ఈ దోస్తులు.. రైతు నేస్తాలు..!

వాళ్లిద్దరూ స్నేహితులు. కలిసి చదువుకొన్నారు.. అంతటితో ఆగిపోతే వాళ్ల బంధం అంత ప్రత్యేకం అయ్యేది కాదేమో! ఒకరు సామాజిక సేవకోసం ఉద్యోగం వదులుకుంటే మరొకరూ అదే బాటపట్టారు.

Published : 04 Apr 2022 00:48 IST

వాళ్లిద్దరూ స్నేహితులు. కలిసి చదువుకొన్నారు.. అంతటితో ఆగిపోతే వాళ్ల బంధం అంత ప్రత్యేకం అయ్యేది కాదేమో! ఒకరు సామాజిక సేవకోసం ఉద్యోగం వదులుకుంటే మరొకరూ అదే బాటపట్టారు. రైతులకు, విద్యార్థులకు మేలు చేయడం కోసం సౌర ఆవిష్కరణలు చేస్తూ ఎంతో డబ్బుని ఆదా చేస్తున్నారు..

మినుశ్రీ మధుమిత, అమృత ఇద్దరూ పదోతరగతి వరకూ కలిసే చదువుకున్నారు. ప్రాణ స్నేహితులు. స్వస్థలం ఒడిశాలోని కలహండి. మిను రసాయనశాస్త్రంలో పీజీ చేస్తే... అమృత ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ చేసింది. ఆపై ఇద్దరూ మేనేజ్‌మెంట్‌ డిగ్రీలు పూర్తిచేసి.. దిల్లీలో ఉద్యోగాలు సంపాదించారు.. కొన్నిరోజులకే మినుశ్రీకి తన ఉద్యోగ ప్రయాణం విసుగు పుట్టింది. తను పుట్టి పెరిగిన సమాజానికి తనవంతుగా సేవ చేయాలన్న ఆలోచనతో ఒడిశాలో బిహాంగ్‌ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థ లక్ష్యం.. గ్రామీణ విద్యార్థులకు కంప్యూటర్‌ విద్యని చేరువ చేయడం. ‘ప్రభుత్వ పాఠశాలలు ఈ విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉండేవి. దానికి తోడు ఇక్కడ విద్యుత్‌ కోతలు ఎక్కువ. అప్పుడే నా ఆలోచన సౌర ఉత్పత్తుల వైపు మళ్లింది. ఏషియన్‌ పెయింట్స్‌ సంస్థ సీఎస్‌ఆర్‌లో భాగంగా అందించే నిధుల సాయంతో సౌరశక్తితో నడిచే కంప్యూటర్‌ ల్యాబ్‌లను ఒడిశాలో నిర్వహించేదాన్ని. ఈ పనికి పూర్తి సమయం కేటాయించాలని, చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేశా. నా లక్ష్యాన్ని అర్థం చేసుకుని నాతో అమృత చేరింది. అయితే మేం కొన్న సౌరఫలకాలు ఆరు నెలలకే పాడవ్వడం... వాటికి చీటికీమాటికీ మరమ్మతులు చేయించాల్సి రావడంతో నాణ్యమైన సౌర ఆవిష్కరణల తయారీ వైపు దృష్టిపెట్టాం’ అంటూ వాళ్ల అంకుర సంస్థ ‘థింక్‌ రా’ ప్రారంభమైన సందర్భం గురించి వివరించింది మినుశ్రీ.

రైతుల కోసం...
2016లో థింక్‌రా సంస్థని ప్రారంభించారీ స్నేహితురాళ్లు.. మొదట్లో విద్యార్థుల కోసం కంప్యూటర్‌ ల్యాబుల నిర్వహణకు అవసరమైన సౌర ఫలకాలు తయారుచేస్తే చాలనుకున్నారు. తర్వాత వారి దృష్టి రైతుల పైనా పడింది. కారణం కలహండిలో వ్యవసాయం ఎప్పుడూ నష్టాలనే మిగిల్చేది. నిజానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ఏమాత్రం అవగాహన ఉన్నా ఆ నష్టాలు నివారించదగ్గవే అన్నది ఈ స్నేహితురాళ్ల అభిప్రాయం. అందుకే క్రిషి ధను, ధీవరమిత్ర, మత్స్యబంధు అనే పరికరాలను ఆవిష్కరించారు. ‘సాధారణంగా పొలాల్లో ఎరువులని స్త్రీలు చేత్తో చల్లుతుంటారు. ఇలా చల్లడం వల్ల చేతికి అలర్జీలు వస్తాయి. పైగా ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువ పడి డబ్బు వృథా అవుతుంది. అలాకాకుండా సోలార్‌ప్యానెల్‌తో ఛార్జ్‌ అయిన క్రిషి ధను పరికరాన్ని వీపునకు కట్టుకొని ఎరువులని పొలమంతటా సమానంగా చల్లొచ్చు. ఘన రూపంలో ఉన్న ఎరువులని కూడా చల్లడం ఈ పరికరం ప్రత్యేకత. గర్భిణులు కూడా ఈ పరికరాన్ని తేలిగ్గా మోయగలిగేలా దీన్ని తయారుచేశాం. ఇక చెరువుల్లో చేపలు సాగు పెద్ద సవాల్‌ అనే చెప్పాలి. చెరువులో ఆక్సిజన్‌ స్థాయులను స్థిరీకరించేందుకు కొన్ని పరికరాలని వాడతారు. అవి నడవడానికి ప్రధానంగా డీజిల్‌ని వినియోగిస్తారు. ఈ శిలాజ ఇంధనాల వినియోగానికి అడ్డుకట్టవేసేందుకు తయారుచేసిన పరికరమే ధీవరమిత్ర. సోలార్‌ ప్యానెల్‌ అమర్చిన పరికరాలు చెరువులో తేలుతూ.. ఆక్సిజన్‌ స్థాయిలో తేడా రాకుండా చూసి చేపలు పెద్ద మొత్తంలో చనిపోకుండా కాపాడతాయి. ఇక మత్య్సబంధు అయితే చేపలకు వేసే ఆహారం ఎక్కువ తక్కువలు కాకుండా చూసి రైతులకు నష్టం రాకుండా చేస్తుంది’ అంటుంది అమృత. ఈ ఆవిష్కరణలతో రైతులు 35 శాతం మేర నష్టం తగ్గించుకున్నారంటున్నారు ఈ స్నేహితురాళ్లు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్