కలలను వెలిగిస్తోంది...కళలను బతికిస్తోంది

మనుషులుండే ఊళ్ల గురించి మనకు తెలుసు.. కానీ ఊరంతా బొమ్మలే ఉండే ఈ ముచ్చట తెలుసా? ఇక్కడ అడుగుపెట్టాక ఏది బొమ్మో... ఏది నిజమో తెలుసుకోవడానికి కాస్త సమయం పడుతుంది ఎవరికైనా! ఏటా లక్షలమంది వీక్షించే ఈ ఆధునిక మాయాబజార్‌ పేరు

Published : 08 Apr 2022 05:46 IST


వేదరాణి

మనుషులుండే ఊళ్ల గురించి మనకు తెలుసు.. కానీ ఊరంతా బొమ్మలే ఉండే ఈ ముచ్చట తెలుసా? ఇక్కడ అడుగుపెట్టాక ఏది బొమ్మో... ఏది నిజమో తెలుసుకోవడానికి కాస్త సమయం పడుతుంది ఎవరికైనా! ఏటా లక్షలమంది వీక్షించే ఈ ఆధునిక మాయాబజార్‌ పేరు ‘ఉత్సవ్‌ రాక్‌ గార్డెన్‌’. కర్ణాటకలోని ఈ కళామ్యూజియంకి క్యూరేటర్‌గా వందలమంది కళాకారులకు ఉపాధినిస్తున్నారు వేదరాణి దసనూరు...

ఉత్సవ్‌రాక్‌ గార్డెన్‌... ఇది పేరుకే గార్డెన్‌. చూడ్డానికి పెద్ద ఊరంత ఉంటుందీ మ్యూజియం. కర్ణాటకలోని హవేరీ జిల్లా గోటగోడిలో ఉన్న బొమ్మల ఊర్లో.. ఎన్నో విశేషాలుంటాయి. అన్నింటికీ మించి మన పల్లెజీవితం, భారతీయ సంస్కృతిని తెలిపే బొమ్మలు అచ్చంగా నిజమేనా అనేలా ఉంటాయి. ఈ ఉత్సవ్‌రాక్‌గార్డెన్‌ రూపకర్త డా.టి.బి.సొలబక్కనవర్‌. ‘డబ్బు కడుపు నింపుతుంది. కళ హృదయాన్ని నింపుతుంది’ అని బలంగా నమ్మిన కళాకారుడాయన. కర్ణాటకలోని దావణగెరె లలిత కళాశాలలో ఆచార్యులుగా పనిచేసేవారు. కళారంగ సేవకు అడ్డుగా ఉందని ఆ ఉద్యోగాన్నే వదులుకున్నారాయన. ఆ ఆశయాలని వారసత్వంగా అందుకున్న ఆయన కూతురు వేదరాణి కూడా కళాశాలలో చేస్తున్న ఉద్యోగాన్ని కాదనుకున్నారు. 2009 నుంచి ఉత్సవ్‌ రాక్‌గార్డెన్‌ బాధ్యతలు తీసుకుని దేశం దృష్టిపడేలా తీర్చిదిద్దుతున్నారు. దాంతోపాటు కళాకారులని బతికించే బృహత్తర బాధ్యతనీ భుజానికెత్తుకున్నారు. కర్ణాటకలోని హుబ్బళ్లి వేదరాణి స్వస్థలం. ఎంఏ ఇంగ్లిష్‌ చదువుకున్నారు. అంతకంటే ముందే తండ్రి నుంచి అనేక కళానైపుణ్యాలనీ అందుకున్నారు. కానీ తన కూతురు కళాకారిణిగా కాకుండా, కవయిత్రిగా రాణించాలని సొలబక్కనవర్‌ భావించారు. దానికీ కారణం ఉంది. చిన్నవయసులో కర్ణాటక యువ సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారామె. కానీ వేదరాణి లక్ష్యం వేరు. తండ్రి బోధించే కళాశాలలో చదివిన వాళ్లు కేవలం సిద్ధాంత పరంగా కళను అధ్యయనం చేస్తున్నారు. అందుకే కళారూపాలకు సజీవత్వాన్ని అందించటంలో వెనుకబడుతున్నారని గుర్తించిన ఆమె భర్త ప్రకాష్‌ దసనూరుతో కలిసి కళని బతికించడం కోసం ఉత్సవ్‌రాక్‌ గార్డెన్‌ సమితి అనే సంస్థ ఏర్పాటు చేశారు.

ప్రతి నెలా వేతనం... ఫైన్‌ఆర్ట్స్‌ విద్యార్థులు లేదా కళలో ఆసక్తి ఉన్నవారు ఎవరైనా ఈ సంస్థలో ఆరు నెలల పాటు స్టైపెండ్‌ తీసుకుంటూ, శిక్షణ తీసుకోవచ్చు. ఆపై రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే ఆర్ట్‌ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావొచ్చు. ఉత్సవ్‌ రాక్‌గార్డెన్‌ సమితిని ప్రారంభించి కళాకారులకి పని ఉన్నా లేకపోయినా కొంత వేతనాన్ని అందిస్తూ వారికి అండగా ఉంటున్నారు. కరోనా సమయంలోనూ ఈ సమితి సభ్యులంతా వేతనాలు అందుకున్నారు. ఇంతవరకూ 600 మంది కళాకారులకు అండగా నిలిచారు. కళలను రక్షించేందుకు ఆర్ట్‌ మ్యూజియమ్‌లు, చిత్ర ప్రదర్శనలను నిర్వహించి ఆ కళారూపాల వెనుక ఉన్న కళాకారుల కృషిని ప్రచారం చేస్తారీమె. గ్రాఫిక్‌, డిజిటల్‌ సాంకేతికతకు చోటివ్వకుండా అచ్చంగా కళాకారుల చేతి నుంచి జాలువారిన రూపాలకే పెద్దపీట వేస్తూ, ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. రాక్‌గార్డెన్‌లో కూడా గ్రామీణ వాతావరణం, ఉమ్మడి కుటుంబ నేపథ్యం, జానపద, నృత్య కళారూపాలకే ప్రాధాన్యత ఇస్తుంటారామె. భారతీయ శిల్ప కళా సౌందర్యానికి మరింత వన్నెలద్దేందుకు ఆమె లండన్‌, స్పెయిన్‌, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోని మ్యూజియమ్‌లను సందర్శించారు. ‘మన కళారూపాలను కోట్ల రూపాయలు వెచ్చించి కొనే విదేశీయులకు కొదవ లేదు. విదేశీ కళా మ్యూజియంలలో దాదాపు 30శాతం కళారూపాలకు భారతీయ ప్రాచీన కళలే స్ఫూర్తి’ అనే వేదరాణి త్వరలో తల్లీబిడ్డల స్ఫూర్తితో ప్రదర్శన చేయనున్నారు. ఇందుకోసం 200మంది కళాకారులని ఎంపిక చేస్తున్నారు. లాభాపేక్ష లేకుండా కళల రక్షణ కోసం పని చేస్తున్న వేదరాణి సేవలను గుర్తించిన కర్ణాటక ప్రభుత్వం ‘రాజ్యోత్సవ’ పురస్కారంతో సత్కరించింది.

-కె.ముకుంద, బెంగళూరు
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్