నూరేళ్ల బంధం ఎందుకు వీగిపోతోంది?

పెళ్లిళ్లు స్వర్గంలోనే నిశ్చయమవుతాయంటారు.. కానీ కలకాలం కలిసుండి ఆ బంధాన్ని శాశ్వతంగా నిలుపుకోవాల్సిన బాధ్యత మాత్రం దంపతుల చేతుల్లోనే ఉంటుంది. అయితే ప్రస్తుత కాలంలో కొందరు దంపతుల సంసార నావ కొన్నేళ్ల పాటు బాగానే సాగినా.. ఆ తర్వాత పలు కారణాలతో మధ్యలోనే తమ బంధానికి స్వస్తి పలుకుతున్నారు.

Updated : 04 Oct 2021 16:47 IST

పెళ్లిళ్లు స్వర్గంలోనే నిశ్చయమవుతాయంటారు.. కానీ కలకాలం కలిసుండి ఆ బంధాన్ని శాశ్వతంగా నిలుపుకోవాల్సిన బాధ్యత మాత్రం దంపతుల చేతుల్లోనే ఉంటుంది. అయితే ప్రస్తుత కాలంలో కొందరు దంపతుల సంసార నావ కొన్నేళ్ల పాటు బాగానే సాగినా.. ఆ తర్వాత పలు కారణాలతో మధ్యలోనే తమ బంధానికి స్వస్తి పలుకుతున్నారు. ఇద్దరి మధ్య వ్యక్తిగత, వృత్తిపరమైన విభేదాలు రావడం, ఒకరిపై ఒకరికి గౌరవం తగ్గి పోవడం, వివాహేతర సంబంధాలు.. ఇలా వైవాహిక బంధం మధ్యలోనే వీగిపోవడానికి కారణాలెన్నో..!
ఇలా సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు కూడా విడాకుల కోసం కోర్టు మెట్లెక్కుతున్నారు. దాంపత్య బంధంలో ఉన్నంత సేపు రిలేషన్‌షిప్‌ గోల్స్‌ నేర్పించిన కొన్ని ప్రముఖ జంటలు.. ఒక్కసారిగా తాము విడిపోతున్నామంటూ ప్రకటించి తమ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌ మోస్ట్‌ రొమాంటిక్ కపుల్‌గా గుర్తింపు తెచ్చుకున్న సమంత- నాగ చైతన్య విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పదేళ్ల ప్రేమ బంధం, నాలుగేళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా పంచుకుని తమ అభిమానుల్ని తీవ్ర విస్మయానికి గురిచేశారు. ఈ నేపథ్యంలో ఇకపై కలిసుండలేమంటూ విడిపోయిన కొన్ని సెలబ్రిటీ జంటల గురించి తెలుసుకుందాం..

సమంత - నాగ చైతన్య

‘చై-సామ్‌’ల వైవాహిక జీవితంపై గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న వార్తలు నిజమయ్యాయి. తాము విడాకులు తీసుకోనున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు నాగచైతన్య, సమంత. ‘ఇక నుంచి మేం దూరంగా ఉండాలనుకుంటున్నాం. ఎన్నో చర్చలు, ఆలోచనల తర్వాత విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇక నుంచి వేర్వేరుగా మా సొంత మార్గాల్లో ప్రయాణించాలనుకుంటున్నాం. దశాబ్దానికి పైగా మా స్నేహం కొనసాగినందుకు మేం ఎంతో అదృష్టవంతులం. ఇది మా రిలేషన్‌షిప్‌కు చాలా కీలకంగా నిలిచింది. ఇప్పుడీ కష్ట సమయంలో మీ అందరి మద్దతు కావాలి. మా ప్రైవసీని కాపాడి, వేర్వేరుగా ముందుకు సాగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని సామ్‌, చైతు రాసుకొచ్చారు.

అలా ‘మజిలీ’ ముగిసింది!

‘చై-సామ్‌’... వెండితెర పైనే కాదు అభిమానుల్లోనూ ఈ పేరుకు ఎంతో క్రేజ్‌ ఉంది. 2009లో వచ్చిన ‘ఏ మాయ చేసావె’ సినిమా సమయంలో సమంత, చైతన్యల మధ్య స్నేహం చిగురించింది. ఆ తర్వాత ప్రేమగా మొగ్గ తొడిగింది. తమ కెరీర్‌లను కొనసాగిస్తూనే పదేళ్ల పాటు ప్రేమలోకంలో విహరించారు. ఇరు పెద్దలు కూడా వీరి ప్రేమను ఆశీర్వదించడంతో 2017 జనవరి 29న ఉంగరాలు మార్చుకున్నారు. అదే ఏడాది అక్టోబర్‌ 6, 7 తేదీల్లో ఏడడుగులు నడిచారు. గోవాలో అంగరంగ వైభవంగా వీరి వివాహ వేడుకలు జరిగాయి. ఇక పెళ్లి తర్వాత ‘చై-సామ్‌’ జోడీకి మరింత క్రేజ్‌ వచ్చింది. సినిమాల్లో కలిసి స్ర్కీన్‌ షేర్‌ చేసుకున్నా, ప్రకటనల్లో నటించినా ఫ్యాన్స్‌ తెగ సంబరపడేవారు. సమంత, చైతన్యలు కూడా తమ వ్యక్తిగత జీవిత విశేషాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో పంచుకునేవారు. టూర్లు, వెకేషన్‌లకు వెళ్లినప్పుడల్లా తమ జంట ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి మురిసిపోయేవారు. అలా టాలీవుడ్‌లో ది మోస్ట్‌ రొమాంటిక్ కపుల్‌గా గుర్తింపు తెచ్చుకున్న చై, సామ్‌ల ‘మజిలీ’ ముగిసిపోయిందని తెలియగానే ఎంతోమంది అభిమానులు నిరాశకు గురయ్యారు.

ఆమిర్‌ ఖాన్‌ - కిరణ్‌ రావ్‌

బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌గా పేరుగాంచిన ఆమిర్‌ ఖాన్‌ - కిరణ్‌ రావ్‌ దంపతులు తమ 15 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు తాజాగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ క్రమంలో ‘తాము తీసుకున్న ఈ నిర్ణయం ముగింపు కాదని.. ఇప్పుడు మా జీవితాల్లో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం..’ అంటూ పేర్కొన్నారు. ఆమిర్‌ మొదటి భార్య రీనా దత్తా నుంచి విడిపోయాక కిరణ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ‘లగాన్‌’ చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వ్యవహరించిన కిరణ్‌తో ప్రేమలో పడిన ఈ కండల వీరుడు.. 2005 డిసెంబర్‌ 28న ఆమెతో ఏడడుగులు వేశాడు. 2011లో ఆజాద్‌ అనే బాబుకి సరోగసీ పద్ధతిలో జన్మనిచ్చారీ బాలీవుడ్‌ కపుల్‌. అయితే తమ బంధం వీగిపోయినా ఒకరికొకరు అండగా నిలబడతామంటూ తాజాగా చెప్పుకొచ్చారు.


బిల్‌గేట్స్‌ - మెలిందా

ప్రజా సేవలోనే సంతోషం, సంతృప్తి వెతుక్కున్నారు ‘బిల్‌ అండ్‌ మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌’ వ్యవస్థాపకులు బిల్‌ గేట్స్‌, మెలిందా. తమ సేవా సంస్థ వేదికగా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి తమ దాతృత్వాన్ని చాటుకున్న ఈ జంట.. తాము విడిపోతున్నట్లు ప్రకటించి అందరినీ విస్మయానికి గురిచేసింది. 27 ఏళ్ల వైవాహిక బంధాన్ని తెంచుకుంటున్నట్లు ట్విట్టర్‌ వేదికగా సంయుక్త ప్రకటన చేశారు బిల్‌, మెలిందా. అయితే దంపతులుగా విడిపోయినంత మాత్రాన సంస్థలో ఇద్దరి భాగస్వామ్యం, ఇతర సేవా కార్యక్రమాలపై ఏమాత్రం ఉండదని, ఇకపైనా కలిసే పనిచేస్తామని చెప్పుకొచ్చారు. వీరికి జెన్నిఫర్‌ క్యాథరిన్‌ గేట్స్‌, ఫోబే అడెలే గేట్స్‌, రోరీ జాన్‌ గేట్స్‌.. అనే ముగ్గురు పిల్లలున్నారు.


దియా మీర్జా- సాహిల్‌ సంఘా..

మరో బాలీవుడ్‌ జంట దియామీర్జా- సాహిల్‌లు.. 2019లో విడాకులు తీసుకుంది. 2009లో ప్రేమలో పడిన ఈ జంట.. 2014లో ఏడడుగులు నడిచి ఒక్కటయ్యారు. ఇక తమ 5 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు సంయుక్త ప్రకటన చేశారు దియా-సాహిల్‌. అయితే తాము విడాకులు తీసుకున్నా.. ఎప్పటికీ స్నేహితుల్లానే ఉంటామని చెప్పుకొచ్చారు. ఇక విడాకుల అనంతరం ముంబయికి చెందిన వ్యాపార వేత్త వైభవ్‌ రేఖిని ఈ ఏడాది ఫిబ్రవరి 15న వివాహం చేసుకుందీ ముద్దుగుమ్మ. ఆ తర్వాత అమ్మగా మాతృత్వ మధురిమలను ఆస్వాదిస్తోంది. ఆ అనుభవాలను తన ఫ్యాన్స్‌తో ఎప్పటికప్పుడు పంచుకుంటూ మురిసిపోతోంది.


మంచు మనోజ్‌- ప్రణతీ రెడ్డి

హీరో మంచు మనోజ్‌-ప్రణతీ రెడ్డి దంపతులు తమ నాలుగేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ 2019లో విడాకులు తీసుకున్నారు. 2015లో పెళ్లి పీటలెక్కిన ఈ జంట.. పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని ప్రకటించారు. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టాడు మనోజ్‌. ‘కలిసి ఉన్నంతకాలం మా ప్రయాణం చాలా ఆనందంగా సాగింది. అయితే కొన్ని విభేదాలు తలెత్తడంతో.. బాగా ఆలోచించి మేమిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. విడిపోయినా.. మాకు ఒకరిపై మరొకరికి గౌరవం అలాగే ఉంటుంది’ అన్నాడీ టాలీవుడ్‌ హీరో.


శ్వేతా బసు ప్రసాద్‌- రోహిత్‌ మిట్టల్‌

‘కొత్త బంగారు లోకం’ సినిమాలో క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో అలరించిన శ్వేతా బసు ప్రసాద్‌ పెళ్లైన ఏడాదిలోపే తన భర్తతో విడాకులు తీసుకుంది. ముంబయికి చెందిన ఫిల్మ్‌ మేకర్‌ రోహిత్‌ మిట్టల్‌తో తన అనుబంధానికి 2018లో ముగింపు పలికిందీ అందాల తార. నాలుగేళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన ఈ జంట 2018 డిసెంబర్‌ 13న పుణే వేదికగా పెళ్లిపీటలెక్కింది. అయితే మొదటి పెళ్లి రోజు జరుపుకోవడానికి మూడు రోజుల ముందే విడిపోతున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిందీ అందాల జంట. ‘పుస్తకంలోని అన్ని పేజీలు చదవకపోయినంత మాత్రాన ఆ పుస్తకం చెడ్డదని కాదు.. కొన్ని విషయాలు అసంపూర్ణంగా ఉంటేనే బాగుంటాయని అనుకుంటున్నా.. నా జీవితంలో మధుర జ్ఞాపకాలను మిగిల్చినందుకు, ఎల్లప్పుడూ నాకు స్ఫూర్తిగా నిలిచినందుకు థ్యాంక్యూ రోహిత్‌’ అని ఇన్‌స్టా వేదికగా తన విడాకుల విషయాన్ని బయటపెట్టిందీ క్యూటీ.


కనికా ధిల్లాన్‌-ప్రకాశ్‌ కోవెలమూడి

సినిమా రంగంలో కొనసాగుతూ పెళ్లి పీటలెక్కిన జంట కనికా ధిల్లాన్‌- ప్రకాశ్‌ కోవెలమూడి. డైరెక్టర్‌గా, స్ర్కీన్‌ప్లే రైటర్‌గా, యాక్టర్‌గా ప్రకాశ్‌ గుర్తింపు పొందగా.. పలు సినిమాలకు కథా రచయితగా, స్ర్కీన్‌ప్లే రైటర్‌గా పని చేసింది కనిక. కొన్నేళ్ల పాటు ప్రేమలో మునిగి తేలి..2014లో ఏడడుగులు నడిచారీ లవ్లీ కపుల్‌. 2019 జులైలో విడుదలైన ‘జడ్జిమెంటల్‌ హై క్యా’ సినిమాకు కలిసి పనిచేసిన ఈ స్వీట్‌ కపుల్‌.. ఆ సినిమా ఇంటర్వ్యూలో భాగంగా తాము 2017లోనే విడిపోయినట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఆ తర్వాత ఫిల్మ్‌ మేకర్‌ హిమాన్షు శర్మతో ఏడడుగులు నడిచింది కనిక.


అర్జున్‌ రాంపాల్‌- మెహ్ర్‌ జెస్సియా

సంసార సాగరంలోని ఒడిదొడుకుల్ని తట్టుకుంటూ 21 ఏళ్ల పాటు కలిసున్నారు బాలీవుడ్‌ కపుల్‌ అర్జున్‌ రాంపాల్‌- మెహ్ర్‌ జెస్సియా. అయితే 2018మేలో తాము విడిపోతున్నట్లు ప్రకటించిన ఈ జంటకు.. ముంబయిలోని బాంద్రా కోర్టు 2019 నవంబర్‌లో అధికారికంగా విడాకులు మంజూరు చేసింది. తద్వారా తమ వైవాహిక బంధానికి శాశ్వతంగా స్వస్తి పలికారీ స్వీట్‌ కపుల్. మోడలింగ్‌తో మొదలైన తమ ప్రేమ ప్రయాణాన్ని 1998లో పెళ్లిపీటలెక్కించిన అర్జున్‌-జెస్సియాకు 2002లో మైరా, 2008లో మహికా అనే ఇద్దరు కూతుళ్లు పుట్టారు. మెహ్ర్‌తో విడిపోయాక అర్జున్‌ దక్షిణాఫ్రికా తార గ్యాబ్రియెల్లాతో ప్రేమలో పడ్డాడు. ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా 2019లో ఆరిక్‌ అనే కొడుకు పుట్టాడు.


జెఫ్‌ బెజోస్‌- మెకంజీ స్కాట్‌

ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్‌ సంస్థగా పేరు పొందిన ‘అమెజాన్‌’ సీఈవో జెఫ్‌ బెజోస్‌, ఆయన సతీమణి మెకంజీ స్కాట్‌ కూడా 2019లో అధికారికంగా విడిపోయారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నులుగా నిరంతరం వార్తల్లో నిలిచే ఈ జంట... తమ పాతికేళ్ల దాంపత్య బంధానికి గుడ్‌బై చెప్పింది. 1993లో ఉద్యోగాన్వేషణలో భాగంగా మెకంజీని జెఫ్‌ ఇంటర్వ్యూ చేయడం.. ఆ పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లి పీటలెక్కారీ లవ్లీ కపుల్‌. వాళ్లిద్దరి దాంపత్య బంధానికి గుర్తుగా నలుగురు పిల్లలు పుట్టారు. ఈ క్రమంలో తానెంతో ప్రేమించే భర్త నుంచి విడిపోవడం వల్ల వచ్చే భారీ భరణం కూడా తనకొద్దని తృణప్రాయంగా వదులుకుంది మెకంజీ. ఇక ఈ ఏడాది డాన్‌ జెవెట్‌ అనే స్కూల్‌ టీచర్‌ని మళ్లీ పెళ్లి చేసుకుందామె.

ఇలా పెళ్లి తర్వాతే కాదు.. నిశ్చితార్థం తర్వాత కూడా వివిధ కారణాల రీత్యా విడిపోతున్నారు కొందరు సెలబ్రిటీలు. తాజాగా మెహ్రీన్‌-భవ్య, గతంలో త్రిష-వరుణ్‌ మణియన్‌, రష్మిక-రక్షిత్‌ శెట్టి, విశాల్‌-అనీషా రెడ్డి, అక్కినేని అఖిల్‌ - శ్రియా భూపాల్‌.. తదితరులు ఎంగేజ్‌మెంట్‌ తర్వాత బ్రేకప్‌ చెప్పి ఎవరి దారి వారు చూసుకున్నారు.

ఈ నేపథ్యంలో- అసలు దంపతుల మధ్య విడాకులకు దారితీసే పరిస్థితులు ఏమిటి?  కొంతమంది విషయంలో నూరేళ్ల దాంపత్య బంధం మధ్యలోనే ఎందుకు విచ్ఛిన్నమవుతోంది? దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు విడాకులే పరిష్కారమా...? వివాహ బంధాన్ని పది కాలాల పాటు పచ్చగా నిలుపుకోవాలంటే ఏం చేయాలి.. మీ అభిప్రాయాలు vasundhara.net వేదికగా పంచుకోండి..

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్