చేయీ చేయీ కలిపారు చేయూతనిస్తున్నారు

మంచి ఉద్యోగాలు, వృత్తుల్లో ఉన్నారు... అయినా ఆ అమ్మల మనసుల్లో వెలితి. మనం బాగుండటమే కాదు... చుట్టూ ఉన్న నిస్సహాయుల కన్నీళ్లు తుడిచి, సంతోషంగా ఉంచాలనుకున్నారు. చేయీ చేయీ కలిపారు...

Updated : 25 Nov 2021 05:28 IST

మంచి ఉద్యోగాలు, వృత్తుల్లో ఉన్నారు... అయినా ఆ అమ్మల మనసుల్లో వెలితి. మనం బాగుండటమే కాదు... చుట్టూ ఉన్న నిస్సహాయుల కన్నీళ్లు తుడిచి, సంతోషంగా ఉంచాలనుకున్నారు. చేయీ చేయీ కలిపారు... వైద్యశిబిరాలు, విద్యాదానం... ఒకటనేంటి... ఆపద, అవసరం ఏదైనా ఆపన్న హస్తం అందిస్తున్నారు. సొంత నిధులతోనే సాయమందిస్తున్నారు. నెల్లూరు జిల్లా గూడూరు ఆంధ్ర మహిళా మండలి స్ఫూర్తి ప్రస్థానమిది!

పేద మహిళలకు ఆర్థిక, ఆరోగ్య చేయూతనివ్వడం, పేదపిల్లలకు విద్య, దృష్టికి వచ్చిన పౌరసమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారీ మహిళామణులు. మహిళా మండలి అంటే వందల మంది అనుకుంటారేమో... అంతా కలిపి 50 లోపే. ఈ మండలి 1946లో గాలి ఆదెమ్మ అధ్యక్షతన 11 మందితో ప్రారంభమైంది. 1955 నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నా గౌరవాధ్యక్షురాలు డాక్టర్‌ చెరుకూరి రోహిణి ఆధ్వర్యంలో పదేళ్లుగా బాగా ఊపందుకున్నాయి. అధ్యక్షురాలు ఇంద్రసేనమ్మ, కార్యదర్శి మాగుంట విష్ణువందన నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. చెరుకూరి రోహిణి, మైథిలి, తనుజా, జయలక్ష్మి, సుగుణ వైద్యులు... పరంజ్యోతి, శశికళలు విశ్రాంత ఉపాధ్యాయులు. సభ్యుల్లో కొందరు బ్యాంకు ఉద్యోగులు, చిన్నతరహా పారిశ్రామికవేత్తలు, మిగిలిన వారు గృహిణులు. వీరు ఎవరి విరాళాలూ తీసుకోరు.

తొలి ప్రాధాన్యం విద్యకే... గూడూరు పట్టణంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలకూ ఆర్థిక సాయం అందించి మౌలిక వసతులు కల్పించారు. గ్రంథాలయాల నిర్మాణం నుంచి పుస్తకాలు వరకు అన్ని అవసరాలూ వీరే చూసుకున్నారు. దీనిపై రూ.50 లక్షలకు పైగా వెచ్చించారు. ఇంకా బాలసదనంలోని వసతుల కల్పన, వసతిగృహాల విద్యార్థులకు అవసరమైన సామగ్రినీ ఇస్తున్నారు. సరస్వతి శిశు మందిరం, ఇతర ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకీ విద్యాసామగ్రిని అందించారు. పేద, అనాథ పిల్లల్ని అక్కున చేర్చుకొని చదివిస్తున్నారు. వారి ఉన్నత చదువులకు ఫీజులు చెల్లిస్తున్నారు. అలా గత ఏడేళ్లలో 30 మందిని చదివించారు. వీరి ఫీజుల కోసమే రూ.10 లక్షలకు పైగా ఖర్చు చేశారు.

ప్రతి నెలా 3 ఆదివారాలు గూడూరు, చుట్టుపక్కల గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఉచితంగా మందులతోపాటు శస్త్రచికిత్సలూ చేయిస్తున్నారు. పేద మహిళలకు డాక్టర్‌ సీఆర్‌రెడ్డి ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు చేయిస్తున్నారు. తమ పరిధిలో లేని చికిత్సలకు ఆర్థికసాయం చేస్తున్నారు. ప్రతి నెలా 25 నుంచి 30 మంది పేద గర్భిణులకు శ్రీమంతాలు చేసి పోషకాహారం ఇస్తుంటారు. అయిదేళ్లుగా ఎయిడ్స్‌ దినోత్సవం రోజున రూ.50 వేలతో బాధితులకు పౌష్టికాహారం, దుస్తులు, దుప్పట్లు అందజేస్తున్నారు.


వీలైనంత చేయూత నివ్వాలని...

వీలైనంత మంది పేదలను, ముఖ్యంగా మహిళలను ఆదుకోవాలనేదే మా తాపత్రయం. కష్టాలు తీరిన వారు చూపే ప్రేమానురాగాలు సంతృప్తినిస్తాయి. సభ్యులందరం చర్చించుకొని ప్రణాళికను రూపొందించుకుంటాం. బాధ్యతలూ పంచుకుంటాం. నిధులను సభ్యులే సమకూర్చుకుంటాం. మహిళలం కలసి కృషి చేస్తే సమాజానికి ఎంతో చేయవచ్చన్నది మా విశ్వాసం. దాన్నే ఆచరణలో చూపుతున్నాం.

- డాక్టర్‌ చెరుకూరి రోహిణి


మహిళల ఆర్థికాభివృద్ధికీ... మహిళ ఆర్థికాభివృద్ధితో ఆ కుటుంబమూ పురోగతి సాధిస్తుందని నమ్ముతారు వీరు. అందుకే టైలరింగ్‌లో ఉచిత శిక్షణతోపాటు ఏటా 50 మందికి కుట్టుమిషిన్లూ అందిస్తున్నారు. కరోనా సమయంలో వలస కార్మికులకు ఆహారం, మందులు, సొంతూళ్లకు పంపేందుకు వాహనాలను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.లక్ష విరాళమిచ్చారు. ఉపాధి కోల్పోయిన వందల మంది ఆకలీ కొన్ని నెలల పాటు తీర్చారు. దివ్యాంగుల ఆధ్వర్యంలోని ‘రెడ్‌’ సంస్థ స్థిరనిధికి రూ.లక్ష ఆర్థిక సాయంతోపాటు అయిదేళ్లుగా ప్రతి నెలా సరకులూ ఇస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రాంతాల్లో బెంచీలు, మొక్కలు నాటడం, పార్కుల సుందరీకరణ చేపట్టారు. వేసవిలో చలి వేంద్రాలు ఏర్పాటు చేసి మజ్జిగ, తాగునీరు అందిస్తుంటారు.

- దొంతు వెంకటేశ్వర్లు, గూడూరు 

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్