సేవే ఆమెకు సాంత్వన...

ఓ ప్రమాదంలో అన్నని కోల్పోయింది. అతను పోయినా తన ఆశయాన్ని మాత్రం బతికించాలనుకుంది. అందుకోసం స్వచ్ఛంద సంస్థని నెలకొల్పింది. నాన్నకి పక్షవాతం, ఆపై అమ్మ మరణం... వరుసగా ఆమె మనోధైర్యాన్ని దెబ్బతీశాయి. అయినా తట్టుకుని నిలబడి ముందుకు సాగుతోంది. ఆమే శ్వేతా మషివల్‌. ఆమె సేవా ప్రయాణమిది.

Published : 10 Jul 2021 00:48 IST

ఓ ప్రమాదంలో అన్నని కోల్పోయింది. అతను పోయినా తన ఆశయాన్ని మాత్రం బతికించాలనుకుంది. అందుకోసం స్వచ్ఛంద సంస్థని నెలకొల్పింది. నాన్నకి పక్షవాతం, ఆపై అమ్మ మరణం... వరుసగా ఆమె మనోధైర్యాన్ని దెబ్బతీశాయి. అయినా తట్టుకుని నిలబడి ముందుకు సాగుతోంది. ఆమే శ్వేతా మషివల్‌. ఆమె సేవా ప్రయాణమిది.

శ్వేత చరిత్రలో డిగ్రీతోపాటు మీడియా మేనేజ్‌మెంట్‌నూ పూర్తిచేసింది. ముంబయిలో కమర్షియల్‌ ఫిల్మ్‌ మేకింగ్‌, అడ్వర్టైజ్‌మెంట్లు తీసేది. మంచి జీతం, నచ్చిన కొలువు.. ఆమె ఆనందానికి అవధుల్లేవు. 2011 ఫిబ్రవరిలో ఒకరోజు అకస్మాత్తుగా తన అన్న సుదీప్‌ ప్రమాదంలో చనిపోయాడు. దాంతో అమ్మా నాన్నలు కుంగిపోయారు. అది చూసి శ్వేత తట్టుకోలేక పోయింది. వాళ్లిద్దరినీ చూసుకుంటూ కొద్దిరోజులు గడిపింది. సోదరుడి కోసం ఏదైనా చేయాలనుకుంది.  
శ్వేతది ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌ దగ్గర రామ్‌నగర్‌. అక్కడ చాలా గ్రామాలు కొండ ప్రాంతాల్లో ఉంటాయి. ‘మన వాళ్లకు విద్య, వైద్య అవసరాలు అందించాలి’ అని సుదీప్‌ ఎప్పుడూ అనే మాటలు గుర్తొచ్చాయి. ఆ ఆశయ సాధన కోసం జులై 2011లో ‘వత్సల్‌ ఫౌండేషన్‌’ను ఏర్పాటు చేసింది. గ్రామాల్లో హెల్త్‌ క్యాంప్‌లను నిర్వహించాలనుకుంది. కానీ అక్కడ వరదలొచ్చాయి. దాన్ని పక్కనపెట్టి ఏనుగుల సాయంతో అక్కడి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. వారికి ఆరోగ్య పరీక్షలను నిర్వహించి, అవసరార్థులకు వైద్య సాయం అందించింది. అలా ఏడాదిలో 12 క్యాంప్‌లను నిర్వహించింది. స్థానికంగా కొందరు ఆమె చేసేవాటిని అడ్డుకోవడం మొదలుపెట్టారు. కానీ అవేమీ పట్టించుకోలేదు. అక్కడే వసతులు సరిగాలేని  స్కూళ్లను దత్తత తీసుకునేది. ఫర్నిచర్‌, టాయ్‌లెట్లు, పుస్తకాలు, యూనిఫాంలు, వాటర్‌ ఫిల్టర్‌, స్పోర్ట్స్‌ కిట్‌లు వంటివి సమకూర్చేది. అలా ఇప్పటి వరకూ పదుల కొద్దీ పాఠశాలలను అభివృద్ధి చేసింది. కొన్నింటిలో లైబ్రరీలనూ నెలకొల్పింది. పేద విద్యార్థులకు ఉపకారవేతనాలనూ అందిస్తోంది.

తరువాత శ్వేత తండ్రికి పక్షవాతం వచ్చింది. చాలా క్లిష్టమైన సర్జరీ తర్వాత ప్రాణం నిలిచింది. ఇంతలో తల్లికి క్యాన్సర్‌ అని తేలింది. ఆమెను బతికించడం వైద్యులకు సాధ్యం కాలేదు. వరసగా తగులుతున్న ఈ దెబ్బలకు శ్వేత డిప్రెషన్‌కు గురైంది. కానీ తనకు తాను ధైర్యం చెప్పుకుంటూ దాన్నుంచి బయటపడింది. అప్పట్నుంచి రోగులకు వైద్య సాయమే కాకుండా, వారిని ఆనందంగా ఉంచడంపైనా దృష్టిపెట్టింది. కరోనా సమయంలో ఆహార పదార్థాలు, సరకులు, మందులు, ఆక్సీమీటర్లు, ఆక్సిజన్‌ సిలిండర్ల సరఫరా, ఆసుపత్రుల్లో పడకల ఏర్పాటు వంటివి చేసింది. ఎయిమ్స్‌, రిషికేష్‌ వైద్యులతో ఒప్పందం చేసుకుని టెలిమెడిసిన్‌ అందించింది. వేరే ప్రాంతాల్లో ఇరుక్కుపోయిన 12,000 మంది వలస కూలీలు ఉత్తరాఖండ్‌కు తిరిగి వచ్చేలా సాయమందించింది. శ్వేత.. పిల్లలు, మహిళలపై హింసకు వ్యతిరేకంగానూ పనిచేస్తోంది. ముంబయిలో ఉద్యోగం చేస్తూనే సేవా కార్యక్రమాలూ చూసుకుంటున్న శ్వేత జీవితం స్ఫూర్తిదాయకం కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్