. అప్పటికి ఆమె గర్భవతి కూడా. తర్వాత తన కొడుకుని పెంచి, పెద్ద చేసి భారత సైన్యంలోకి పంపింది. తన కథే ‘రాజీ’ పేరిట సినిమాగా వచ్చింది. దీనిలో సెహమత్‌ పాత్రని ఆలియా చేసింది.


మత్తుమందిచ్చి బయటపడింది...!

సుభాష్‌ చంద్రబోస్‌ స్థాపించిన ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీలోని గూఢచారి విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహించారు సరస్వతి రాజమణి. మారువేషంలో పనిచేస్తూ బ్రిటిష్‌ సైన్యానికి సంబంధించిన కీలక రహస్యాలెన్నో తెలుసుకోగలిగారు. ఇందుకోసం ప్రాణాలకు తెగించారు..

రాజమణి తండ్రికి బంగారు గనులు ఉండేవి. వాళ్లది తిరుచ్చి. ఆయన స్వాతంత్రోద్యమ మద్దతుదారుడు. బ్రిటిష్‌ సైన్యం అరెస్ట్‌ నుంచి తప్పించుకోవడానికి రంగూన్‌కి పారిపోయి అక్కడే స్థిరపడ్డారు. రాజమణి నేతాజీ భావజాలానికి, ప్రసంగాలకు ఆకర్షితురాలైంది. బర్మా వచ్చిన బోస్‌కు తన బంగారు, వజ్రాభరణాలను ఇచ్చేసింది. తన పట్టుదల చూసి ఆమెతో పాటు తన నలుగురు స్నేహితుల్నీ ఐఎన్‌ఏ గూఢచార విభాగంలో నియమించారు బోస్‌. తర్వాత అందులోని ఝాన్సీ రెజిమెంట్‌కి రాణిగా ఎదిగింది ఆమె. అంటే ఇప్పటి లెఫ్టినెంట్‌ హోదా. రాజమణి... ఆమె స్నేహితులు రెండేళ్లు చిన్నపిల్లల వేషాల్లో బ్రిటిష్‌ అధికారుల ఇళ్లల్లో పనులు చేసేవారు. రహస్యాలు సేకరించేవారు. ఓ సారి ఆమె స్నేహితురాలు వారికి పట్టుబడింది. దాని ఫలితమేంటో రాజమణికి తెలుసు. అందుకే నర్తకి వేషంలో అక్కడికి వెళ్లి అధికారులకు మత్తుమందు ఇచ్చి ఆమెను తప్పించింది. వాళ్లు పారిపోతుండగా ఓ గార్డు వాళ్లని తుపాకీతో కాల్చాడు. ఓ బుల్లెట్‌ మణి కాల్లోకి దిగింది. రక్తమోడుతున్న కాలితోనే చెట్టెక్కి మూడు రోజుల పాటు చెట్టుపైనే ఉండిపోయింది. రాజమణి సమయస్ఫూర్తిని బోస్‌ ఎంతగానో అభినందించారు. తన సేవలకు మెచ్చి జపాన్‌ చక్రవర్తి చేతుల మీదుగా పతకాన్ని అందించారు. తర్వాత ఆమె ఇండియాకి వచ్చేశారు. 2018లో గుండెపోటుతో మరణించారు.


భగత్‌సింగ్‌ను తప్పించి...

ఆంగ్లేయులు ధరించే టోపీ, దుస్తులూ... వేసుకుని హుందాగా ఉన్న యువకుడు. అతని పక్కనే అంతే అందంగా ఉన్న దొరసానమ్మ.. ఆమె కొడుకు. సామాన్లు మోసేందుకు ఒక కూలీ.. చూసినవాళ్లంతా వాళ్లది బ్రిటిష్‌ దొరగారి కుటుంబమే అనుకొన్నారు. ఆ భ్రమే వాళ్లని సురక్షితంగా గమ్యానికి చేర్చింది.. ఆ దొరగారు భగత్‌సింగ్‌ అనీ, ఆ కూలీ సుఖ్‌దేవ్‌ అనీ... ఆ దొరసానమ్మ దుర్గావతీదేవి అని.. ఆమే ఈ నాటకం మొత్తానికి సూత్రధారి అని తెలిసిన తర్వాత అంతా ఆశ్చర్యపోయారు.. ఉత్తర్‌ప్రదేశ్‌లో 1907, అక్టోబరు ఏడోతేదీన జన్మించారు దుర్గావతీదేవి. 11వ ఏట హిందుస్థాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్‌ సభ్యుడైన భగవతీ చరణ్‌వోహ్రాతో వివాహమైంది ఆమెకు. నౌజవాన్‌ భారత్‌సభ సభ్యురాలిగా, స్వాతంత్ర సమర యోధురాలిగా పని చేశారు. ఉద్యమకారులకు ఆయుధాలను అందించడం, ఆపదలో చిక్కుకున్న వారిని తన చతురతతో తప్పించడంలో దుర్గావతీదేవిది అందెవేసిన చేయి. అందరూ ప్రేమగా దుర్గాబాబీ అని పిలుచుకునేవారు. భగత్‌సింగ్‌ వంటి వారితో కలిసి పనిచేశారామె. జేపీ సాండర్స్‌ను హతం చేయడానికి భగత్‌సింగ్‌, రాజ్‌గురులకు ఈమె ఆయుధాలను సమకూర్చారు. అంతేకాదు, సంఘటనాస్థలం నుంచి భగత్‌సింగ్‌ను రైల్లో ఆంగ్లేయులకు అనుమానం రాకుండా చాకచక్యంగా తనే తప్పించింది.  ఇందుకోసం ఈమె భగత్‌సింగ్‌కు భార్యలా నటించింది. 1929లో భగత్‌సింగ్‌ లొంగిపోయాడు. అదే సమయంలో లార్డ్‌ హెయిలీని హత్య చేసే సాహసానికి ఈమె ఒడికట్టారు. హెయిలీ తప్పించుకున్నా కూడా చాలామంది ఆంగ్లేయుల మృతికి కారణమయ్యారీమె. దీంతో పోలీసులు ఈమెను ఖైదు చేశారు. మూడేళ్లపాటు జైలు శిక్ష వేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఘజియాబాద్‌లో స్థిరపడిన ఈమె, పేద పిల్లల కోసం ఉచితంగా విద్యనందించేదిశగా లక్‌నవూలో పాఠశాల ప్రారంభించారు. తన 92వ ఏట 1999లో కన్నుమూశారు.


చావన్నా వెరుపు లేదు..

చూపు తిప్పుకోలేని అందం. మృదువైన గాత్రానికి తోడు లీనమై ఆమె చేసే నృత్యం చూస్తే ఎవరైనా మైమరిచిపోవాల్సిందే. అందుకే అక్కడి అధికార వేడుకల్లో ఈమె నృత్యం తప్పనిసరి. పెద్ద మొత్తమూ అందేది. దాన్నంతా ఆమె ఒకరి చేతుల్లో పెట్టడమే కాక.. వాళ్లకోసం అధికారులతో సాన్నిహిత్యాన్ని ఏర్పరుచుకుని వారి ఆనుపానుల్ని తెలుసుకునేది. తన సాయంతో కొందరు బ్రిటిష్‌ అధికారులను మట్టుపెట్టేవారు. ఆ నర్తకి అజీజున్‌ బాయ్‌, సమాచారాన్ని అందుకున్నది స్వాతంత్య్ర సమరయోధులు.  నానా సాహెబ్‌, తాత్యా తోపేల స్ఫూర్తితో అజీజున్‌ స్వాతంత్య్రోద్యమంలో భాగమైంది. తన నగలు, సంపాదించిన డబ్బూ దేశ విముక్తి పోరాటానికే ధారపోసింది. మగవాడిలా వేషం వేసుకుని తుపాకులతో పోరాటాల్లో పాల్గొనేది. విప్లవకారుల రహస్య సమావేశాలకీ ఈమె ఇల్లే వేదిక. ‘మస్తానీ టోలి’ పేరిట తోటి నృత్యకారిణులు, మహిళలతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. వీరంతా మగవేషాల్లో గుర్రాల మీద ఊరూరా తిరుగుతూ యువకులను తిరుగుబాటు సైన్యంలో చేరేలా ప్రోత్సహించేవారు. నృత్యకారిణులు బ్రిటిషర్ల వేడుకల్లో పాల్గొని సమాచారాన్ని సేకరించేవారు. దీన్ని అజీజున్‌ రహస్యంగా స్వాతంత్య్ర వీరులకు అందజేసేది. తన సిపాయిల పట్ల ఎంత ప్రేమ, దయతో ఉండేదో.. శత్రువుల పట్ల అంతే కఠినంగా వ్యవహరించేది. బితుర్‌లో జరుగుతున్న ఉద్యమంలో ఈమెను తెల్లదొరలు బందీ చేశారు. ఈమె అందం చూసి స్వాతంత్య్ర పోరాట యోధుల రహస్యాలను చెబితే వదిలేస్తామన్నారు. కానీ లొంగలేదు. చిత్రహింసలు పెట్టినా వెరవలేదు. దీంతో ఆమెను కాల్చేశారు. ఎంత అంటే... ఆమె శరీరమంతా తూట్లు పడేలా!


నాజీలకు ముచ్చెమటలు

సెంట్రల్‌ లండన్‌లో ఉన్న నూర్‌ఇనాయత్‌ఖాన్‌ విగ్రహాన్ని చూసినా, ఆ యోధురాలి కథ విన్నా... మన నరాల్లో దేశభక్తి ఉప్పొంగుతుంది. నూర్‌ ఒక రాజకుమారి. టిపుసుల్తాన్‌ వంశీకురాలు. పుట్టింది రష్యాలో. పెరిగింది బ్రిటన్‌, ఫ్రాన్స్‌లలో. మొదటి ప్రపంచయుద్ధం తర్వాత భారత్‌ నుంచి లండన్‌ వెళ్లిన ఆ కుటుంబం రక్తంలో దేశభక్తి ఇంకా పెరిగిందేకానీ రవ్వంత కూడా తగ్గలేదు. దాని ఫలితంగా సూఫీ మతస్థులైన వీరి కుటుంబం లండన్‌ నుంచి ఫ్రాన్స్‌కి వలస వెళ్లాల్సి వచ్చింది. వాస్తవానికి నూర్‌ది శాంతిని ప్రేమించే తత్వం. ఫ్రెంచ్‌, ఇంగ్లిష్‌లలో పిల్లలకోసం బుద్ధునికి సంబంధించి ఆమె రాసిన కథలు ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉన్నాయి. ఆమె 13 ఏళ్ల వయసులో ఇండియాకి వస్తుండగా తండ్రి చనిపోయాడు. అప్పటి నుంచీ తల్లికి అండగా నిలిచి తోబుట్టువులని పెంచి పెద్ద చేసింది. అత్యవసర పరిస్థితుల్లో రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్‌ తరఫున నాజీలకు వ్యతిరేకంగా గూఢచర్యం చేసింది. మరో ఇద్దరు మహిళా స్పైలతో కలిసి మెడలిన్‌ పేరుతో నాజీల గుట్టుమట్టులు పసికట్టేది. ఈ యుద్ధం తర్వాత నేను మా భారతదేశం తరఫున మాత్రమే పోరాడుతా అని నిక్కచ్చిగా చెప్పిన ధీరురాలు. కానీ కొందరు ద్రోహుల కారణంగా నాజీల చేతిలో హతమైంది. బ్రిటన్‌ ప్రభుత్వం ఆమె ధీరత్వాన్ని గుర్తించి ఆ దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన బ్లూప్లాక్‌ అవార్డుని బహుకరించింది. ఫ్రెంచ్‌ ప్రభుత్వం ఆమె చిత్రంతో పోస్టల్‌ స్టాంప్‌ని విడుదల చేస్తే... బ్రిటన్‌ ప్రభుత్వం నాణాలపై నూర్‌ బొమ్మని ముద్రించే ఆలోచనలో ఉంది. ఆమె స్ఫూర్తి గాథని ‘కాల్‌టుస్పై’ పేరుతో నెట్‌ఫ్లిక్స్‌ చిత్రంగా రూపొందించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్