నీడ లేని వారికి గృహదానం!

సాయమనగానే ఏం గుర్తొస్తుంది? ఆహారం, దుస్తులు.. లేదంటే నగదు ఇవ్వడం కదా! కానీ ఒకామె ఏకంగా ఇళ్లను కట్టించి ఇస్తోంది. అలా  రెండు వందలకు పైగా ఇళ్లను కట్టించి ఇచ్చింది. ప్రభుత్వాల బాధ్యతలను భుజాన వేసుకున్న ఆమే సునీల్‌ ఎంఎస్‌...అబ్బాయి పుడితే ఈ పేరు పెట్టాలనుకున్నారు

Updated : 18 Jun 2021 00:48 IST

సాయమనగానే ఏం గుర్తొస్తుంది? ఆహారం, దుస్తులు.. లేదంటే నగదు ఇవ్వడం కదా! కానీ ఒకామె ఏకంగా ఇళ్లను కట్టించి ఇస్తోంది. అలా  రెండు వందలకు పైగా ఇళ్లను కట్టించి ఇచ్చింది. ప్రభుత్వాల బాధ్యతలను భుజాన వేసుకున్న ఆమే సునీల్‌ ఎంఎస్‌...

అబ్బాయి పుడితే ఈ పేరు పెట్టాలనుకున్నారు సునీల్‌ వాళ్ల నాన్న. అమ్మాయి పుట్టినా ఆ పేరునే పెట్టారు. సునీల్‌ జువాలజీ ప్రొఫెసర్‌. రెండేళ్ల క్రితం పదవీ విరమణ చేశారు. తండ్రి బ్యాంక్‌ మేనేజర్‌, తల్లి టీచర్‌. ఆర్థికంగా స్థితిమంతుల కుటంబం వీరిది. అమ్మానాన్నలు ఇంట్లో, పొలంలో పని వారికీ, చుట్టూ ఉన్నవారికీ సాయం చేస్తుండటం చూస్తూ పెరిగిందీవిడ.
2006లో ఆమె పనిచేసే కళాశాలకు సునీల్‌ రెండోసారి ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌గా ఎంపికైంది. ఏటా కళాశాలలో సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. ఆ ఏడాది తమ కళాశాలలో పక్కా ఇళ్లు లేని పేద విద్యార్థులకు గృహాలు నిర్మించి ఇద్దామనే ఆలోచన చేశారు. ఓ విద్యార్థిని తన స్నేహితురాలు ఆశాకి సరైన ఇల్లు లేదని సునీల్‌ దృష్టికి తీసుకొచ్చింది. ఆ విద్యార్థిని ఇంటికి వెళ్లిందీమె. ‘ఆశా వాళ్లది ప్లాస్టిక్‌ షీట్లతో తయారు చేసిన ఇల్లు. ద్వారానికి తలుపుగా చున్నీని కట్టారు. దాన్ని అప్పుడప్పుడూ వేసుకొని ఆశా కళాశాలకు వస్తుంది కూడా. అది చూసి చలించిపోయాను’ అంటుంది సునీల్‌.
ఆ అమ్మాయి ఇంటికి లక్షా ఇరవై వేలు అయితే రూ.98 వేలు కళాశాల నుంచి వచ్చాయి. మిగిలినవి సునీల్‌ సేవింగ్స్‌. ఇంకోసారి కోడుమన్‌లో క్యాన్సర్‌ పేషెంట్‌కీ ఇల్లు లేదని తెలిసి, కట్టించి ఇచ్చింది. ‘ఇళ్లు ఇచ్చినపుడు వాళ్ల కళ్లలో ఆనందం చూశాక ఇంతకన్నా జీవితానికి ఇంకేం కావాలనిపించింది. అప్పుడే పేదల ఇళ్ల విషయంలో చేతనైన సాయం చేయాలనుకున్నా’ అంటోందీ విద్యావేత్త. ఇప్పటివరకూ కేరళలోని అయిదు జిల్లాల్లో 206 గృహాలను నిర్మించి ఇచ్చింది. తను ఇచ్చే 650 చదరపు అడుగుల ఇంట్లో రెండు పడక గదులు, హాలు, వంట గది ఉంటాయి. పిల్లలున్న వితంతువులకు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడే పేదలకు ఈ విషయంలో ప్రాధాన్యం ఇస్తుంది. సేవా కార్యక్రమాల కోసం సునీల్‌ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసింది. సొంత సొమ్ముతో పాటు విద్యార్థులు, స్నేహితులు విరాళాలు ఇస్తూ ఉంటారు. ఒక్కో ఇంటికీ రూ.4 లక్షలు అవుతోందట. సామగ్రిని తనే స్వయంగా కొంటుంది. ఇలా అయితే ఖర్చు కలిసొస్తుందని. ఇదేకాదు ఏటా వెయ్యి మంది విద్యార్థులకు పుస్తకాలు, ఇతర సామగ్రిని ఇచ్చేది. లాక్‌డౌన్‌లో 13 మందికి ల్యాప్‌టాప్‌లు, 3 టీవీలనూ అందించింది. చక్కటి ఇళ్లతో ఓ గ్రామాన్ని నిర్మించి పేదలకు ఉచితంగా ఇవ్వాలన్నది సునీల్‌ కల. ఆ దిశగా ప్రయత్నిస్తున్నానంటోంది. ఆమె కల నెరవేరాలని కోరుకుందాం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్