Booker Prize Nominations: తల్లీకూతుళ్ల మధ్య సంఘర్షణే చదివించేసింది!
‘కథ అంటే ఏకబిగిన పాఠకులతో చదివించేలా ఉండాలి.. అంతటి రచనా సామర్థ్యం కలిగి ఉండడం నాకు ఆ భగవంతుడు ప్రసాదించిన గొప్ప వరం..’ అంటారు ప్రముఖ రచయిత్రి గీతాంజలి శ్రీ. పెరిగి పెద్దయ్యే క్రమంలో రచనలంటే మక్కువ పెంచుకున్న ఆమె ఎన్నో కథలు, కాల్పనికాలు, నవలలు రచించి.. తనదైన రచనా శైలితో అశేషమైన పాఠకాభిమానుల్ని....
(Photo: Instagram)
‘కథ అంటే ఏకబిగిన పాఠకులతో చదివించేలా ఉండాలి.. అంతటి రచనా సామర్థ్యం కలిగి ఉండడం నాకు ఆ భగవంతుడు ప్రసాదించిన గొప్ప వరం..’ అంటారు ప్రముఖ రచయిత్రి గీతాంజలి శ్రీ. పెరిగి పెద్దయ్యే క్రమంలో రచనలంటే మక్కువ పెంచుకున్న ఆమె ఎన్నో కథలు, కాల్పనికాలు, నవలలు రచించి.. తనదైన రచనా శైలితో అశేషమైన పాఠకాభిమానుల్ని సంపాదించుకున్నారు. అంతేనా.. ఆమె రచనలు పలు విదేశీ భాషల్లోకీ అనువాదితమై ఆమెకు ప్రపంచవ్యాప్త గుర్తింపు సంపాదించి పెట్టాయి. ఇక ఈ ఏడాది ఏకంగా ప్రతిష్టాత్మక ‘అంతర్జాతీయ బుకర్ ప్రైజ్’కు నామినేట్ అయ్యేలా చేశాయి. తద్వారా తన రచన ఈ పురస్కార రేసులో నిలిచిన తొలి హిందీ నవలగా గుర్తింపు సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో ఈ మహిళా రచయిత్రి రచనా ప్రస్థానం గురించి కొన్ని విశేషాలు మీకోసం..
కథంటే లోనికి వెళ్లే కొద్దీ ఆద్యంతం ఆసక్తికరంగా, పాఠకుల్ని నవ్వించేలా ఉండాలంటారు దిల్లీ రచయిత్రి గీతాంజలి శ్రీ. ఈ అంశాల్నే తన ప్రతి కథలో రంగరించి తనకంటూ ప్రత్యేకమైన రచనా శైలిని సొంతం చేసుకున్న ఆమె.. తన రచనలతో ఎంతోమంది పాఠకుల ఆదరాభిమానాల్ని చూరగొన్నారు. ఇదే శైలితో 2018లో ‘రెట్ సమాధి’ పేరుతో హిందీలో ఓ నవల రాశారామె. దీన్ని అమెరికాకు చెందిన అనువాదకురాలు డైసీ రాక్వెల్ ‘టూంబ్ ఆఫ్ శాండ్’ పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ నవల ఈ ఏడాది ప్రతిష్టాత్మక ‘అంతర్జాతీయ బుకర్ ప్రైజ్’ రేసులో నిలవడం విశేషం.
ఇంతకీ, ఏంటా కథ?
‘టూంబ్ ఆఫ్ శాండ్’ కథలో భాగంగా.. ఉత్తర భారతానికి చెందిన ఓ 80 ఏళ్ల మహిళ తన భర్త మరణానంతరం తీవ్ర నిరాశా నిస్పృహలు, డిప్రెషన్లోకి కూరుకుపోతుంది. అయితే ఇలాంటి ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడి తాను తిరిగి కొత్త జీవితాన్ని ఎలా ప్రారంభించిందన్నదే ఈ కథ సారాంశం. ఈ క్రమంలో ఆమె పాకిస్థాన్ వెళ్లడం, సంప్రదాయ వాది అయిన ఆమెకు, పూర్తి మోడ్రన్ వ్యక్తిత్వమున్న తన కూతురికి మధ్య జరిగే సంభాషణలు, తన జీవితంలోని ఎత్తుపల్లాలను ఎదుర్కొన్న విధానం.. వంటి మలుపులన్నీ రచయిత్రి ఆసక్తికరంగా, భావోద్వేగభరితంగా మలిచారు. అందుకే ఈ పుస్తకాన్ని పాఠకులే కాదు.. బుకర్ప్రైజ్ న్యాయనిర్ణేతలూ మెచ్చారు.
2018లో ‘రెట్ సమాధి’ పేరుతో గీతాంజలి రచించిన ఈ పుస్తకాన్ని ‘టూంబ్ ఆఫ్ శాండ్’ పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు యూఎస్ రచయిత్రి, అనువాదకురాలు డైసీ రాక్వెల్. ఈ ఏడాది విడుదలైన ఈ పుస్తకం ‘అంతర్జాతీయ బుకర్ ప్రైజ్’ రేసులో నిలిచిన తొలి హిందీ నవలగా చరిత్రకెక్కింది. ఒకవేళ ఈ పుస్తకానికి పురస్కారం దక్కితే.. 50 వేల పౌండ్ల (సుమారు 49.4 లక్షలు) నగదు బహుమతిని గీతాంజలి అందుకోనున్నారు. ఈ మొత్తాన్ని అనువాదకురాలు డైసీతో పంచుకోనున్నారామె. ఇప్పటికే ఈ పుస్తకం ‘ఇంగ్లిష్ పెన్ అవార్డు’ కూడా దక్కించుకుంది.
నాకు నేనే స్ఫూర్తి!
సాధారణంగా చాలామంది తమ విజయం వెనుక ఎవరో ఒక స్ఫూర్తి ప్రదాత ఉన్నారని చెబుతుంటారు. కానీ తన సక్సెస్కు స్వీయ స్ఫూర్తే కారణమని చెబుతున్నారామె. మణిపూర్లో పుట్టి పెరిగిన ఆమె.. చిన్నతనంలో తన తండ్రి ఉద్యోగ రీత్యా వివిధ రాష్ట్రాలు తిరిగారు. ఆఖరికి దిల్లీలో స్థిరపడిన ఆమె.. ఆంగ్ల మాధ్యమంలోనే చదువు కొనసాగించినా.. హిందీకే ఆకర్షితురాలయ్యారు.
‘నేను రచయిత్రిగా మారేందుకు నాకు నేనే స్ఫూర్తి అని చెప్తా. ఎందుకంటే పెరిగి పెద్దయ్యే క్రమంలో నా గురించి నేను ఎక్కువగా తెలుసుకునే దాన్ని. ఆ విషయాలన్నీ ఓ పేపర్పై రాసుకునేదాన్ని. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వోద్యోగి అయిన మా నాన్న రచయిత కూడా! అందుకే ఇంట్లో ఎప్పుడూ ఆ వాతావరణం ఉండేది. ఇక అమ్మేమో ఎక్కువగా హిందీలోనే మాట్లాడేది. అలా రచనలపై, హిందీ భాషపై ఇష్టం పెరిగింది. ఇక పెరిగి పెద్దయ్యే క్రమంలో కొంతమంది ప్రముఖ హిందీ, ఉర్దూ రచయితల్ని కలిశాను. ఇలా నా మనసంతా ఎప్పుడూ పుస్తకాలు, సాహిత్యం పైనే ఉండేది. ఒక దశలో పుస్తకాలు, రచనలే నా వినోదంగా మారిపోయాయి..’ అంటూ చెప్పుకొచ్చారు గీతాంజలి.
అమ్మ పేరే ఇంటి పేరుగా..!
గీతాంజలి అసలు పేరు గీతాంజలి పాండే. అయితే కాలక్రమేణా తన తల్లి శ్రీ కుమారి పాండే పేరులోని ‘శ్రీ’ తన పేరు చివర చేర్చుకొని అమ్మతో తనకున్న అనుబంధాన్ని చాటుకున్నారామె. 1987లో ‘బెల్ పాత్రా’ పేరుతో తొలి కథ రాసిన ఆమె.. 1991లో ‘అనుగూంజ్’ పేరుతో లఘు కథా సంపుటిని పాఠకులకు అందించారు. వీటితో పాటు మరెన్నో షార్ట్ స్టోరీస్కి కేరాఫ్ అడ్రస్గా నిలిచిన గీతాంజలి.. ‘రెట్ సమాధి’ కంటే ముందు ‘మాయ్’, ‘హమారా షహర్ ఉస్ బరాస్’, ‘తిరోహిత్’, ‘ఖాలీ జగా’.. వంటి నాలుగు నవలలు రాశారు. హిందీ భాషలో ఆమె రాసిన కథలు.. దేశీయ పాఠకుల్నే కాదు.. ఆంగ్లం, ఫ్రెంచ్, జర్మన్, సెర్బియన్, కొరియన్.. వంటి విదేశీ భాషల్లోకీ అనువాదితమై.. అక్కడి పాఠ్య ప్రేమికుల్నీ ఆకట్టుకున్నాయి.
‘అద్భుతమైన రచనా సామర్థ్యం నాకు దేవుడు ప్రసాదించిన గొప్ప వరం. నా కథల ప్రయాణం ప్రతి రోజూ ఉదయం 9.30 గంటలకు మొదలై.. సాయంత్రం 5 గంటలతో పూర్తవుతుంది. అలాగని మిగతా సమయంలో రచనలకు దూరంగా ఉంటానని అనుకోకండి.. కథను మరింత సృజనాత్మకంగా ఎలా మలచాలో? అందులో కొత్త కొత్త మలుపులు ఎలా తీసుకురావాలో? అన్న విషయాల పైనే నా మనసులో నిరంతరం మేథోమథనం జరుగుతుంటుంది..’ అంటున్నారు గీతాంజలి.
ఆమెతో నాది ఈ-మెయిల్ బంధం!
తన అద్భుతమైన రచనా శైలితో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పాఠకాభిమానాల్ని చూరగొన్న గీతాంజలి ప్రస్తుతం బుకర్ ప్రైజ్ రేసులో ఉన్నారు. ఈ క్రమంలో తన హిందీ నవలను ఆంగ్లంలోకి అనువదించిన డైసీతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని, జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారామె. ‘సాహిత్యంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే బుకర్ ప్రైజ్ రేసులో ఉండడం గర్వకారణం. ఈ క్రమంలో డైసీతో కలిసి పనిచేయడం మరో మధురానుభూతి. నిజానికి ఆమె, నేను ఈ-మెయిల్ ద్వారా మొదటిసారి కలుసుకున్నాం. ఇప్పటిదాకా మేమిద్దరం నేరుగా ఒకరినొకరు కలుసుకుంది లేదు. అయినా మా మధ్య సంభాషణలు, చర్చలు ఎంతో సున్నితంగా జరుగుతుంటాయి. నా ఆలోచనా సరళిని తను బాగా అర్థం చేసుకొని అనువదించే తీరు డైసీలో నాకు బాగా నచ్చే అంశం. రచనలకు సంబంధించి మా మధ్య జరిగే చర్చల్లో కొన్ని అంగీకారాలు, మరికొన్ని భిన్నాభిప్రాయాలు తలెత్తుతుంటాయి. అయినా ఆఖరికి అవుట్పుట్ మాత్రం పక్కాగా వస్తుంది. అందుకు తాజా ఉదాహరణే.. నా నవల బుకర్ ప్రైజ్ రేసులో ఉండడం!’ అంటున్నారు గీతాంజలి.
ఇక అమెరికాకు చెందిన డైసీ రచయిత్రిగా, అనువాదకురాలిగా, పెయింటర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. హిందీ, ఉర్దూ సాహిత్యాన్ని ఆంగ్లంలోకి అనువదించడంలో ఆమె దిట్ట.
ఇలా తన రచనా శైలికి గుర్తింపుగా ‘ఇందూ శర్మ కథా సమ్మాన్’ పురస్కారం అందుకున్న గీతాంజలి.. భారత సాంస్కృతిక శాఖ, జపాన్ ఫౌండేషన్ నుంచి ఫెలోషిప్స్ దక్కించుకున్నారు. ఇలా రచనలతోనే కాకుండా.. ‘Vivadi’ అనే నాటక రంగ సంస్థతో కలిసి పనిచేసిన అనుభవం కూడా ఆమెకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- Summer Tips: జిడ్డు సమస్యా?
- నిమ్మతో నిగనిగలాడే అందం..!
- బేబీ హెయిర్ దాచేద్దాం!
- వీపు మీద పొక్కులా..?
- Samantha: పెళ్లి గౌనుని రీసైక్లింగ్ చేయించా.. ఇదంటే ఎంతో ఇష్టం!
ఆరోగ్యమస్తు
- పంటి నొప్పికి ఎలాంటి చికిత్స అవసరం?
- వేసవిలో ఈ పండ్లు తింటున్నారా?
- ప్రొటీన్ పౌడర్ తాగుతున్నారా?
- వైట్డిశ్చార్జ్ అవుతుంటే..!
- నడక నేర్చుకుంటూనే!
అనుబంధం
- నువ్వే సర్వస్వం అన్నాడు.. అక్కడికెళ్లాక మాట మార్చాడు..!
- నాలుగు స్తంభాలాట
- ఆడేద్దామా తొక్కుడు బిళ్ల
- పాట్లక్తో...
- నాన్నంటే భయపడుతున్నారు..!
యూత్ కార్నర్
- Love Brain Disorder: బాయ్ఫ్రెండ్కు వందసార్లు ఫోన్ చేసింది.. చివరికి ఏమైందంటే?!
- అక్కడ ఛాంపియన్లని తయారుచేస్తారు!
- డూడుల్ డబ్బా అదిరిందబ్బా!
- Mrunal Thakur: అప్పుడే పెళ్లి చేసుకుంటా.. భవిష్యత్తులో నేనూ దీనికి రడీ!
- పేదరికాన్ని దాటి... చదువుల్లో మెరిసి!
'స్వీట్' హోం
- ఈ మామిడి పండ్ల ఖరీదెంతో తెలుసా?
- ఆయన మొండితనాన్ని భరించలేకపోతున్నా...
- రాగి పాత్రలు మెరిసేలా..!
- చెక్క ఫ్రిజ్లు వస్తున్నాయి!
- పిల్లల ముందు ఇలా చేస్తున్నారా.. అయితే జాగ్రత్త!
వర్క్ & లైఫ్
- అక్కడ మహిళా ఓటర్లదే హవా!
- Sonam Kapoor: అప్పుడు 32 కిలోలు పెరిగా.. అయినా ఫీలవలేదు!
- విశ్వ సుందరి పోటీలో అరవయ్యేళ్ల అందం..!
- అక్కడ బిడ్డను కంటే రూ. 60 లక్షల బహుమతి!
- థైరాయిడ్తో బరువు పెరిగా...