చేసిన పనులే.. పట్టం కట్టాయి!

ప్రశ్నించే గొంతుక వీళ్ల బలం... ఉన్నత చదువులు అదనపు శక్తి! సామాజిక సమస్యలపై పోరాడుతూ...

Updated : 09 Jul 2021 14:28 IST

ప్రశ్నించే గొంతుక వీళ్ల బలం... ఉన్నత చదువులు అదనపు శక్తి! సామాజిక సమస్యలపై పోరాడుతూ... స్త్రీసాధికారిత దిశగా చైతన్యాన్ని రగిలిస్తూ 
చిన్న స్థాయి నుంచి ఎదిగిన వాళ్లు వీరంతా. ఒక్కొక్కరిదీ ఒక్కో ప్రత్యేకత... కేంద్ర మంత్రివర్గంలో కొత్తగా చోటు దక్కించుకున్న ఏడుగురిదీ ఒక్కో నేపథ్యం.. ఒక్కో స్ఫూర్తి ప్రస్థానం.

ఇందిర తర్వాత తనే: దర్శన విక్రమ్‌ జర్దోష్‌

గుజరాత్‌లోని సూరత్‌ నుంచి మూడోసారి ఎంపీగా ఎంపికయ్యారు. 60 ఏళ్ల దర్శన వృత్తి వ్యాపారం. ఎకనామిక్స్‌ అండ్‌ బ్యాంకింగ్‌లో బీకాం చదివారు. రాజకీయాల్లో నాలుగు దశాబ్దాల అనుభవం. భాజపా వార్డ్‌ కమిటీ ఉపాధ్యక్షురాలిగా తొలి అడుగు. లోక్‌సభకు మొదటిసారి 2009లో ఎంపికయ్యారు. 2014 ఎన్నికల్లో 76% ఓట్లు సాధించి ఇందిరాగాంధీ తర్వాత అత్యధిక ఓట్లు సాధించిన మహిళగా నిలిచారు. ఎన్నో మహిళా సాధికారత కమిటీల్లో సభ్యురాలు. గుజరాత్‌ సోషల్‌ వెల్ఫేర్‌ బోర్డ్‌ సభ్యురాలు కూడా. బాలికా విద్య, మహిళా సాధికారత కోసం ‘సంస్కృతి’ అనే సంస్థను స్థాపించారు. భరతనాట్య కళాకారిణి కూడా!


సామాజిక సమస్యలపై పోరు: అనుప్రియ

ఉత్తర్‌ప్రదేశ్‌లో వెనుకబడిన వర్గాల గొంతుకగా చెప్పుకొనే అప్నాదళ్‌ పార్టీ స్థాపకుడు డాక్టర్‌ సోనేలాల్‌ పటేల్‌ కుమార్తె అనుప్రియ. ఆయన నలుగురు కుమార్తెల్లో ఒకరైన అనుప్రియ అద్భుతమైన వక్త. సైకాలజీలో పీజీ, ఎంబీయే చేసిన ఆమె చదువుకుంటూనే... తండ్రి రాజకీయ వారసత్వాన్నీ అందిపుచ్చుకున్నారు. ఆయన చనిపోయిన తర్వాత పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. మీర్జాపూర్‌ నుంచి ఎంపీగా ఎన్నికవుతున్నారు. మోదీ తొలి కేబినెట్‌లోనూ స్థానాన్ని సాధించుకున్న అను సామాజిక సమస్యలపై తన గొంతుకని బలంగా వినిపిస్తూ వచ్చారు. సమస్యల పరిష్కారం కోసం రాజీపడని తీరే మళ్లీ అవకాశాన్ని తెచ్చిపెట్టింది.


త్రిపుర దీదీ: ప్రతిమా భౌమిక్‌

త్రిపుర నుంచి కేంద్ర కేబినెట్‌కు ఎంపికైన తొలి మహిళ. ఈశాన్య రాష్ట్రాల నుంచి ఎంపికైన రెండో మహిళ. సామాన్యంగా కనిపించే ప్రతిమకు గొప్ప నాయకురాలని పేరు. అక్కడి ప్రజలకు ‘దీదీ’. ‘పని రాక్షసి’గా చెప్పుకొంటారు. 52 ఏళ్ల ఈమెది వ్యవసాయ కుటుంబం. తొంభైల్లో త్రిపురలో భాజపా ఆనవాళ్లే లేవు. వామపక్షాలదే హవా. కేంద్రంలో కాంగ్రెస్‌ పాలన. ఆ సమయంలో ప్రతిమ భాజపా యువ మోర్చాలో చేరారు. ఎన్ని ఒడుదొడుకులొచ్చినా పార్టీని వదల్లేదు. త్రిపురలో పార్టీ విజయంలో తన పాత్ర చాలా కీలకం. 2014లో మూడు లక్షల మెజారిటీతో గెలుపొందారు. ఈమె గ్రామంలో 80% మంది ముస్లింలే. గ్రామానికి 300 మీటర్ల దూరంలో భారత్‌ - బంగ్లా సరిహద్దు ఉంది. దానికి అవతలివైపు రైతుల పొలాలుండేవి. వాళ్లకి ఐడీ కార్డులు ఇప్పించి, అక్కడికి వెళ్లి పని చేసుకునే వీలు కల్పించారు. మతంతో సంబంధం లేకుండా అడిగిన వారికి లేదనకుండా సాయం చేయడం తన నైజం. తాజాగా మంత్రిగా మొదటి నెల జీతాన్నీ అసోం వరద బాధితుల సహాయ నిధికి అందజేశారు.


ఉత్తమ పార్లమెంటేరియన్‌: డా.భారతీ పవార్‌

ఎంబీబీఎస్‌ చదివి వైద్యురాలిగా పని చేస్తూ రాజకీయాల్లోకి వచ్చారు. ఈమె మామగారు ఏటీ పవార్‌ ఎనిమిదిసార్లు ఎమ్మెల్యే. రాష్ట్ర మంత్రిగానూ చేశారు. భారతి జడ్పీ సభ్యురాలిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 42 ఏళ్ల భారతి మహిళలు, పిల్లల్లో పోషకాహార లోప నివారణకు, నాసిక్‌లో స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ఎనలేని కృషి చేశారు. 2019లో మహారాష్ట్రలోని డిండోరా నుంచి ఎంపీగా గెలిచారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ స్టాండింగ్‌ కమిటీ సభ్యురాలిగా చేశారు. చురుకైన పని తీరుతో అదే ఏడాది డిసెంబరులో ‘ఉత్తమ పార్లమెంటేరియన్‌’ పురస్కారాన్నీ అందుకున్నారు.


పిన్న వయసులోనే: అన్నపూర్ణాదేవి యాదవ్‌

బిహార్‌కు చెందిన 51 ఏళ్ల అన్నపూర్ణాదేవి, కొడర్మా ఎంపీ. దుముకాలో స్థిరపడిన బెంగాలీ కుటుంబంలో పుట్టిన ఈమె, ఎంఏ చేశారు. ఆర్‌జేడీ ఎమ్మెల్యేగా ఉండే భర్త రమేష్‌ యాదవ్‌ మృతితో రాజకీయాల్లోకి వచ్చారు. 1998లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్‌జేడీ తరఫున గెలిచి మంత్రిగా పని చేశారు. అప్పటికి తనకు 30 ఏళ్లు. తర్వాత నాలుగు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. బిహార్‌ విభజన తర్వాత 2013లో ఝార్ఖండ్‌లో మంత్రిగా చేశారు. సామాజిక సేవకురాలిగా పేదల కోసం కృషి చేసి పేరు తెచ్చుకున్నారు. 2019 ఎన్నికల ముందు భాజపాలో చేరారు.


పార్టీకే అంకితం : శోభ కరంద్లాజేె

కర్ణాటక భాజపా ఉపాధ్యక్షురాలు. దక్షిణ కర్ణాటకలోని పుత్తూరులో పుట్టిన ఆమె, చిన్నతనంలోనే ఆరెస్సెస్‌లో చేరారు. దానికే జీవితం అంకితమని, ఇందుకోసం తాను పెళ్లే చేసుకోనని ప్రమాణం చేశారు. సోషియాలజీలో ఎమ్మే  చేశారామె. 1994లో శోభ రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప మంత్రిగా నియమించడంతో శోభ కరంద్లాజే ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. హిందుత్వ ఆలోచనలను బలంగా వ్యాప్తి చేయడంలో శోభకు పెట్టింది పేరు.


బలమైన గొంతుక : మీనాక్షీ లేఖీ

దిల్లీ నుంచి రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. సీఏఏపై పార్లమెంట్‌లో లేఖీ స్పందించిన తీరు ఆమెను వార్తల్లో వ్యక్తిగా నిలబెట్టింది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆమె లా చదివారు. సుప్రీంకోర్టులో ప్రాక్టీస్‌ చేస్తూనే పలు ఎన్జీవోలకు న్యాయ సేవలు అందిస్తుంటారు. గృహహింస, కుటుంబ వివాదాలు... ముఖ్యంగా దేశ సైనిక దళాలలో పనిచేసే మహిళల పర్మనెంట్‌ కమిషనింగ్‌ కేసుల్లో లేఖీ బలంగా వాదించారు. మహిళా రిజర్వేషన్, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల బిల్లుల ముసాయిదా తయారీ కమిటీల్లో ఆమె కీలకంగా పనిచేశారు. జాతీయ మహిళా కమిషన్‌తో పాటు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ కో-ఆపరేషన్, చైల్డ్‌ డెవలప్‌మెంట్, డబ్ల్యూటీ¨ఐ, సీఎస్‌ఆర్‌లతో కలిసి మహిళలు, పిల్లల హక్కుల కోసం కృషిచేశారు. సంఘ్‌ పరివార్‌ ఆర్థిక విభాగం స్వదేశీ జాగరణ్‌ మంచ్‌లో పని చేశారు. నితిన్‌ గడ్కరీ భాజపా అధ్యక్షుడైన తర్వాత మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలిగా మీనాక్షీని ఆహ్వానించారు. అతి చురుకైన ఎంపీల్లో ఒకరు. న్యాయ వ్యవహారాల్లో పట్టు, కలసిపోగలగడం, కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉత్సుకతే ఆమెను బలమైన నాయకురాలిని చేశాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్