చదువు అయిదో తరగతి.. వ్యాపారం రూ.450 కోట్లు!

పల్లెటూరి అమ్మాయి.. కొత్త ప్రదేశానికి వెళ్లి.. అక్కడి భాష నేర్చుకొని వ్యాపారవేత్తగా ఎదిగింది. వినగానే సినిమా కథలా ఉంది కదూ! కానీ ఇది రత్నారెడ్డి జీవితం. అయిదో తరగతి చదివిన ఆమె వ్యాపారం ఇప్పుడు రూ.450 కోట్లు. అంతే కాదు... సంపాదనలో సగం సమాజానికంటూ విద్య, వైద్య పరంగా వేలమందికి సాయం చేస్తున్నారీ దయామూర్తి. సేంద్రియ వ్యవసాయం, యువతకు స్ఫూర్తి పాఠాలు.. చెప్పుకుంటూ పోతే ఆమె ఖాతాలో మరెన్నో!

Published : 09 Jun 2022 18:35 IST

పల్లెటూరి అమ్మాయి.. కొత్త ప్రదేశానికి వెళ్లి.. అక్కడి భాష నేర్చుకొని వ్యాపారవేత్తగా ఎదిగింది. వినగానే సినిమా కథలా ఉంది కదూ! కానీ ఇది రత్నారెడ్డి జీవితం. అయిదో తరగతి చదివిన ఆమె వ్యాపారం ఇప్పుడు రూ.450 కోట్లు. అంతే కాదు... సంపాదనలో సగం సమాజానికంటూ విద్య, వైద్య పరంగా వేలమందికి సాయం చేస్తున్నారీ దయామూర్తి. సేంద్రియ వ్యవసాయం, యువతకు స్ఫూర్తి పాఠాలు.. చెప్పుకుంటూ పోతే ఆమె ఖాతాలో మరెన్నో!

త్నారెడ్డిది చిత్తూరు జిల్లా కొలమాసనపల్లె. చదివింది అయిదో తరగతి. 1964లో మెకానికల్‌ ఇంజినీర్‌ గంగిరెడ్డితో వివాహమైంది. ఆయనకు ఒడిశాలోని రవుర్కెలా స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగం. అక్కడ అందరూ హిందీ, ఒడియా లేదంటే ఇంగ్లిష్‌ మాట్లాడేవారే! ఆవిడకేమో తెలుగు, తమిళం మాత్రమే వచ్చు. దీంతో కూరగాయలకూ ఇతరులపై ఆధారపడాల్సిందే. మూడేళ్లు గడప దాటడమూ కష్టమైంది. తెలుగు నుంచి ఇతర భాషలు నేర్చుకునే పుస్తకాలు తెప్పించుకొని హిందీ, ఒడియా, ఇంగ్లిష్‌, బెంగాలీ భాషలు నేర్చుకున్నారు. టైలరింగ్‌, ఎంబ్రాయిడరీ వంటివి ముందే వచ్చు. చుట్టుపక్కల వారికి నేర్పడంతోపాటు ఆర్డర్లు తీసుకొని సంస్థలకు కుట్టివ్వడం మొదలుపెట్టారు. ఊహించని లాభాలొచ్చాయి. ఓసారి ఆవిడ స్వస్థలంలో విద్యార్థులు పైచదువులకు పక్క ఊళ్లకు వెళ్లాల్సి రావడం చూశారు. ‘ఇప్పుడు నాకు డబ్బుంది. కానీ చదువు లేక చాలా ఇబ్బందిపడ్డా. మా ఊరివాళ్లకి ఆ పరిస్థితి తప్పించాలనుకున్నా’అని చెబుతారు రత్నారెడ్డి.

వ్యాపారంలో లాభాలు, పొలం, బంగారం అమ్మగా వచ్చిన మొత్తంతో పలమనేరులో పన్నెండున్నర ఎకరాల్లో 1983లో డిగ్రీ కళాశాలను కట్టించారు. తండ్రి సాయం కోరగా రూ.లక్షన్నర డిపాజిట్‌ చేశారు. దాన్ని మూడు గదులతో మొదలుపెట్టి విస్తరిస్తూ వచ్చారు. 1985లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్‌ను కలిసి ప్రభుత్వ గుర్తింపునూ సాధించారు. 12 ఏళ్లు ఒడిశా, రెండేళ్లు జర్మనీలో ఉన్న తర్వాత మద్రాస్‌ చేరుకున్నారు.  120 మందితో 1998లో హోసూరు(తమిళనాడు)లో ‘రత్న ప్యాకేజింగ్‌’ ప్రారంభించారు. వీళ్ల వస్త్రాలు విదేశాలకూ ఎగుమతి అయ్యేవి. గంగిరెడ్డి పదవీ విరమణయ్యాక సొంతూరుకు చేరుకున్నారు. ఈవిడకి ఆయుర్వేదం తెలుసు. అయిదుగురు తాతలకు ఒక్కతే మనవరాలు. దీంతో వాళ్లకు తెలిసిన గుర్రపుస్వారీ, ఈత, ఆయుర్వేదం, వాహనాలు నడపడం, గన్‌ షూటింగ్‌ వంటివి ఈమెకు చిన్నతనంలోనే నేర్పారు. ఒడిశా, చెన్నైల్లో ఉన్నప్పుడూ ఆవిడ చుట్టుపక్కల వాళ్లకి ఆయుర్వేద వైద్యం చేసేవారు. సొంతూరుకొచ్చాక చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుండటం చూసి రూ.10 కోట్లతో 2006లో ‘రత్నా బయోటెక్‌’ ప్రారంభించారు. అప్పటికి ఆమె వయసు 62 ఏళ్లు. తమ పొలంలో ఔషధ మొక్కలు పెంచుతూ.. నిపుణులను నియమించుకుని ఆయుర్వేద ఔషధాలు ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. సుమారు 40 రకాల ఆయుర్వేద ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. స్వగ్రామంలో 25 పడకల ఆయుర్వేద ఆసుపత్రి నెలకొల్పారు. ఔషధాల ఖర్చు మాత్రమే రోగుల నుంచి తీసుకుంటారు. అదీ ఇవ్వలేని వారికి ఉచిత వైద్యమే. కొడుకు ఆధ్వర్యంలో ఈమె మరికొన్ని సంస్థలూ మొదలుపెట్టారు. ఇప్పుడు వాటన్నింటి టర్నోవరు రూ.450 కోట్లు.

ఉచితంగా విద్య... ‘ఆదాయంలో 50 శాతం సమాజ సేవకు’ ఇదీ రత్నారెడ్డి నియమం. అందుకే... 300కుపైగా గుళ్లు కట్టించారు. ఇంటర్‌లో 95 శాతంపైగా మార్కులు సాధించిన పేదలకి కోరుకున్న విద్య ఉచితంగా చదివిస్తున్నారు. చదువుకొని ఖాళీగా ఉన్నవారికి కొలువు చూపిస్తారు. సేంద్రియ వ్యవసాయమూ చేస్తున్నారు. ఇప్పుడామె వయసు 78. అయినా వ్యవసాయ కార్యక్రమాల్లో భాగంగా దేశమంతా పర్యటిస్తుంటారు. 2016లో నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ ఆంత్రప్రెన్యూర్‌ డెవలప్‌మెంట్‌ (ఎన్‌ఎఫ్‌ఈడీ) నుంచి రత్నారెడ్డి జాతీయ ఉత్తమ మహిళా పారిశ్రామికవేత్త అవార్డు అందుకున్నారు. 2007లో శ్రీ పద్ధతిలో వరిలో అత్యధిక దిగుబడులు సాధించి ఉత్తమ మహిళా రైతుగా ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా కళాశాలల్లో మోటివేషనల్‌ స్పీచ్‌లు ఇస్తుంటారు. రత్నారెడ్డి పిల్లల్నీ పెద్ద చదువులు చదివించారు. అబ్బాయి హోసూరులో వ్యాపారాల్ని చూసుకుంటున్నాడు. పెద్దమ్మాయి ఆయుర్వేద వైద్యురాలు, చిన్నమ్మాయి బిట్స్‌ పిలానీ నుంచి ఆర్కిటెక్చర్‌ చేసింది. ‘నా ద్వారా సాయం పొందిన వాళ్ల నుంచి నేను ఆశించేది ఏమీలేదు. వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడి కుటుంబాలను బాగా చూసుకుంటే చాలు’ అని అంటారామె.


‘మాది వెనకబడిన ప్రాంతం. చదువుకుంటే కుటుంబాలు బాగుపడతాయని ఆశ. కాలేజీ ద్వారానే కాక సొంతంగా 2000 మందిని చదివించా. మా కాలేజీ ద్వారా 50 వేల మంది చదువుకున్నారని చెబుతుంటారు. కేరళ, బంగాల్‌ల్లోలా మనమూ విద్యపరంగా ముందుండాలన్నది నా కోరిక. డబ్బు, విద్య, ధైర్యానికి దేవతల్ని పూజిస్తాం. నదులూ ఆడవాళ్ల పేర్లే. శక్తి స్వరూపాలకు ప్రతిరూపాలు. వాళ్లు తలచుకుంటే ప్రపంచాన్నే ఏలగలరు. అందుకే చదువుకోమనీ, సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాలనీ చెబుతుంటా’

- బి.ప్రతాప్‌రెడ్డి, చిత్తూరు

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్