మనో వైద్యం చేస్తున్నారు

వరుస లాక్‌డౌన్‌లు, సామాజిక దూరం, ఆప్తులను కోల్పోవడం.. ఇవి ఎంతో మందిని మానసికంగా దెబ్బ తీశాయి. శారీరక సమస్యలకు వాట్సాప్‌ నుంచి జూమ్‌ వరకు అన్ని విధానాల్లో సేవలు

Published : 24 Jun 2021 01:27 IST

వరుస లాక్‌డౌన్‌లు, సామాజిక దూరం, ఆప్తులను కోల్పోవడం.. ఇవి ఎంతో మందిని మానసికంగా దెబ్బ తీశాయి. శారీరక సమస్యలకు వాట్సాప్‌ నుంచి జూమ్‌ వరకు అన్ని విధానాల్లో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ విధానాన్నే మానసిక చికిత్సకూ ఉపయోగిద్దామనుకున్నారు సరస్‌ భాస్కర్‌. మానసిక నిపుణులను ఒక వేదికగా అందుబాటులోకి తెచ్చారు.

‘కరోనా ప్రారంభమైనప్పటి నుంచీ ఆన్‌లైన్‌ వేదికగా ఎంతోమంది వైద్యులు సాయానికి ముందుకొచ్చారు. ప్రతి ఒక్కరూ రోగనిరోధక శక్తిని పెంచుకోవడం, వ్యక్తిగత, పరిసరాల శుభ్రతపై దృష్టిపెట్టారు. కానీ తగ్గిపోతున్న సైకలాజికల్‌ ఇమ్యూనిటీ సంగతేంటి?’ అంటారు సరస్‌ భాస్కర్‌. ఈమె చెన్నైలో కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌. వరుస లాక్‌డౌన్‌లు, సామాజిక దూరం వంటివి విద్యార్థులు సహా ఎంతో మందిపై నెగెటివ్‌ ప్రభావం చూపుతున్నాయంటున్నారు. ఆప్తులను కోల్పోయిన వారి విషయంలో పరిస్థితి మరీ దిగజారడం ఆమె గమనించారు. అలాంటి వారికి సాయం అందించాలనుకున్నారు. ఆన్‌లైన్‌ విధానాన్ని ఉపయోగించాలనుకున్నారు. ఆవిడ గతంలో చెన్నై కౌన్సెలర్స్‌ ఫౌండేషన్‌ (సీసీఎఫ్‌)ను స్థాపించారు. దీనిలో వివిధ రకాల మానసిక నిపుణులు ఉంటారు. వారి సాయంతో ఉచితంగా సేవలను అందించాలనుకున్నారు. తన ఆలోచనను వారి ముందుంచగా 25 మంది ముందుకొచ్చారు. దీనికి ‘లెట్స్‌ టాక్‌’ అని పేరు పెట్టారు. ఇంగ్లిష్‌, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉందిది. ఏ వయసు వారైనా సంప్రదించవచ్చు. ఒక్కొక్కరికీ 30-45 నిమిషాల వరకూ కేటాయిస్తారు. నచ్చిన భాషనూ ఎంచుకోవచ్చు. మొదట మానసిక స్థితిపై పరీక్ష నిర్వహించి, తర్వాత కౌన్సెలర్‌తో మాట్లాడిస్తారు.

మొదటి లాక్‌డౌన్‌ సమయంలోనూ వీరు ఉచిత సేవలను అందించారు. కానీ సెకండ్‌ వేవ్‌లో పరిస్థితి మరీ దిగజారడంతో ఒక వేదికగా ప్రయత్నిస్తే ఎక్కువ మందికి సేవలందించొచ్చని భావించారు. ‘చాలామందిలో ఒత్తిడి, ఆందోళన, బాధ ఎక్కువ అయ్యాయి. ఆర్థిక ఇబ్బందులు, భవిష్యత్‌పై భయం, మెడికల్‌ ట్రామా మానసికంగా కుంగదీస్తున్నాయి. ఆప్తులను కోల్పోయిన వాళ్లు ఆ బాధ నుంచి బయటపడ లేకపోతున్నారు. ఇలాంటి వారికి ఇప్పుడే చికిత్సనందించాలి. లేదంటే సమస్య మరింత జఠిలమవుతుంది. అందుకే ఇలా ముందుకొచ్చాం. మొదట మేం వాళ్ల సమస్యని వింటాం. ఆ తర్వాతే వ్యక్తిగత చికిత్సను ప్లాన్‌ చేస్తాం. అవసరమైతే ప్రత్యేకంగా కొన్ని సెషన్లనూ నిర్వహిస్తాం’ అంటారు సరస్‌. ఆగస్టు 10 వరకూ ఉదయం 7 గం. నుంచి రాత్రి 7 గం. వీరి సేవలు అందుబాటులో ఉంటాయి. తరువాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామంటున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్